• తాజా వార్తలు

పుడ్‌పాండాకి షాకిచ్చిన ఓలా, సర్వీసులు నిలిపివేత 

 క్యాబ్‌ అగ్రిగ్రేటర్‌ ఓలా కీలక నిర్ణయం తీసుకుంది. తన ప్లాట్‌ఫాంనుంచి ఫుడ్‌పాండాను తొలగించింది. ఓలా వేదికగా ఇటీవల కాలంలో ఫుడ్‌ పాండా వ్యాపారం క్షీణించడంతో ఫుడ్‌ పాండా పుడ్‌ డెలివరీ సర్వీసులను ఓలా నిలిపివేసింది. వ్యాపార వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా ఇన్‌హౌస్‌ బ్రాండ్లను మాత్రమే కొనసాగించాలని నిర్ణయించింది.ఈ నిర్ణయానికి తగ్గట్టుగా సంస్థ నుంచి అనేక మంది ఉద్యోగులకు కూడా తొలగించాలని నిర్ణయించింది. సుమారు 40మంది ఎంట్రీ-మిడ్‌ స్థాయి సిబ్బందిని తొలగించనుంది దీనికి తోడు మరో 1,500 మంది డెలివరీ ఎగ్జిక్యూటీవుల కాంట్రాక్టులను కూడా రద్దు చేసింది. 

తన ప్లాట్‌ఫాంనుంచి ఫుడ్‌పాండాను తొలిగించినప్పటికీ ఫుడ్‌ పాండా ప్రైవేటు లేబుల్స్‌ క్రింద తన బిజినెస్‌ను యథావిధిగా కొనసాగిస్తుంది. గత ఏడాది స్విగ్గీ, జొమాటో, ఉబెర్‌ ఈట్స్‌ పోటీపడేందుకు ఫుడ్‌పాండా భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. స్విగ్గీ, జొమాటోలకు రోజుకు 2 లక్షలకు పైగా ఆర్డర్లను డెలివరీ చేస్తుండగా, ఫుడ్‌ పాండా రోజు 5వేల ఆర్డర్లను సాధిస్తోందని లెక్కలు చెబుతున్నాయి. కాగా 2017లో సుమారు 200 కోట్ల రూపాయలతో (30-40 మిలియన్‌ డాలర్లు) కొనుగోలు చేసింది. ఆ సమయంలో ఆహార పంపిణీ సంస్థలో ఓలా కూడా 200 మిలియన్ల డార్లు (సుమారు రూ.1300 కోట్లు) పెట్టుబడులు పెట్టింది.

సంబంధిత వర్గాల సమాచారం మేరకు ఫుడ్‌‌పాండాకు ఇప్పటికే ఢిల్లీ, బెంగళూరు, పుణే వంటి ఐదు నగరాల్లో 50కి పైగా కిచెన్‌‌లు ఉన్నాయి. ఈ కిచెన్‌‌ నెట్‌‌వర్క్‌‌ను మరింత విస్తరించేందుకు చూస్తోంది ఓలా. ఇన్‌‌హౌజ్ బ్రాండ్ల కింద ఉత్పత్తులను అమ్మడానికి ఆఫ్‌‌లైన్ స్టోర్లను ఏర్పాటు చేయాలని కూడా యోచిస్తున్నట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి. ప్రస్తుతం నడుస్తోన్న ఫుడ్‌‌పాండా వ్యాపారాల పునర్‌‌‌‌ వ్యవస్థీకరణపై స్పందించిన కంపెనీ అధికార ప్రతినిధి… సొంత ఫుడ్ బ్రాండ్ల పోర్ట్‌‌ఫోలియోను అభివృద్ధి చేయడంపై ఎక్కువగా ఫోకస్ చేశామని చెప్పారు. అదేవిధంగా కిచెన్ల నెట్‌‌వర్క్‌‌ను విస్తరించడం ద్వారా కూడా ఫుడ్‌‌ ఆఫరింగ్స్‌‌ను చేపట్టనున్నామని పేర్కొన్నారు. చాలా వరకు తమ ఫుడ్ ఆఫర్స్‌‌ ఓలా, ఫుడ్‌‌పాండా యాప్స్‌‌లో అన్ని మేజర్ సిటీల్లో అందుబాటులో ఉన్నాయని చెప్పారు.

తమ సౌకర్యాలను, కిచెన్లను విస్తరించడానికి పెట్టుబడుల పరంపర కొనసాగిస్తామని తెలిపారు. సొంతంగా కిచెన్ల నెట్‌‌వర్క్‌‌పై ఓలా పెట్టుబడులు పెడుతోందని, కఠినతరమైన నియంత్రణతో అధిక మార్జిన్లను ఆర్జించాలని చూస్తోందని కంపెనీకి చెందిన ఓ వ్యక్తి చెప్పారు. ఇన్‌‌హౌజ్ బ్రాండ్ల ద్వారా అయితే ఎక్కువ లాభాల మార్జిన్‌‌ను పొందాలని ఓలా చూస్తోంది. ఫుడ్ టెక్ అనలిస్ట్‌‌ల ప్రకారం రెస్టారెంట్ అగ్రిగేటర్‌‌‌‌ 40 శాతం మార్జిన్లను తన రెస్టారెంట్ పార్టనర్‌‌‌‌కు ఇవ్వాలి. అదే ఇన్‌‌ హౌజ్ బ్రాండ్ అయితే ఆ 40 శాతం మార్జిన్ కూడా ఫుడ్‌‌పాండానే ఉంచుకోవచ్చు. దీంతో ప్రతి ఆర్డర్‌‌‌‌లోనూ లాభం పొందవచ్చు. స్విగ్గీ కూడా ఇన్‌‌హౌజ్ బ్రాండ్లను తన మార్కెట్‌‌ప్లేస్‌‌పై నడుపుతోంది.

ఇండియా ఫుడ్‌‌ డెలివరీ స్పేస్‌‌లో స్విగ్గీ, జొమాటో, ఉబర్ ఈట్స్ నుంచి ఫుడ్‌‌పాండాకు గట్టి పోటీ వస్తోంది. కొన్ని నెలల నుంచి  స్విగ్గీ, జొమాటో, ఉబర్‌‌‌‌ ఈట్స్ వల్ల ఫుడ్‌‌పాండా  సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఫుడ్‌‌పాండాకు ఇన్‌‌హౌజ్ బ్రాండ్లు కిచిడీ ఎక్స్‌‌పర్మెంట్, ఫ్లర్ట్, లవ్‌‌మేడ్, గ్రాండ్‌‌మా కిచెన్‌‌ ఉన్నాయి. 2017లో ఓలా ఫుడ్‌‌పాండా ఇండియా వ్యాపారాలను 40 నుంచి 50 మిలియన్ డాలర్లకు జర్మనీకి చెందిన డెలివరీ హీరో గ్రూప్‌‌ నుంచి కొనుగోలు చేసింది. కొనుగోలు సమయంలో ఫుడ్‌‌పాండాలోకి ఓలా 200 మిలియన్ డాలర్లను(రూ.1,393 కోట్లను) చొప్పించింది. 2018 ఆగస్ట్‌‌లో 20 వేల ఆర్డర్లు చేపట్టిన ఫుడ్‌‌పాండా ప్రస్తుతం పోటీని తట్టుకోలేక సుమారు ఐదు వేల ఆర్డర్లు మాత్రమే చేపడుతోంది. ఫుడ్‌‌పాండాకు భిన్నంగా స్విగ్గీ, జొమాటోలు రోజుకు 11 లక్షల ఆర్డర్లను చేపడుతున్నాయని ఇండస్ట్రీ వర్గాల అంచనా. 

ఫుడ్‌‌పాండా ఏర్పాటైనప్పటి నుంచి మూడు సార్లు చేతులు మారింది. ఇది తొలుత 2012లో జర్మనీలో ఏర్పాటైంది. ఫుడ్‌‌ డెలివరీ బిజినెస్‌‌ల్లో ఓలాకు ఇది రెండో వ్యాపారం. 2014లోనే ఓలా కేఫ్‌‌తో ఫుడ్ డెలివరీ బిజినెస్‌‌ల్లోకి ఓలా అడుగుపెట్టింది. దీన్ని ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి నగరాలకు విస్తరించింది. కానీ ఓలా కేఫ్  మూతపడింది.

జన రంజకమైన వార్తలు