ధర లేదని కూరగాయలు, పళ్లు రైతులు రోడ్ల మీద పారబోసి నిరసన తెలపడం మన దేశంలో నిత్యం ఎక్కడో చోట జరుగుతూనే ఉంటుంది. కిలో 100 రూపాయలమ్మిన టమాటా నాలుగు రోజులు తిరిగేసరికి 10 రూపాయలకు పడిపోతుంది. దీంతో రైతులు వాటిని అయినకాడికి అమ్ముకుని నష్టపోతున్నారు. ఈ పరిస్థితుల్లో కోల్డ్ స్టోరేజిల్లో స్టోర్ చేసుకుని మంచి రేట్ వచ్చినప్పుడు అమ్ముకునే ఫెసిలిటీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇప్పుడు ఓ ఇండియన్ కంపెనీ మరో అడుగు ముందుకేసి ఏకంగా వెయ్యి రోజులపాటు పళ్లు, కూరగాయలు తాజాగా ఉండేలా బ్లాక్బాక్స్ అనే కొత్త టెక్నాలజీని తీసుకురాబోతోంది.
ఏంటీ బ్లాక్బాక్స్?
సాధారణంగా కోల్డ్ స్టోరేజీల్లో ఫ్రూట్స్, వెజిటబుల్స్ పాడవకుండా నైట్రోజన్ వాడతారు. కానీ బ్లాక్ బాక్స్ టెక్నాలజీలో నైట్రోజన్ గానీ మరే ప్రిజర్వేటివ్గానీ వాడరు. కూరగాయలు, పళ్లలో ఉండే సహజ గుణాలతోనే వెయ్యి రోజులపాటు ఎలాంటి పోషక విలువలు కోల్పోకుండా నిల్వ ఉంచడం బ్లాక్ బాక్స్ టెక్నాలజీ ప్రత్యేకత. విజ్టర్ అగ్రిటెక్కు చెందిన సాహిల్ పీర్జాదా, సచిన్ అధికారి.. స్పెయిన్ బేస్డ్ నైస్ ఫ్రూట్స్తోఈ బ్లాక్బాక్స్ టెక్నాలజీ కోసం టైఅప్ కుదుర్చుకున్నారు. స్పెయిన్ సైంటిస్ట్లు డెవలప్ చేసి ఈ బ్లాక్ బాక్స్ టెక్నాలజీని ఎలాంటి కోల్డ్ స్టోరేజ్ లేదా ఫ్యాక్టరీలోనైనా ఈజీగా సెట్ చేసుకోవచ్చు. పళ్లు, కూరగాయలు, మాంసం ఇలా తినే వస్తువులేవైనా వెయ్యి రోజులపాటు స్టోర్ చేసుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఈ టెక్నాలజీని టెస్ట్ చేశారు.
హైదరాబాద్తో స్టార్టింగ్
హిందూస్థాన్ ఎల్ఎన్జీతో కలిసి ఇండియాలో ఫస్ట్ హైదరాబాద్లో రెండు ప్లాంట్లు పెడుతున్నామని ఫీర్జాదా చెప్పారు. తర్వాత మహారాష్ట్ర, యూపీల్లో పెడతామన్నారు. ఈ తరహా స్టోరేజ్తో రైతులు నాలుగు రెట్లు ఎక్కువ ఆదాయాన్ని పొందవచ్చని చెబుతున్నారు. ఇనీషియల్ స్టేజ్లో రోజుకు 30 టన్నుల స్టోరేజీ కెపాసిటీ ఉంటుందని, తర్వాత దీన్ని 1000 టన్నులకు పెంచే ప్లాన్స్ ఉన్నాయని ఫీర్జాదా అన్నారు.