దేశంలో 4జీ సేవలు అమితవేగంతో దూసుకుపోతుంటే ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ మాత్రం ఇంకా 3జీలోనే ఉండిపోయింది. అన్ని టెలికాం దిగ్గజాలు 4జీ ద్వారా యూజర్లను ఆకట్టుకుంటుంటే బిఎస్ఎన్ఎల్ మాత్రం ఇంకా 3జీలోనే ఉంటూ వినియోగదారులను కోల్పోతూ వస్తోంది. అదీకాక ఈ మధ్య ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేని స్థితికి తయారైంది. ప్రభుత్వ రంగ దిగ్గజం అనే పేరు తప్ప దానికి ఏమీ మిగలలేదు. అయితే ఇప్పుడు అలర్ట్ అయిందేమో.. బీఎస్ఎన్ఎల్ కూడా 4జీ సేవలను అన్ని రాష్ట్రాల్లోనూ ప్రారంభించనుంది. అందులో భాగంగానే ఆ సంస్థ ఏపీలో 4జీ సేవలను లాంఛనంగా ప్రారంభించింది.
ఏపీలో బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలను ప్రారంభించడంతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మొత్తం 350 టవర్లను 4జీకోసం ఏర్పాటు చేశారు. ఇక ఇప్పటికే 3జీ వాడుతున్న బీఎస్ఎన్ఎల్ వినియోగదారులు తమ సిమ్ కార్డులను 4జీకి అప్గ్రేడ్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. ఈ క్రమంలో 4జీకి అప్గ్రేడ్ అయిన కస్టమర్లకు బీఎస్ఎన్ఎల్ ఉచిత డేటాను కూడా అందిస్తోంది.
ఇక ప్లాన్ల విషయానికి వస్తే.. 3జీ డేటాకు అందించే టారిఫ్లనే 4జీ డేటాకు కూడా ఇస్తున్నారు. అయితే ఇతర టెలికాం సంస్థల్లో ఇప్పటికే 4జీ వీవోఎల్టీఈ సేవలు ప్రారంభమయ్యాయి కానీ.. ఏపీలో బీఎస్ఎన్ఎల్ 4జీ వీవోఎల్టీఈ సేవలను అందించే విషయంపై స్పష్టతనివ్వలేదు. కానీ 4జీ ఎల్టీఈ సేవలు మాత్రం ఆ రాష్ట్ర వినియోగదారులకు లభిస్తున్నాయి. ఇక దేశంలోని మిగిలిన సర్కిల్స్లో ఎప్పటి నుంచి 4జీ సేవలు అందుబాటులోకి వస్తాయనే విషయాన్ని బీఎస్ఎన్ఎల్ ఇంకా వెల్లడించలేదు. త్వరలోనే ఆ వివరాలు తెలిసే అవకాశం ఉంది.
ఇదిలా ఉంటే ఎంటీఎన్లో పనిచేస్తున్న 1.98లక్షల మంది ఉద్యోగస్తులకు జూలై నెలకు సంబంధించి జీతాలు ఇంకా చెల్లించలేదని యూనియన్ లీడర్ ఆరోపిస్తున్నారు. బీఎస్ఎన్ఎల్లో 1.76 లక్షల మంది ఉద్యోగస్తులు ఉండగా... ఎంటీఎన్ఎల్లో 22వేల మంది ఉద్యోగులు ఉన్నారు. సాధారణంగా ఉద్యోగస్తుల జీతాలు ప్రతినెలా చివరిరోజున వారి వారి అకౌంట్లలో క్రెడిట్ అవుతుంది. అయితే ఈ సారి మాత్రం ఇంకా క్రెడిట్ కాకపోవడంతో ఉద్యోగస్తుల్లో ఆందోళన నెలకొంది. ఇలా జరగడం ఇది రెండో సారి కావడంతో ఉద్యోగస్తుల్లో ఆ ఆందోళన తారాస్థాయికి చేరింది. ఫిబ్రవరి నుంచి మార్చి మధ్య వరకు తమ ఉద్యోగస్తులకు జీతాలు చెల్లించలేదు బీఎస్ఎన్ఎల్ మరియు ఎంటీఎన్ఎల్. ఇందుకు కారణం అందులో నెలకొన్న ఆర్థిక సంక్షోభమే అని తెలుస్తోంది. బీఎస్ఎన్ఎల్ నెలవారీ జీతాల బిల్లు రూ. 750 కోట్లు నుంచి 850 కోట్ల మధ్య ఉంటుంది. ఎంటీఎన్ఎల్ బిల్లు రూ. 160 కోట్లుగా ఉంది.