సమాచార సాంకేతిక విప్లవం చేయూతతో ఎన్నో అద్భుతాలు చేయవచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. మాస్టర్ కార్డ్ సంస్థ రూపొందించిన ‘‘ఇ-రైతు డిజిటల్ మార్కెట్ నెట్వర్క్’’ను నిన్న ఉండవల్లి ప్రజావేదికపై ఆయన ప్రారంభించారు. ఈ నెట్వర్క్ అనుసంధానం కోసం మాస్టర్ కార్డ్ ప్రత్యేకంగా QR కోడ్ను రూపొందించింది. ఆంధ్రప్రదేశ్లో రైతు సేవల దిశగా మాస్టర్ కార్డ్ సంస్థతో ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా మాస్టర్ కార్డ్ సంస్థ. ‘ఇ-రైతు’ పేరిట ఫార్మర్ నెట్వర్క్ను ప్రారంభిస్తోంది. ఈ నెట్వర్క్ ప్లాట్ఫామ్కు సంబంధించిన బ్రోచర్ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. రాష్ట్ర వ్యవసాయ రంగంలో సాంకేతికతను విస్తృతంగా వినియోగించుకుంటున్నామని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. ఈ స్థాయిలో IT, IoTలను వాడుకుంటున్న రాష్ట్రం దేశంలోనే మరేదీ లేదన్నారు. భూగర్భ జలమట్టం నుంచి పిడుగుపాటుపై ముందస్తు సమాచారందాకా రియల్ టైమ్లో పొందుపరిచే వ్యవస్థలను ఏర్పరచుకున్నామని చెప్పారు. జీరో బడ్జెట్ ప్రకృతి వ్యవసాయాన్ని పెద్దఎత్తున ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. సహజసిద్ధ సేద్య విధానాలను కచ్చితంగా అనుసరించాల్సిన పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయన్నారు. మనం తినే తిండిలో సగానికిపైగా రసాయనాలు ఉంటున్నాయని చెప్పారు. తినే తిండి, పీల్చేగాలి, నివసించే పరిసరాలు పూర్తిగా కలుషితమైపోతుండటం ఆందోళనకరమన్నారు. దీన్ని గమనించి ప్రకృతి సహజ వ్యవసాయానికి వెళ్లామని, ఇంధన రంగంలో సంప్రదాయేతర వనరులద్వారా సౌర, పవన విద్యుదుత్పత్తిని పెద్దఎత్తున చేపట్టామని వివరించారు. ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ పార్కును రాష్ట్రంలో నెలకొల్పుతున్నామని వెల్లడించారు.
ఇ-రైతు డిజిటల్ నెట్వర్క్ ప్లాట్ఫామ్ ఏర్పాటు ఒక విప్లవమని పేర్కొన్నారు. మాస్టర్ కార్డ్ నిర్వాహకులు తనను ఎప్పుడు కలిసినా రైతు ప్రయోజనకర సాంకేతికతను తేవాల్సిందిగా కోరేవాడినని చెప్పారు. ఆర్థిక, సాంకేతిక రంగాల్లో వారు ఉద్దండులని, రైతు కోసం డిజిటల్ వేదికను పరిచయం చేస్తుండటం గర్వకారణమని ప్రశంసించారు. ఈ విధానం మొట్టమొదట మన రాష్ట్రంలోనే ప్రారంభం కావడం విశేషమని పేర్కొన్నారు. సాగు వివరాలు, ఉత్పత్తుల వివరాలను ‘ఇ-రైతు’ డిజిటల్ మార్కెట్ ద్వారా తెలుసుకుంటూ ప్రపంచంలో ఎక్కడైనా తమ దిగుబడులను విక్రయించుకునే అవకాశం రైతులకు లభిస్తుందన్నారు. రైతులకు మార్గదర్శిగా, సలహాలిచ్చే స్నేహితునిగా ‘ఇ-రైతు’ పనిచేస్తుందని చెప్పారు. వ్యవసాయదారులకు ప్రపంచ మార్కెటింగ్ సదుపాయాలను కల్పిస్తూ వారికి రెట్టింపు ఆదాయాన్ని అందించాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేరుస్తుందని చెప్పారు. ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్లతో కలసి రాష్ట్ర వ్యవసాయ రంగంలో పెనుమార్పులు తెస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరికీ ఆహార భద్రత కల్పించాలంటే రాష్ట్రంలో వ్యవసాయ రంగం స్వయం సమృద్ధం కావాలన్నారు. రైతులు రెట్టింపు ఆదాయంతో సంతృప్తికరంగా జీవించాలన్నారు. అందుకే వ్యవసాయానుబంధ పాడి, మత్స్య, పశుపోషక రంగాలను ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. అలాగే ఆహార తయారీ పరిశ్రమలకూ ఊతమిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ప్రతి ఎకరానూ తడపాలన్నదే ప్రభుత్వ సంకల్పంగా పేర్కొన్నారు. ప్రస్తుత హవా ఇ-మార్కెట్లదేనని... అలీబాబా, ఫ్లిప్కార్ట్, అమెజాన్, ఊబర్ విజయగాధలు ఎందరో ఔత్సాహిక పారిశ్రామికులకు స్ఫూర్తినిస్తున్నాయని చెప్పారు. ‘ఇ-రైతు’ను మాస్టర్ కార్డ్ సంస్థ వ్యాపారం కోసం ప్రవేశపెట్టలేదని, రైతుపై శ్రద్ధ, వ్యవసాయం పట్ల ప్రేమతో ఈ ప్లాట్ఫామ్ను ఏర్పాటు చేసిందని చెప్పారు. ప్రవాసులు సొంత నేల రుణం తీర్చుకోవాలని, జన్మభూమిలో సొంతవారికి కొంత తోడ్పాటు ఇవ్వాలన్న తపనతో ముందుకురావాలని పిలుపునిచ్చారు. ‘ఇ-రైతు’ తరహా వినూత్న ప్రయోగాలకు సిద్ధమైతే యువతకు స్టార్టప్స్ ఏర్పాటులో సహకరిస్తామని చెప్పారు. ప్రకృతి సేద్యంలో ఏపీ అగ్రగామిగా ఉందని, రానున్న కాలంలో 2 కోట్ల ఎకరాలలో ప్రకృతి సేద్యానికి వెళుతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు.
వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ - రైతు తన పొలం నుంచే పంటలను నేరుగా ప్రపంచంలో ఎక్కడైనా విక్రయించుకునే అవకాశాన్ని ‘ఇ-రైతు’ ప్లాట్ ఫామ్ కల్పిస్తుందన్నారు. రైతు శ్రేయస్సు కోసం నిరంతరం తపించే ముఖ్యమంత్రి చంద్రబాబేనని ఈ సందర్భంగా కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ కార్డ్ సౌత్ ఆసియా మార్కెట్ డెవలప్మెంట్ వైస్-ప్రెసిడెంట్ రాజీవ్ కుమార్, వ్యూహాత్మక వృద్ధి వైస్ ప్రెసిడెంట్ ఆంటోనియా స్ట్రోహ్, ల్యాబ్ వైస్-ప్రెసిడెంట్ సలా గోస్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ ఎల్.వి.ఎస్.ఆర్.కె.ప్రసాద్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, ముఖ్యమంత్రి కార్యదర్శి ఎ.వి.రాజమౌళి, ఉద్యానశాఖ కార్యదర్శి చిరంజీవి చౌదరి, సమాచార శాఖ కార్యదర్శి రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
-శిరందాసు నాగార్జున