ఆరోగ్యసేతు యాప్ యూజర్ల పర్సనల్ డేటాను ఎవరైనా దుర్వినియోగం చేస్తే జైలు శిక్ష తప్పదని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ ఈ విధంగా ఆదేశాలిచ్చింది. కరోనా వైరస్ ఉన్న రోగిని ట్రాక్ చేసేందుకు ప్రభుత్వం డిజైన్ చేయించిన ఈ యాప్ను ప్రజలంతా వాడాలని ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులు ఈ యాప్ తప్పనిసరిగా వాడాల్సిందేనని స్పష్టం చేయడంతో దాదాపు 10 కోట్ల డౌన్లోడ్స్ ఇప్పటికే వచ్చాయి.
డేటా మిస్యూజ్ అవుతుందా?
ఆరోగ్యసేతులో పర్సనల్ డేటా మిస్యూజ్ అవుతుందని యూజర్లలో ఆందోళన ఉంది. ఆరోగ్యసేతు యాప్లో చాలా లొసుగులు ఉన్నాయని, సైబర్ నేరగాళ్లు వాటిని తమకు అనుకూలంగా మార్చుకునే ప్రమాదముందని ఫ్రెంచ్ హ్యాకర్ ఎలియోట్ అల్డెర్సన్ ఇటీవల కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. దాంతో.. చాలా మంది నెటిజన్లు ఆరోగ్య సేతు వినియోగానికి వెనుకంజ వేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో యూజర్లలో నమ్మకం కలిగించడానికి కేంద్ర ఐటీశాఖ ‘ప్రైవసీ పాలసీ’ని రిలీజ్ చేసింది.
ప్రైవసీ పాలసీలో ఏముంది?
* ఆరోగ్యసేతు యాప్లోని సమాచారాన్ని యాక్సెస్ చేసే అధికారం కొందరు అధికారులకే ఉంటుంది. ఎవరైనా ఆ డేటాను దుర్వినియోగం చేస్తే.. జైలు శిక్ష తప్పదు.
* ఆరోగ్య సేతులో ఉండే యూజర్ డేటాను 180 రోజుల తర్వాత తొలగించేస్తారు.
* యూజర్లు కావాలనుకుంటే .. నెలరోజుల్లోనే వారి డేటా డిలీట్ అవుతుంది.
* లాక్డౌన్ తర్వాత విమాన ప్రయాణాలు చేసేవారు, ప్రస్తుతం ప్రత్యేక రైళ్లలో వెళ్లేవారు ఆరోగ్యసేతు యాప్ను తమ స్మార్ట్ఫోన్లో తప్పనిసరిగా ఇన్స్టాల్ చేసుకోవాలని కేంద్రం ఆదేశించబోతోంది.