మొబైల్ వాలెట్లు పేటీఎం, ఫ్రీచార్జ్లతోపాటు నగదురహిత సేవల ఫోన్పే వంటివి రంగంలోకి వచ్చాక ‘నో యువర్ కస్టమర్’ (KYC) నిబంధన పాటించేందుకు ఆధార్ను ఉపయోగించాల్సి వచ్చేది. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ పద్ధతిని ప్రోత్సహించింది. అయితే, ఇప్పుడీ యాప్లు కేవైసీ కోసం ఆధార్ అడగడం మానేసి పాన్ కార్డ్, వోటర్ కార్డ్, పాస్పోర్ట్ వంటి ఇతర గుర్తింపు పత్రాలు అడుగుతున్నాయి. వాస్తవానికి వినియోగదారుల వ్యక్తిగత గుర్తింపు నిర్ధారణ కోసం తమ డేటాబేస్ను వాడుకోరాదని విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఎయిర్టెల్ను ఆదేశించిన తర్వాతే ఈ ధోరణి మొదలైంది. కాగా, ఈ సదుపాయాన్ని వాడుకోవడంలో అనేక ఉల్లంఘనలను గమనించిన తర్వాతే యూఐడీఏఐ ఈ నిర్ణయం తీసుకుంది.
ఈ నేపథ్యంలోనే వాలెట్లు, పేమెంట్ సేవల నిర్వాహకులు కేవైసీ కోసం ఆధార్ అడగడం మానేసినట్లు కనిపిస్తోంది. కేవైసీ కోసం ఆయా వేదికలలోగల ఆప్షన్లలో ఆధార్ను అవి ఇటీవల తొలగించడమే ఇందుకు నిదర్శనం. ప్రస్తుతం వీటిని ఉపయోగించేవారు ఇప్పటికే ఆధార్తో కేవైసీ నిబంధన పాటించినందువల్ల ఇబ్బందులేవీ లేవు. కానీ, కొత్త వినియోగదారులను అవి ఆధార్ అడగడం లేదు. దీనికి కారణం వాలెట్ల నిర్వాహక సంస్థలు కాదని, యూఐడీఏఐ నిర్ణయమే ఈ పరిస్థితికి దారితీసిందని సమాచారం.
ఆధార్ డేటాబేస్ను విచ్చలవిడిగా దుర్వినియోగం చేసినందువల్లే యూపీఐ, ఐఎంపీఎస్లద్వారా ఆధార్ ఆధారిత అన్నిరకాల చెల్లింపులను యూఐడీఏఐ లోగడ నిలిపేసింది. అటువంటి ఉల్లంఘనలకు పాల్పడిన వెబ్సైట్లు, పేమెంట్ సేవల సంస్థలపై చర్యలు కూడా తీసుకుంది. తాజాగా వాలెట్లపైనా అదేవిధమైన చర్యలు తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. అందుకే కొత్త వినియోగదారుల కేవైసీ కోసం అవి యూఐడీఏఐ డేటాబేస్ను వాడుకోవడం మానేశాయి. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కొత్త వినియోగదారులను చేర్చుకోవడం కూడా నిలిపేసింది.
నిజానికి పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కొత్త ఖాతాదారులను చేర్చుకోవడాన్ని రిజర్వు బ్యాంకు లోగడ నిషేధించింది. మరోవైపు తాము యూఐడీఏఐ డేటాబేస్ను వాడుకునే లైసెన్స్ ఇంకా పెండింగ్లోనే ఉందని ఫోన్పే సంస్థ తెలిపింది. అయితే, ‘మొబిక్విక్’లో మాత్రం యూఐడీఏఐ డేటాబేస్ ఆధారిత కేవైసీ ప్రక్రియ కొనసాగుతుండటం విశేషం. ఏదేమైనా కేవైసీ కోసం ఆధార్ను వినియోగించని పక్షంలో ‘డిజిటల్ ఇండియా’ ఉద్యమంతోపాటు నగదురహిత వ్యవస్థలోకి కొత్త వినియోగదారుల ప్రవేశంలో అవరోధాలు తప్పవన్న వాదన వినిపిస్తోంది.