ఇప్పుడు నడుస్తోంది టెలికాం యుద్ధం. ఇది చిన్న మాట మహా యుద్ధం అనాలేమో! జియో భారత్లో అడుగుపెట్టిన నాటి నుంచి టెలికాం కంపెనీల మధ్య సమరం హోరాహోరీగా మారింది. జియోకు పోటీగా ఎయిర్టెల్, వొడాఫోన్, బీఎస్ఎన్ఎల్, ఐడియా ఒకదానితో ఒకటి పోటీపడుతూ మరీ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. మరి పండగ సమయాన్ని ఈ టెలికాం కంపెనీలు ఎందుకు వృథా చేసుకుంటాయి. వినియోగదారులను ఆకర్షించేందుకు ఇదే సరైన వేదికగా ఎంచుకుని..మంచి మంచి ఆఫర్లను ప్రకటించాయి. మరి టెలికాం కంపెనీలు పండగ సమయంలో ప్రకటించిన ఆఫర్లేమిటో చూద్దామా!
ఎయిర్టెల్, ఐడియా పోటాపోటీగా..
పండగను సొమ్ము చేసుకోవడం కోసం భారతీ ఎయిర్టెల్, ఐడియా పోటాపోటీగా రంగంలోకి దిగాయి. ఎయిర్టెల్ తన పోస్ట్ పెయిడ్ కస్టమర్ల కోసం మరోసారి భారీ ఆఫర్ ప్రకటించింది. జియోకు పోటీగా రాబోయే ఆరు నెలల పాటు 60 జీబీ ఉచిత డేటా అందించాలని ఈ సంస్థ నిర్ణయించుకుంది. ఇది సెప్టెంబర్ నుంచే అమల్లోకి వస్తుంది. మై ఎయిర్ టెల్ యాప్లోకి వెళ్లి మై ఎయిర్టెల్ టీవీని డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకుంటే చాలు ఆటోమెటిక్గా 60 జీబీ ఆఫర్ మీ ఫోన్కు ఇంప్లిమెంట్ అవుతుంది. ఇదే కాక రీఛార్జ్ ప్యాక్లలో 4జీ, 3జీ డేటాను రోజుకు 4 జీబీ వరకు ఇవ్వనుంది. ఇదేకాక డొమెస్టిక్ హ్యాండ్సెట్ మేకర్స్ లావా, కార్బన్లతో కలిసి ముందుకు వెళ్లాలని కూడా నిర్ణయించుకుంది. రూ.349తో రీఛార్జ్ చేయించుకుంటే 28 రోజుల పాటు 1జీబీ డేటా లభించనుంది. ఐడియా కూడా ఇదే బాటలో ఉంది. రీఛార్జ్ ప్యాక్లపై ఆఫర్లను ప్రటించిన ఆ సంస్థ.. తన ఇన్ఫోటైన్మెంట్ యాప్స్పై దృష్టి పెట్టింది. ఐడియా మ్యూజిక్, ఐడియా మూవీస్, ఐడియా గేమ్స్ను ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చనే ఆఫర్ ప్రకటించింది.
వొడాఫోన్ కూడా..
ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచిన జియో కూడా పోటీలో తానూ నిలిచింది. ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ సేల్ ద్వారా 4జీ ఎల్టీఈ డివైజ్లను కొన్న వారికి 60 జీబీ అదనపు డేటా ఇవ్వాలని నిర్ణయించింది. అమెజాన్లో రిలయన్స్ డిజిటల్ వస్తువులు కొన్నవారికి స్పెషల్ టారిఫ్ ప్లాన్స్తో పాటు ఐ ఫోన్ కొన్న వారికి బై బ్యాక్ ఆఫర్లను ప్రకటించింది. ఇక వొడాఫోన్ ఇంకా వినూత్నంగా ఆఫర్లను ఇస్తోంది. తొమ్మిది డిజిటల్ ఫ్లాట్ఫామ్స్లో పర్చజ్ చేసిన వారికి మూవీ టిక్కెట్లను ఆఫర్ చేస్తోంది. దిల్లీ ఎన్సీఆర్ కస్టమర్ల కోసం రోమ్ లైక్ హోమ్ ఆఫర్ ప్రకటించింది. ఇంటెల్, ఇంటెక్స్, లావాలతో ఒప్పందం చేసుకుని 2జీ ఫీచర్ ఫోన్ల కొనుగోళ్లపై క్యాష్ బ్యాక్లు ఇస్తోంది.