మొబైల్ నెంబర్ ఆధార్ తో లింక్ చేసే విషయంపై అన్ని వైపులనుండి తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యం లో భారత ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. ఫోన్ నెంబర్ తో ఆధార్ ను లింక్ చేయమని సుప్రీంకోర్టు ఎప్పుడూ అడగలేదని భారత ప్రభుత్వం ప్రకటించింది. అంటే ఇకపై టెలికాం కంపెనీలు తమ వినియోగదారుల మొబైల్ నెంబర్ తో ఆధార్ ను లింక్ చేయమని అడగవు అన్నమాట. దీనికి అనుబంధం గా అన్నట్లు ఒక సెక్యూరిటీ రీసెర్చర్ ఒక సంచలన విషయాన్ని వెల్లడించాడు. తెలిసో, తెలియకో ఆంధ్ర ప్రదేశ ప్రభుత్వం కొన్ని లక్షల మంది పౌరుల ఆధార్ సమాచారాన్ని లీక్ చేస్తుందని అతను ఆరోపిస్తున్నాడు. ఇలాంటి ప్రకటనలు, ఆరోపణలు వస్తున్న వేళ ఆధార్ యొక్క సెక్యూరిటీ మరియు విశ్వసనీయత పైనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. వీటికి సంబందించిన పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో చూద్దాం.
ఆధార్ లింకింగ్ తప్పనిసరి కాదా?
ఆధార్ యొక్క సెక్యూరిటీ మరియు ప్రైవసీ కి సంబందించిన కేసు పై విచారణ చేస్తున్న ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం మొబైల్ నెంబర్ లకు ఆధార్ నెంబర్ లింక్ చేయాల్సిన అవసరం లేదని చెప్పిందని భారత ప్రభుత్వం వెల్లడించింది. ఈ కేసు లో ప్రభుత్వం తరపున వాదిస్తున్న సీనియర్ అడ్వకేట్ అయిన రాకేష్ ద్వివేది ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. సుప్రీం కోర్ట్ ఆదేశాల ప్రకారమే మొబైల్ నెంబర్ తో ఆధార్ ను లింక్ చేస్తున్నామని ఇప్పటివరకూ ప్రభుత్వం చెప్పుకుంటూ వస్తున్న నేపథ్యం లో ఈ ప్రకటన ప్రాముఖ్యతను సంతరించుకుంది.అయితే ఆధార్ మరియు టెలిగ్రాఫ్ చట్టం లోని సెక్షన్ 4 ప్రకారమే తాము మొబైల్ తో ఆధార్ లింకింగ్ ను కోరడం జరిగిందని ద్వివేది చెప్పారు. ఇకపై తప్పనిసరిగా ఆధార్ లింక్ చేయాలంటూ మొబైల్ ఆపరేటర్ లను అడగబోమని కూడా ప్రభుత్వం వెల్లడించింది.
ఆంధ్ర ప్రదేశ్ లో ఆధార్ డేటా లీక్ అయిందా ?
అయితే ఇక్కడే ఆంధ్రప్రదేశ్ కు సంబందించిన మరొక ఆసక్తికరమైన అంశం వెలుగు లోనికి వచ్చింది. తెలిసో తెలియకో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన యొక్క అధికారిక వెబ్ సైట్ నుండి సుమారుగా 1.3 లక్షల ఆధార్ డేటా ను లీక్ చేస్తుందంటూ కొడాలి శ్రీనివాస్ అనే ఒక సెక్యూరిటీ రీసెర్చర్ క్లెయిమ్ చేసాడు. ఈయన చెబుతున్న దాని ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ వెబ్ సైట్ లో బెనిఫిషియరీ డీటెయిల్స్ అనే ఒక డాక్యుమెంట్ ఉంటుంది. ఇందులో హుద్ హుద్ స్కీం మరియు అర్బన్ హౌసింగ్ స్కీం కు సంబందించిన ఎంట్రీ రిపోర్ట్ లు ఉంటాయి. ఈ ఫైల్ లో లబ్దిదారుల యొక్క ఆధార్ డేటా, IFSC కోడ్ లతో సహా బ్యాంకు ఎకౌంటు ల యొక్క వివరాలు, కులం, మతం ఇలాంటి అనేక రకాల సున్నితమైన వివరాలు ఉంటాయి. ఇది చాలా రహస్యమైన ఫైల్. మరియు ఉన్నతస్థాయి అధికారులకు మాత్రమే దీనికి యాక్సెస్ ఉంటుంది. అయితే కొడాలి శ్రీనివాస్ చెబుతున్నాడని ప్రకారం ఇది యాక్సెస్ చేయడానికి చాలా సులువుగా ఉంది, మరియు ఎవరైనా చాలా సింపుల్ గా దీనిని ఓపెన్ చేసి చూడవచ్చు. ఇంత బహిరంగంగా యాక్సెస్ లభిస్తుంది అంటే అది ఖచ్చితంగా ప్రభుత్వానికి తెలిసి జరిగి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇందులో ఏదైనా కుట్ర కోణం లాంటిది ఉంటే రహస్యం గా చేస్తారు కానీ బహిరంగపరచుకోరు కదా! ఇందులో కొసమెరుపు ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతమైన మంగళగిరి లో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు చేతుల మీదుగా ఆంధ్రప్రదేశ్ సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్ ప్రారంభించిన మరుసటి రోజే ఈ లీక్ జరగడం విశేషం.