లాక్డౌన్తో దాదాపు 70 రోజులకు పైగా దేశంలోని అన్ని ఆలయాలూ మూతపడ్డాయి. నిత్యపూజలను అర్చకులు మాత్రమే వెళ్లి చేశారు. భక్తులకు ప్రవేశం నిషేధించారు. ఏదైనా సేవలు చేయించాలంటే ఆన్లైన్లో డబ్బులు కడితే భక్తులు లేకుండానే వారి పేర్లమీద అర్చుకులే చేయించారు. ఇప్పుడు లాక్డౌన్ 5.0లో జూన్ 8 తర్వాత ఆలయాలకు భక్తులు వెళ్లడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే ఇందుకు కొన్ని నిబంధనలు కూడా విధించింది.
సచివాలయాల్లోనే ముందుగా బుకింగ్
అనుమతి వచ్చింది కాబట్టి చాలామంది తిరుమల, అన్నవరం, విజయవాడ దుర్గమ్మ గుడి, శ్రీకాళహస్తి, శ్రీశైలం లాంటి ప్రధాన ఆలయాలకు వెళ్లడానికి కూడా సిద్ధమవుతున్నారు. ఈ పరిస్థితుల్లో భక్తులు అక్కడ సేవా టికెట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయాల్లో ముందుగా బుక్ చేసుకోవచ్చు. అలాగే అక్కడ ఉండటానికి కాటేజీలు, అద్దె గదులు కూడా ఇక్కడి నుంచే బుక్ చేసుకునే అవకాశం కల్పించారు.
వాట్సాప్ మెసేజ్లు
గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆలయ దర్శన, సేవల టికెట్లు, రూమ్ బుకింగ్లను ఏ వార్డుకు అక్కడే ఉండే వార్డు సచివాలయాల్లో ముందస్తుగానే బుకింగ్ చేసుకుని వెళ్లొచ్చు. అలాగే గ్రామాల్లో గ్రామ సచివాలయాల్లో ఈ సేవలను అందుబాటులోకి తెచ్చారు. గ్రామ, వార్డు వాలంటీర్లు దీనిపై ప్రచారం చేస్తున్నారు. తమ పరిధిలో ఉండే ప్రజలకు వాట్సాప్ గ్రూప్ల ద్వారా ఈ సమాచారాన్ని చేరవేస్తున్నారు.