ప్రభుత్వోద్యోగులు లంచాలు తీసుకుంటూ పట్టుబడటం మనం చూస్తుంటాం. కానీ విచిత్రంగా సాఫ్ట్వేర్ దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్ ఉద్యోగులు ముగ్గురు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. అదీ ఏకంగా 15 లక్షల రూపాయల లంచం. ఇంతకీ ఏం జరిగింది? అసలు ఇన్ఫీ ఉద్యోగులకు లంచం ఎవరిచ్చారు? ఎందుకిచ్చారు?
ఏం జరిగింది?
బెంగుళూర్లో ఇన్ఫోసిస్లో పని చేస్తున్న రేణిగుంట కళ్యాణ్కుమార్, ప్రకాష్, దేవేశ్వర్ రెడ్డి.. ఇన్కమ్ ట్యాక్స్ రిఫండ్స్ త్వరగా ఇప్పిస్తామని టాక్స్ పేయర్స్ నుంచి లంచాలు అడగడం మొదలుపెట్టారు. పెద్దపెద్ద టాక్స్ పేయర్స్కు ఫోన్లు చేసి మీకు అక్రమమార్గంలో టాక్స్ రీఫండ్స్ ఎక్కువగా, త్వరగా వచ్చేలా చేస్తాం. వచ్చిన అమౌంట్లో మాకు 4% ఇవ్వండి అని బేరం పెడుతున్నారు. మామూలుగా రిఫండ్స్ రావడానికి 60 రోజుల వరకు టైమ్ పడుతుంది. వీళ్లు వెంటనే ఇప్పిస్తామంటున్నారు. ఓ వ్యక్తి వీళ్లను పట్టించాలని పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఆదివారం పోలీసులు వచ్చి వాళ్లను అరెస్ట్ చేశారు.
ఎలా జరిగిందంటే
ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కు టెక్నికల్ బ్యాకప్ ఇన్ఫోసిస్ అందిస్తోంది. అంటే టాక్స్పేయర్స్ డేటాను వాళ్లు యాక్సెస్ చేసే అవకాశం ఉంటుంది. అలా వీళ్లు ముగ్గురూ ఆ డేటాను యాక్సెస్ చేసి ఎక్కువ మొత్తంలో ట్యాక్స్ కట్టేవారికి ఫోన్లు చేసి మీకు డబ్బులు వచ్చేలా చేస్తాం.. మాకు కొంత లంచమివ్వండి అని బేరాలు కుదుర్చకుంటున్నారు. నెలకు పైగా ఈ తతంగం నడిపిస్తున్నారని పోలీసులు గుర్తించారు. 15 లక్షలు సంపాదించారని, ఇందులో 12 లక్షలతో కాస్ట్లీ గ్యాడ్జెట్స్ కొని, జల్సా చేశారని పోలీసులు గుర్తించారు.
420 కేసు
ఈ ముగ్గురు టెకీలను పోలీసులు అరెస్టు చేశారు. చీటింగ్, డేటా బ్రీచ్ వంటి నేరాల కింద కేసులు పెట్టామని బెంగళూరు సౌత్ ఈస్ట్ డివిజన్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ జోషి శ్రీనాథ్ మహదేవ్ చెప్పారు. వీరికి జడ్జి 14 రోజుల రిమాండ్ వేశారు.