పదిమంది గుమికూడితే ఎంత మంది ఫేస్బుక్ వాడతారని అడిగితే దాదాపు అన్ని చేతులూ పైకి లేస్తాయేమో! ప్రపంచ వ్యాప్తంగా ఫేస్బుక్ అంతగా ఫేమస్ అయింది. స్మార్ట్ఫోన్ల విప్లవం వచ్చిన తర్వాత పల్లెటూళ్లలోనూ ఎఫ్బీని విపరీతంగా వాడుతున్నారు. మనం దాదాపు ప్రతి విషయాన్ని ఫేస్బుక్లో బంధువులు, స్నేహితులకు షేర్ చేసుకుంటాం. మనకు నచ్చిన పోస్ట్లకు లైక్లు కొడతాం, షేర్ చేస్తాం... కామెంట్ చేస్తాం.. కానీ ఫేస్బుక్ విషయంలో కొన్ని విషయాలను మనం అసలు నమ్మకూడదు.. మరి ఆ నమ్మకూడని విషయాలేమిటో చూద్దామా!
మనకు తెలియకుండానే..
ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్ లాగానే స్టోరీస్ ఆప్షన్ ఉంది. దీనిలో మనకు సంబంధించిన కొత్త కొత్త విషయాలను మనం షేర్ చేసుకోవచ్చు. అయితే మనకు సంబంధించిన డేటా ఏమైనా లీక్ అవుతుందా అనే విషయం మాత్రం మనకు తెలియదు. ఐతే వాల్ స్ట్రీట్ జనరల్ పేపర్ ప్రకారం...ప్రత్యర్థి యాప్లను, సర్వీసులను పసిగట్టడం కోసం.. వాటి మీద ఒక అంచనా రావడం కోసం ఫేస్బుక్ ఇంటర్నల్గా ఒక టూల్ను రూపొందించినట్లు తెలుస్తుంది. అంటే మీ బ్రౌజింగ్ యాక్టివిటీస్ మీద ఎఫ్బీ ఎల్లవేళలా నిఘా ఉంచుతుంది. దీంతో మన ప్రైవసీ ప్రశ్నార్థకంగా మారుతోంది. అయితే ఎఫ్బీ చేసే పనుల్లో మనకు ప్రత్యేకంగా నష్టం లేకున్నా.. ప్రత్యర్థులను దెబ్బ కొట్టేందుకే ఆ సంస్థ ఈ వ్యూహాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది.
మార్కెటింగ్, యాడ్స్
ఫేస్బుక్కు ఆదాయం ఎక్కడ నుంచి వస్తుంది. యాడ్ రెవిన్యూ ద్వారానే కదా... అయితే యాడ్లు ఎక్కడ ఉంటాయి?.. సాధారణంగా మన పోస్టుల పక్కనే యాడ్ ఉంటాయి. ఇవి మన పోస్ట్లకు రిలేటెడ్ అయి ఉంటాయి. దీంతో చాలామంది తమకు తెలియకుండానే వాటిని క్లిక్ చేస్తారు. అంటే మన చేత యాడ్స్ క్లిక్ చేయించి వాళ్లు డబ్బులు పొందుతున్నారు. క్లిక్ త్రూ రేట్ కోసం ఎఫ్బీ భిన్నమైన పద్ధతులు అవలంభిస్తోంది. కస్టమర్లు క్లిక్ చేసేలా చేసే యాడ్లను మాత్రమే పోస్టుల పక్కన ఉంచుతోంది.
ఫ్రెండ్స్ పేరిట..
మీరు ఫేస్బుక్ ఓపెన్ చేయగానే మీకు ఒక ఇండికేషన్ కనిపిస్తుంది. అది పీపుల్ యు మే నో... అంటే మనకు తెలిసిన స్నేహితులను కనుగొని వారిని వీళ్లు మీ స్నేహితులేమో చూడండి అని ఎఫ్బీ సజిస్ట్ చేస్తూ ఉంటుంది. మరి ఎఫ్బీ మనకు కావాల్సిన వారిని.. మన స్నేహితులను ఎలా గుర్తు పడుతుంది. ఆ ఆలోచన ఎవరికీ రాదు. కానీ మన యాక్టివిటీస్ మీద కన్నేసి ఉంచడం వల్లే ఎఫ్బీ మనకు సంబంధించిన, మన ఊరికి సంబంధించిన వాళ్లను, మన జాబ్కు సంబంధించిన వాళ్లను గుర్తు పడుతుంది. దీని అర్థం మన పోస్టులను ఎఫ్బీ నిరంతరం ట్రాక్ చేస్తూనే ఉంటుంది. ఈ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.