ఫేస్బుక్ మెసెంజర్, వాట్సాప్ ఇలా ఎన్ని రకాల మెసేజింగ్ ఫ్లాట్ఫామ్స్ వచ్చినా ఎస్ఎంఎస్ ఇంకా తన ఉనికిని కోల్పోలేదు. మీ బ్యాంకింగ్ అవసరాలు, ఆధార్ వంటి గవర్నమెంట్ సర్వీసులు, కొరియర్, పోస్ట్ వంటి ఎలాంటి సర్వీసయినా బేసిక్గా మీ మొబైల్ నెంబర్కు ఎస్ఎంస్లు వస్తుంటాయి. ఎందుకంటే ఆ మెసేజ్ కచ్చితంగా కస్టమర్కే వెళుతుందన్న నమ్మకం. అందుకే ఇప్పటికీ ఎస్ఎంఎస్ తన పట్టును కోల్పోలేదు. ప్లస్పాయింట్స్ ఓకే.. కానీ స్పామ్ మెసేజ్ల సంగతేంటి? ఈ సమస్యను పరిష్కరించడానికి గూగుల్ ఓ పరిష్కారాన్ని కనిపెట్టింది. అదే గూగుల్ వెరిఫైడ్ స్పామ్ ప్రొటెక్షన్.
గూగుల్ వెరిఫైడ్ స్పామ్ ప్రొటెక్షన్ అంటే?
గూగుల్ ఇటీవల ఓ రీసెర్చి చేయగా ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లకు వచ్చే ఎస్ఎంఎస్ల్లో 90% స్పామ్ మెసేజ్లే అని తేలింది. అంటే మనకు100 ఎస్ఎంఎస్లు వస్తే అందులో కేవలం 10 మాత్రమే నిజంగా మనకు అవసరమైనవి ఉంటున్నాయి. మిగిలినవన్నీ లోన్లు తీసుకోండి.. ఫలానా షాప్లో షాపింగ్ చేయండి.. కొత్త ఆఫర్లు వచ్చాయి.. ఇలాంటి వ్యాపార ప్రకటనలు లేదంటే మీకు 50 కోట్ల లాటరీ తగిలింది లాంటి ఫేక్ మెసేజ్లే ఉంటున్నాయన్న మాట. అందుకే వీటిని వడకట్టేయాలని గూగుల్ నిర్ణయించింది. అందుకోసమే స్పామ్ ప్రొటెక్షన్ తీసుకురావాలని నిర్ణయించింది. దీని ప్రకారం స్పామ్ మెసేజ్లన్నీ ఓ వార్నింగ్తో మీ మొబైల్కు చేరతాయి. వాటిని ఓపెన్ చేయాలా లేదా అనేది మీ ఇష్టం.
ఎలా గుర్తిస్తారు?
స్పామ్ మెసేజ్లు గుర్తించాలంటే ముందు అసలు ఒరిజినల్ మెసేజ్లేమిటో గుర్తించాలి. ఇందుకోసం గూగుల్ ఓ ట్యాగ్ సిస్టం ప్రవేశపెట్టింది. తగిన డాక్యుమెంట్లు సమర్పించి కంపెనీలు గూగుల్ దగ్గర ఈ ట్యాగ్ పొందాలి. ఆ ట్యాగ్ ఇచ్చేటప్పుడు అవి ఎలాంటి స్పామ్ మెసేజ్లు పంపడం లేదని నిర్ధారించుకుని గూగుల్ వాటిని అందిస్తుంది. ఇలాంటి ట్యాగ్లున్నవి సరైన మెసేజ్లు. లేనివి స్పామ్ మెసేజ్లన్నమాట.
ఎన్ని కంపెనీలు తీసుకున్నాయి?
స్పామ్ మెసేజ్లు ఇండియాకు మాత్రమే పరిమితం కాదు. చాలా దేశాల్లో ఈ సమస్య ఉంది. అందుకే ఇండియాతోపాటు యూఎస్, యూకే, మెక్సికో, బ్రెజిల్, ఫ్రాన్స్, స్పెయిన్, ఫిలిప్పీన్స్, కెనడా లాంటి దేశాల్లోనూ ఈ స్పామ్ ప్రొటెక్షన్ సర్వీస్ను గూగుల్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతానికి ఇండియాలో 5 కంపెనీలు మాత్మే ఈ ట్యాగ్ తీసుకున్నాయి. అవి 1-800 ఫ్లవర్స్,బాంకో బ్రాడెస్కో, కయాక్, పేబ్యాక్, సోఫీ.