జుకర్ బర్గ్ ఫేస్బుక్ ప్లాట్ ఫాంపై పబ్లిషర్స్ న్యూస్ పబ్లిష్ చేస్తే మిలియన్ డాలర్లు ఇస్తామంటూ ఆఫర్ ఇచ్చి నెల దాటకముందే మరో నిర్ణయం తీసుకుంది. సామాజిక మాధ్యమాలకు విశేష ఆదరణ లభిస్తున్న తరుణంలో వినియోగదారులకు ఫేస్బుక్లోనే వార్తల్ని అందించేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో తన న్యూస్ ట్యాబ్కోసం సీనియర్ జర్నలిస్టుల బృందాన్ని నియమించుకోనుంది. న్యూస్ టాబ్ ఫీచర్ ఆవిష్కరణను ధృవీకరించిన సంస్థ అనుభవజ్ఞులైన జర్నలిస్టుల పర్యవేక్షణలో తమ న్యూస్ఫీడ్ ఎంపిక ఉంటుందని స్పష్టం చేసింది. ఒక బృందం ఆధ్వర్యంలో విశ్వసనీయయైన, బ్రేకింగ్, టాప్ వార్తా కథనాలను ఎన్నుకుంటామని తెలిపింది. వినియోగదారు అభిరుచులను గుర్తించడానికి అల్గారిథమ్లపై ఆధారపడతామని పేర్కొంది.
న్యూస్ టాబ్ను పర్సనలైజ్ చేయాలనుకుంటున్నాం. కేటగిరీ ప్రకారం న్యూస్ను డివైడ్ చేసి వినియోగదారులకు మంచి సేవను అందించాలనుకుంటున్నామని ఫేస్బుక్ మేనేజ్మెంట్ తెలిపింది. స్వంతగా తామే జర్నలిస్టులను రిక్రూట్ చేసుకుని జాబ్ ఇస్తామని కంపెనీ ముందుకొచ్చింది. ప్రజలకు వ్యక్తిగతీకరించిన, అత్యంత సందర్భోచితమైన అనుభవాన్ని అందించడమే తమ లక్ష్యమని ఫేస్బుక్ న్యూస్ పార్ట్నర్షిప్ హెడ్ క్యాంప్బెల్ బ్రౌన్మీడియాకు వెల్లడించారు. సరైన కథనాలనే హైలైట్ చేస్తున్నామని నిర్ధారించుకునేందుకు పాత్రికేయుల బృందాన్ని తీసుకుంటున్నప్పటికీ , ప్రజల ఆసక్తిని ఎక్కువ భాగం సాఫ్ట్వేర్ ద్వారానే గుర్తిస్తామని తెలిపింది.
ప్రస్తుతం న్యూస్ ఫీడ్ అని ప్రత్యేక విభాగంలో స్నేహితుల నుంచి వ్యక్తిగత సమాచారాన్ని తెలుసుకుంటున్నారు. ఇదే తరహాలో ఫేస్బుక్ డిమాండబుల్ న్యూస్ పబ్లిష్ చేసేందుకు సిద్ధమైంది. కాగా మెరుగైన, విశ్వసనీయ సమాచారాన్ని యూజర్లకు అందించాలనే లక్ష్యంతోనే ఈ కొత్త న్యూస్ ఫీచర్ని తీసుకొస్తున్నామని ఈ ఏడాది ఆరంభంలో ఫేస్బుక్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో మార్క్ జుకర్బర్గ్ వెల్లడించారు. ఫేక్ న్యూస్ పై ప్రపంచవ్యాప్తంగా భారీగా ఒత్తిడి వస్తున్న క్రమంలో వీటి నిరోధంపై తీవ్ర కసరత్తు చేస్తోంది.