రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ సంచలన ప్రకటన చేశారు. రిలయన్స్ జియో ఉన్నంత కాలం వినియోగదారుల నుంచి వాయిస్ కాల్స్ కు ఒక్క పైసా కూడా తీసుకోబోనని ఆయన ప్రకటించారు. వాటాదారులను ఉద్దేశించి మాట్లాడిన ఆయన జియో సేవలు అందుబాటులోకి వచ్చిన తరువాత రోజుకు 250 కోట్ల నిమిషాల కాల్స్ ను ఉచితంగా అందించామని వెల్లడించారు.
ప్రధాని నరేంద్ర మోదీ, డిజిటల్ ఇండియా కలను సాకారం చేయడంలో తన వంతు పాత్రను పోషిస్తానని చెప్పారు. అధునాతన సాంకేతికత దగ్గర చేస్తున్న సౌకర్యాలను తాను మారుమూల గ్రామాల ప్రజలకు అందిస్తానని స్పష్టం చేశారు. నెలకు 125 కోట్ల గిగాబైట్ల డేటాను తాము అందిస్తున్నామని, 65 కోట్ల వీడియో నిమిషాలను స్ట్రీమింగ్ చేస్తున్నామని ముఖేష్ పేర్కొన్నారు. మొబైల్ డేటా వినియోగంలో అమెరికా, చైనాలను ఇండియా దాటేసిందని ప్రకటించేందుకు తనకెంతో గర్వంగా ఉందని చెప్పారు.
జియో మార్కెట్లోకి రాకముందు మొబైల్ డాటా వినియోగంలో 156వ స్థానంలో ఉన్న ఇండియా, ప్రస్తుతం తొలి స్థానానికి ఎదిగిందని ముఖేష్ ప్రకటించారు. జియో సేవలను అందుకుంటున్న వారు ఉచిత సేవలను మాత్రమే పొందుతారని, డేటాకు డబ్బుల వసూలు ప్రారంభిస్తే, జియో పతనమవుతుందని వచ్చిన ఊహాగానాలు తప్పని రుజువయ్యాయని చెప్పారు. మార్చి నుంచి డేటాకు నియమిత మొత్తాన్ని వసూలు చే్యడం ప్రారంభించిన తరువాత, అత్యధిక యూజర్లు పెయిడ్ కస్టమర్లుగా మారారని, ఇప్పుడు 10 కోట్లకు పైగా పెయిడ్ కస్టమర్లకు తాము సేవలందిస్తున్నామని తెలిపారు.