సైబర్ క్రిమినెల్స్ ఏ రూపాన అయినా మన బ్యాంకులో డబ్బులను కొల్లగొట్టేస్తారు. మనం ఆన్ లైన్లో పేమెంట్ ఆర్డర్ ఇచ్చిన వెంటనే మన వివరాలను తస్కరించి మన అకౌంట్లో మొత్తాన్ని ఊడ్చిపారేస్తారు. ఇలాంటి కథే ఓ మహిళకు ఎదురయింది. ఇంటర్నేషనల్ బ్యాంకులో పనిచేసే మహిళ ఆన్ లైన్ లో ఆర్డర్ చేసినందుకు గానూ దాని పేమెంట్ ఆన్ లైన్లో చెల్లించినందుకు గానూ రూ. 87 వేలు హ్యాకర్లకు సమర్పించుకుంది.
ముంబైలో నివసించే రాధికా పరేఖ్ ఒక అంతర్జాతీయ బ్యాంకులో పనిచేస్తోంది. ఈమె ఆన్లైన్లో బీర్లకు ఆర్డరిచ్చి ఘోరంగా మోసపోయింది. ఆగస్టు 17న ఆఫీసు నుంచి ఇంటికి వచ్చిన తర్వాత సాయంత్రం ఆన్లైన్లో వైన్ షాపు కోసం ఆమె సెర్చ్ చేసింది. ఒక లిక్కర్ షాప్ పేరు లభించడంతో ఆన్లైన్లో మూడు బీర్లకు ఆమె ఆర్డర్ పెట్టింది. ఫోన్ కాల్ తీసుకున్న వ్యక్తి తాను లిక్కర్ షాపు ఉద్యోగినని పరిచయం చేసుకున్నాడు. ఆన్లైన్లో పేమెంట్ చేయాలని ఆమెను కోరాడు. గూగుల్ పేలో పేమెంట్ చేయాలని కోరి ఆమె యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్(యుపిఐ) ఐడిని అడిగాడు. పేమెంట్ రిక్వెస్ట్ రాగానే ఆమె యాక్సెప్ట్ చేసింది.
దీని తర్వాత ఆమె అకౌంట్లో నుంచి రూ. 29,001 డెబిట్ అయ్యాయి. ఇంత పెద్ద మొత్తం డెబిట్ కావడంతో కంగారుపడిన ఆమె వెంటనే లిక్కర్ షాపుకు ఫోన్ చేసింది. జరిగిన పొరపాటుకు క్షమాపణ చెప్పిన ఆ ఉద్యోగి ఆ డబ్బు వాపసు చేస్తానని హామీ ఇచ్చాడు. అయితే..ఆమె ఆ ఫోన్ కాల్ను డిస్కనెక్ట్ చేసిన మరుక్షణమే రెండు వేర్వేరు లావాదేవీలలో రూ. 58,000 ఆమె అకౌంట్ నుంచి మళ్లీ డెబిట్ అయ్యాయి. ఆ తర్వాత ఆమె ఆ లిక్కర్ షాపు నెంబర్కు ఎన్నిసార్లు కాల్ చేసినా అందుబాటులోకి రాలేదు. వెంటనే ఆమె పొవాయి పోలీసు స్టేషన్ను సంప్రదించి ఫిర్యాదు చేశారు. ఐపిసి, ఐటి చట్టం ప్రకారం చీటింగ్ కేసును పోలీసులు నమోదు చేశారు.
ఇదిలా ఉంటే ఇలానే ఇంతకు ముందు కూడా Anil Padam Singh అనే వ్యక్తి digital wallet account ఫ్రాడ్ తో లక్ష రూపాయలు లాస్ అయ్యాడు. ఈ మధ్య గూగుల్ పే నోటిఫికేషన్ ఫీచర్ ని యాడ్ చేసింది. దీని ద్వారా హ్యాకర్లు సులువుగా వారి అకౌంట్లను హ్యాక్ చేయగలుతున్నారు. వారికి రిక్వెస్ట్ పెట్టి యాక్సప్ట్ చేయగానే బ్యాంకులో ఉన్న మొత్తాన్ని లాగేస్తున్నారు. ఈ విషయం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు పిలుపునిస్తున్నారు.