వాట్సాప్ మన నిత్యజీవితంలో ఎంతగా పెనవేసుకుపోయిందో చెప్పడానికి మంచి ఉదాహరణ ఇది. సమాచారం షేర్ చేసుకోవడానికి ప్రజలందరూ బాగా యూజ్ చేసుకుంటున్న వాట్సాప్ను ఇప్పుడు కోర్టులు కూడా వినియోగించుకుంటున్నాయి. ఇప్పటి వరకు కోర్టులు సమన్ల కోసం ఈ-మెయిల్, ఫ్యాక్స్ను మాత్రమే వినియోగించేవి. అయితే ఇలా అయితే ఎక్కువ టైం పడుతోందని, ఆ లేట్ను తగ్గించేందుకు దేశంలోనే తొలిసారిగా చండీగఢ్లో ఓ కోర్టు వాట్సప్ ద్వారా సమన్లు పంపి టెక్నాలజీ వినియోగంలో కొత్త సంప్రదాయాన్ని ప్రారంభించింది.
ఆస్తి తగాదాలో..
హర్యానాలోని హిస్సార్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన సత్బీర్ సింగ్, రాం దియాల్, క్రిషన్ కుమార్ల అనే అన్నదమ్ముల మధ్య ఆస్తి వివాదం ఏర్పడింది. ఈ వ్యవహారం ఫైనాన్షియల్ కమిషనర్ న్యాయస్థానానికి వెళ్లింది. వీరికి రిజిస్టర్ పోస్టులో సమన్లు పంపగా క్రిషన్ కుమార్ నేపాల్ లోని కాట్మండ్ వెళ్లిపోయాడని తేలింది. అతనికి ఫోన్ చేసి కొత్త అడ్రస్ అడిగినా ఇవ్వలేదు. దాంతో వాట్సాప్ ద్వారా సమన్లు పంపాలని మేజిస్ట్రేట్ అశోక్ ఖేమ్కా గురువారం ఆదేశించారు. ఐపీసీ రూల్స్ ప్రకారం ఎలక్ట్రానిక్ మోడ్లోనూ సమన్లు పంపించవచ్చన్నారు. నిందితునికి పంపిన వాట్సాప్ మెసేజ్ వారికి చేరినట్లు డెలివరీ రిపోర్టు ప్రింట్ తీసి లాయర్ సైన్ చేసి ఇస్తే దాన్నే ఎవిడెన్స్గా స్వీకరిస్తామని తెలిపారు.