ఎక్కడ చూసినా ఆన్లైన్ మోసాలే. కాస్త ఆదమరుపుగా ఉంటే మీ బ్యాంకు అకౌంట్లు ఊడ్చిపారేయడానికి సైబర్ క్రిమినల్స్ కాచుకుని కూర్చుంటున్నారు. ఇవి చాలదన్నట్లు కొన్ని బ్యాంకుల నిర్లక్ష్యం కూడా ఖాతాదార్ల పాలిట శాపమవుతోంది. అలాగే ఓ బ్యాంక్ ఖాతాదారయిన స్కూల్ యాజమాన్యం ఆన్లైన్ మోసానికి బలై 30 లక్షలు పోగొట్టుకుంది. వినియోగదారుల ఫోరంకి వెళ్లినా బ్యాంకు స్పందించకపోవడంతో ఏకంగా సుప్రీంకోర్టుకెళ్లి మరీ తన డబ్బు తిరిగి రాబట్టుకుంది.
ఏం జరిగిందంటే?
పశ్చిమ బెంగాల్లోని మిడ్నాపూర్లో డీఏవీ పబ్లిక్ స్కూల్ ఉంది. ఈ స్కూల్కి సంబంధించి లోకల్ ఇండియన్ బ్యాంక్లో మూడు అకౌంట్లు ఉన్నాయి. అందులో ఒకటి ప్రిన్సిపల్ పేరున ఉంది. ప్రిన్సిపాల్ సైన్ చేస్తేనే ఆ అకౌంట్ నుంచి మనీ డ్రా చేయడానికి వీలవుతుంది. అంతేకాదు ఆ స్కూల్ బ్యాంకు అకౌంట్లకు ఎలాంటి నెట్బ్యాంకింగ్ సౌకర్యం కూడా లేదు. అయితే బ్యాంక్ ప్రిన్సిపాల్కు చెప్పకుండానే ఆ పేరున ఉన్న అకౌంట్పై నెట్బ్యాంకింగ్ సౌకర్య ఇచ్చింది. ఇదే సందు అనుకుని సైబర్ క్రిమినల్స్ ఆ అకౌంట్ నుంచి దాదాపు 30 లక్షల రూపాయలు కొట్టేశారు.
వినియోగదారుల ఫోరాల్లో న్యాయం జరగలేదు
దీనిమీద స్కూల్ రాష్ట్ర వినియోగదారుల ఫోరానికి వెళ్లింది. బ్యాంకు నిర్లక్ష్యం వల్లే తమ డబ్బులు పోయాయని, వాటిని తిరిగి ఇప్పించాలని అడిగింది. వాళ్లు బ్యాంకును జరిమానా కట్టమన్నారు. అది లక్ష రూపాయలే ఉంటుంది. అక్కడ న్యాయం జరగలేదు. జాతీయ వినియోగదారుల ఫోరానికి వెళితే అక్కడా ఇదే సీన్. తము పోగొట్టుకున్న 30 లక్షలూ ఇప్పించాలని స్కూల్ డిమాండ్.
25 లక్షలు కట్టండి: సుప్రీం కోర్టు ఆర్డర్
దీంతో డీఏవీ స్కూల్ మేనేజ్మెంట్ సుప్రీంకోర్టుకు వెళ్లింది. అక్కడ జస్టిస్ ధనంజయ, జస్టిస్ వై. చంద్రచూడ్, జస్టిస్ హృషీకేశ్రాయ్ల బెంచ్ దీనిపై విచారణ జరిపి తీర్పు ఇచ్చింది. నెట్ బ్యాంకింగ్ సౌకర్యం కల్పించి డబ్బులు పోవడానికి పరోక్షంగా బ్యాంకే కారణమైందని వ్యాఖ్యానించింది. బ్యాంకు వారు స్కూల్కు 25 లక్షలు కట్టాల్సిందేనని ఆదేశించింది.