మొబైల్ వినియోగదారులకు ఇది శుభవార్తే. టెలికం ఆపరేటర్ల మధ్య ఇంటర్ కనెక్ట్ యూసేజ్ ఛార్జెస్ (IUC) తగ్గే అవకాశం ఉందని ట్రాయ్ వర్గాలు చెబుతుండడంతో మొబైల్ కాల్ రేట్లు తగ్గబోతున్నాయి. ఇంటర్కనెక్ట్ యూసేజ్ ఛార్జెస్ అంటే ఒక నెట్వర్క్ నుంచి మరో నెట్వర్క్కు కాల్ కనెక్ట్ చేసినప్పుడు పడే ఛార్జీ అన్నమాట. అంటే మీరు ఎయిర్టెల్ నుంచి రిలయన్స్కు కాల్ చేస్తే ఆ కాల్ను కనెక్ట్ చేసినందుకు రిలయన్స్ కు ఎయిర్టెల్ నిముషానికి 14 పైసలు పే చేయాలి.
పెద్ద కంపెనీలకు వేల కోట్ల ఆదాయం
అయితే ఈ ఛార్జీలు అసంబద్ధమని జియో వాదిస్తోంది. 4జీ VoLTE టెక్నాలజీతో డేటా బేస్డ్గా కాల్ చేసుకుంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో కూడా ఇలా ఇంతంత ఛార్జీలు కంపెనీకి మరో కంపెనీ చెల్లించడం ఏమిటని జియో ప్రశ్నిస్తోంది. ఇప్పటికే ఈ రంగంలో పాతుకుపోయిన కంపెనీలు కావాలని క్రియేట్ చేసిన అడ్డుగోడ ఈ IUC అని జియో కుండబద్దలు కొట్టి చెబుతోంది. ఎయిర్టెల్ గతేడాది ఈ ఛార్జీ లకింద ఇతర ఆపరేటర్ల నుంచి 10,279 కోట్లు సంపాదించడం, ఛార్జీలను 14 పైసల నుంచి 30 పైసలు చేయాలని డిమాండ్ చేయడం చూస్తుంటే జియో వాదన కరెక్టే అనిపిస్తుంది.
ఎయిర్టెల్కే దెబ్బ
IUC ఛార్జీలు 2003 సమయంలో 1.10 పైసల వరకు ఉండేవి. దాన్ని ట్రాయ్ దశలవారీగా తగ్గించుకుంటూ వచ్చింది. 2015 నుంచి 14 పైసలు ఛార్జి చేస్తున్నారు. తగ్గించింది. ఇప్పుడు 10 పైసల్లోపే తగ్గించాలని చూస్తోంది.ఇంటర్నెట్ బేస్డ్ కాల్స్కు అయితే ఈ ఛార్జీని 3పైసలకే పరిమితం చేయాలని ట్రాయ్ భావిస్తోంది. అదే జరిగితే ఎయిర్టెల్కే పెద్ద దెబ్బ. ఎందుకంటే దేశంలో అత్యధిక మంది సబ్స్క్రైబర్లున్నది ఎయిర్టెల్కే కాబట్టి ఇతర నెట్వర్క్ల నుంచి ఆ కంపెనీకి వచ్చే కాల్సే ఎక్కువ ఉంటాయి. కాబట్టి అవి ఎయిర్టెల్కు భారీగా చెల్లిస్తున్నాయి. ఇప్పుడు ఈ ఛార్జీలు తగ్గిస్తే ఎయిర్టెల్ వేల కోట్ల రూపాయల ఆదాయం కోల్పోయినట్లే. కానీ మొత్తంగా కాల్ రేట్లు తగ్గుతాయని టెలికాం వర్గాలు చెబుతున్నాయి.