పాస్పోర్ట్.. ప్రతి ఒక్కరికి ఎంతో అవసరమైన డాక్యుమెంట్. అయితే పాస్పార్ట్ సంపాదించడం కూడా అంత సులభం కాదు. దీనికి ఎన్నో అవరోధాలు దాటాలి. నిబంధనలకు లోబడాలి. ముఖ్యంగా పోలీసు వెరిఫికేషన్లో మీరు పాస్ మార్కులు వేయించుకోవాలి. అప్పుడు పాస్పోర్టు మీ చేతిలో పడుతుంది. అయితే టెక్నాలజీ పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పడు పాస్పోర్ట్ ప్రక్రియ కూడా సులభం కానుంది. ఫిజికల్ పోలీస్ వెరిఫికేషన్ లేకుండానే పాస్పోర్ట్ పొందే అవకాశం రానుంది. దీని వల్ల మీకెంతో సమయం కలిసొస్తుంది. త్వరగా మీకు డాక్యుమెంట్ చేతిలో వస్తుంది.
కొత్త సిస్టమ్ వచ్చింది
పాస్పోర్ట్ ఇచ్చే ముందు ఎందుకు పోలీసు వెరిఫికేషన్ చేస్తారు? సదురు వ్యక్తి మీద ఏమైనా కేసులు ఉన్నాయా లేదా ఏదైనా గొడవల్లో ఇరుక్కొని ఉన్నాడా తదితర వివరాలు తెలుసుకోవడానికి, బ్యాక్గ్రౌండ్ చెక్ చేయడం కోసం పోలీసు వెరిఫికేషన్ చేస్తారు. అయితే పోలీసు వెరిఫికేషన్కు వచ్చేసరికే ప్రాక్టీకల్గా చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వెరిఫికేషన్కు వచ్చినవాళ్లు బాధ్యతగా పని చేయకపోవడం, లంచాలు అడగడం లాంటివి చాలా ఎక్కువవయ్యాయి. ఈ నేపథ్యంలో టెక్నాలజీ సాయంతో ఈ ప్రాబ్లమ్స్కు చెక్ పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో వచ్చిందే క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్స్ ప్రాజెక్ట్ (సీసీటీఎన్ఎస్) ఈ టెక్నాలజీ ద్వారా పోలీసు వెరిఫికేషన్ లేకుండా దేశ పౌరులెవరి గురించైనా తెలుసుకునే అవకాశం ఉంది. దీని వల్ల సమయం కూడా చాలా ఆదా అవుతుంది.
ఎలా పని చేస్తుందంటే...
ఈ క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్స్ ప్రాజెక్ట్ ఎలా పని చేస్తుందంటే ఆధార్ ఆధారంగా ప్రతి ఒక్కరి డిటైల్స్ చెక్ చేస్తారు అంతేకాదు దాదాపు 15 వేలకు పైగా పోలీస్ స్టేషన్ల రికార్డులు దీనిలో పొందుపరిచి ఉంటాయి. దీంతో ఆ వ్యక్తి పేరు కొట్టగానే వెంటనే మీకు వివరాలు తెలిసిపోతాయి. దీని కోసం పూర్తి పేరు, చిరునామా, ఫోన్ నంబర్, ఈమెయిల్ ఇలా అన్ని వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో మన ఇంటికి పోలీసును పంపి చెక్ చేయాల్సిన అవసరం ఉండదు. ఏమైనా అనుమానం వస్తే తప్ప పోలీసు వెరిఫికేషన్ మస్ట్ కాదు. త్వరలోనే తెలంగాణ ప్రభుత్వం ఈ కొత్త విధానాన్ని అమలు చేసే అవకాశాలున్నాయి.