డేటా లీకేజి ఆరోపణలు, కేసులు, విచారణలతో నెల రోజులుగా ఉక్కిరిబిక్కిరవుతున్న ఫేస్బుక్ కాస్త తేరుకుని కొత్త ఫీచర్ల మీద దృష్టి పెట్టింది. ఎఫ్బీ అకౌంట్ నుంచే నేరుగా మొబైల్ రీఛార్జి చేసుకునే ఫెసిలిటీని ఇండియాలోని యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది. ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే ఈ సౌకర్యం ప్రస్తుతం అందుబాటులో ఉంది. త్వరలో ఐఫోన్ యూజర్లకు కూడా తీసుకురానుంది.
ఎలా చేయాలంటే?
* ఈ ఫీచర్ కావాలంటే మీ ఫోన్లో ఫేస్బుక్ లేటెస్ట్ వెర్షన్ ఉండాలి.
* యాప్ ఓపెన్ చేయగానే హోం పేజీలో కనిపించే కుడి చివర ఉన్న మెనూ బటన్ను క్లిక్చేయాలి. వచ్చే ఆప్షన్లలో నుంచి Mobile Recharge ఆప్షన్ సెలెక్ట్ చేయండి. కొన్ని ఫోన్లలో ఈ ఆప్షన్ జనరల్ స్క్రీన్లో కనిపించదు. అలాంటప్పుడు See More ఆప్షన్ను క్లిక్ చేస్తే దానిలో మొబైల్ రీఛార్జ్ ఆప్షన్ కనిపిస్తుంది.
* మొబైల్ రీఛార్జ్ ఆప్షన్ను సెలెక్ట్ చేయగానే తర్వాత స్క్రీన్లో Recharge Now బటన్ కనిపిస్తుంది. దానిలో మీరు రీఛార్జిచేయాల్సిన మొబైల్ నెంబర్ డిటెయిల్స్ ఇవ్వాలి. ఆటోమేటిగ్గా ఆపరేటర్ను సిస్టమే సెలెక్ట్ చేసుకుంటుంది. కావాలంటే మీరు Select Operator బటన్ క్లిక్ చేసి డ్రాప్డౌన్ మెనూలో నుంచి మీ ఆపరేటర్ను సెలెక్ట్ చేసుకోవచ్చు.
* తర్వాత మీరు రీఛార్జి చేయాలనుకున్న అమౌంట్ ఎంటర్ చేయాలి. అమౌంట్ బాక్స్ పక్కనే Browse Plans బటన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే రీఛార్జి ప్లాన్లను చూపిస్తుంది. అమౌంట్ ఎంటర్ చేసి లేదా ప్యాక్ను సెలెక్ట్ చేయాలి.
* ఇప్పుడు ఫేస్బుక్ మిమ్మల్ని ఫేస్బుక్ పేజీకి తీసుకెళుతుంది. అక్కడ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ డిటెయిల్స్ ఫిల్ చేసి ఓటీపీ ఎంటర్ చేసి పేమెంట్ కంప్లీట్ చేయాలి.
* ట్రాన్సాక్షన్ పూర్తవగానే యాప్ మీకు రిసీట్ కూడా పంపిస్తుంది.
మొబైల్ వాలెట్లకు పోటీగా
ఇప్పటికే ఫేస్బుక్ తన ఆధీనంలో ఉన్న వాట్సాప్ ద్వారా పేమెంట్స్ యాప్ రంగంలోకి దిగింది. ఇక ఇప్పుడు రీఛార్జి ఫీచర్ను ఫేస్బుక్లో ప్రవేశపెట్టడం ద్వారా మరో అడుగు వేసింది. ముఖ్యంగా రీఛార్జి కోసం ఇండియాలో ఎక్కువ మంది వాడుతున్న పేటీఎం, ఫ్రీఛార్జి, మొబీక్విక్ లాంటి మొబైల్ వాలెట్లకు పోటీగా నిలబడాలన్నది ఫేస్బుక్ లక్ష్యంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఫేస్బుక్ మొబైల్ రీఛార్జి పేమెంట్ ఆప్షన్లో క్రెడిట్, డెబిట్ కార్డ్లు మాత్రమే ఉన్నాయి. అంటే దీనిలో రీఛార్జి చేసేవారు వాలెట్లు వాడలేరు. అంతేకాదు యూపీఐ పేమెంట్స్ను దెబ్బకొట్టేందుకు ఇందులో నెట్బ్యాంకింగ్, యూపీఐ ఆప్షన్లు కూడా ఇవ్వలేదు.