కరోనా వైరస్ రోగులకు మనం ఎంత దగ్గరగా ఉన్నామో చెప్పి మనల్ని అప్రమత్తం చేసేందుకు సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన ఆరోగ్యసేతు యాప్ గురించి రోజూ ఓ కొత్త అప్డేట్ వస్తుంది. రెండు రోజుల క్రితం సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులంతా ఈ యాప్ తప్పనిసరిగా డౌన్లోడ్ చేసుకోవాల్సిందేనని ఆర్డర్స్ వచ్చాయి. దానిలో సేఫ్ అని వస్తేనే ఆఫీస్కి రావాలని కూడా చెప్పారు. తాజాగా లాక్డౌన్ రెండు వారాలు పొడిగించిన కేంద్ర ప్రభుత్వం ఆరోగ్యసేతు యాప్ మీద మరో ముఖ్యమైన అప్డేట్ ఇచ్చింది.
ప్రైవేట్ ఉద్యోగులకూ తప్పనిసరి
కొత్త ఆదేశాల ప్రకారం దేశంలోని ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే కాదు ప్రైవేట్ కంపెనీల ఉద్యోగులు కూడా ఆరోగ్యసేతు యాప్ను తప్పనిసరిగా డౌన్లోడ్ చేసుకోవాల్సిందే. కేంద్ర హోం శాఖ ఈ విషయాన్ని చెప్పింది.
ప్రతి కార్యాలయం లేదా కంపెనీలో హెడ్ ఆఫ్ ది ఇనిస్టిట్యూషన్ దీనికి బాధ్యత తీసుకోవాలని క్లియర్గా చెప్పేసింది. తమ ఎంప్లాయిస్ అందరూ ఆరోగ్యసేతు యాప్ డౌన్లోడ్ చేసుకున్నారని వారు సమాచారం ఇవ్వాలని ఆదేశించింది.
డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ -2005కింద ఈ ఆర్డర్స్ ఇస్తున్నామని తప్పనిసిరగా పాటించాలని ఆర్డర్ చేసింది.
గ్రీన్, ఆరెంజ్, రెడ్ అనే తేడా లేకుండా దేశంలో ఉద్యోగులందరూ ఆరోగ్యసేతు యాప్ తప్పనిసరిగా డౌన్లోడ్ చేసుకోవాలని స్పష్టంగా ఆదేశాలు పంపింది.
కంటెయిన్మెంట్ జోన్లలో అందరికీ
ఇక కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను ప్రభుత్వాలు కంటెయిన్మెంట్ జోన్లుగా ప్రకటిస్తున్నాయి. అక్కడ ప్రత్యేకమైన నిబంధనలు అమల్లో ఉంటాయి. అలాంటి చోట్ల ప్రజలందరి స్మార్ట్ఫోన్లలోనూ ఆరోగ్యసేతు యాప్ ఉండాల్సిందేనని కూడా కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ బాధ్యతను అక్కడ స్థానిక అధికారులే తీసుకోవాలని కూడా స్పష్టంగా ఆదేశాల్లో చెప్పింది.