కరోనా వైరస్ ప్రపంచాన్ని షట్డౌన్ చేసేస్తోంది. స్కూళ్లు, కాలేజీలు, సినిమా హాల్స్, మాల్స్ అన్నింటినీ మూసేస్తున్నారు. ముందు జాగ్రత్తలు తీసుకుంటే కరోనా వైరస్ను నియంత్రించవచ్చని ప్రభుత్వం ప్రకటనలు ఇస్తోంది. సెల్ఫోన్లకు కాలర్ ట్యూన్గానూ కరోనా వైరస్ గురించిన జాగ్రత్తలు, వ్యాధి సోకితే ఏం చేయాలనే వివరాలూ చెబుతోంది. అయితే ఈ కాలర్ట్యూన్తో జనం విసిగిపోయే పరిస్థితి వస్తోంది.
ప్రతి కాల్కూ అవసరమా అంటున్న యూజర్లు
కరోనా వైరస్ జాగ్రత్తలు చెప్పడం మంచి ఆలోచనే. అయితే ప్రతికాల్కు ముందు దాదాపు 40, 50 సెకన్లు ఈ కాలర్ ట్యూన్ వస్తుండటం వారిని అసహనానికి గురి చేస్తోంది. రోజులో ఒకటి రెండుసార్లు అలర్ట్ చేస్తే సరిపోతుంది.. ఇలా ప్రతి కాల్కూ 40, 50 సెకన్లు కాలర్ ట్యూన్ వినడం కష్టమంటున్నారు యూజర్లు. రోజంతా ఏదో ఒక కాల్స్ చేస్తూ బిజీగా ఉండే ఉన్నతాధికారులు, పోలీసులు, జర్నలిస్టులు, వ్యాపారులు ఇలాంటివారికి ఇదీ మరీ కష్టంగా అనిపిస్తోంది.
కట్ చేసుకోవచ్చు ఇలా..
ఒక వేళ కరోనా వైరస్ జాగ్రత్తలపై కాలర్ట్యూన్ వినక్కర్లేదు అనుకుంటే డీయాక్టివేట్ చేసుకోవచ్చు.
* ఆండ్రాయిడ్ ఫోన్లో అయితే కాలర్ట్యూన్ స్టార్టవగానే మీ ఫోన్లో డయల్ప్యాడ్ ఓపెన్ చేసి ఏదో ఒక నెంబర్ ప్రెస్ చేయండి. ఆటోమేటిగ్గా కాలర్ట్యూన్ కట్ అయిపోతుంది. ఫోన్ రింగవుతుంది.
* ఐఫోన్లో అయితే కాలర్ట్యూన్ వినపడగానే డయల్ ప్యాడ్ ఓపెన్ చేసి హ్యాష్ బటన్ నొక్కండి. కాలర్ ట్యూన్ కట్ అయి, అవతలి వ్యక్తి ఫోన్ రింగవుతుంది. ఆండ్రాయిడ్లో మాదిరిగా ఇక్కడ ఏదో నెంబర్ నొక్కితే వర్కవుట్ అవదని గుర్తు పెట్టుకోండి.
* ఒకసారి నొక్కితే కట్ కాకపోతే మళ్లీ నొక్కండి.
* ఈ ట్రిక్ వర్కవుట్ కాకపోతే వాట్సాప్, ఫేస్బుక్ మెసెంజర్, గూగుల్ డుయో ద్వారా వాయిస్ కాల్స్ చేసుకోవడం బెటర్.