కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ముఖ్యంగా తరచూ విదేశీ పర్యటనలకు వెళ్లే, విదేశాల నుంచి వచ్చే క్లయింట్లతో టచ్లో ఉండే ఐటీ కంపెనీల ఉద్యోగులను ఇది మరింత కలవరపెడుతోంది. హైదరాబాద్ మైండ్ స్పేస్లోని డీఎస్ఎం సాఫ్ట్వేర్ కంపెనీలో ఓ ఉద్యోగికి కరోనా వైరస్ సోకినట్లు గుర్తించారు. దీంతో ఆ కంపెనీ ఉద్యోగులను ఆఫీసుకు రావద్దని, వర్క్ ఫ్రం చేయాలని ఆర్డర్స్ ఇచ్చాయి. ఈ పరిణామంతో 100 ఎకరాల వైశాల్యమున్న మైండ్ స్పేస్ ఆవరణలోని ఇతర సాఫ్ట్వేర్ కంపెనీల ఉద్యోగుల్లోనూ ఆందోళన మొదలైంది. ఇది గచ్చిబౌలి, మాదాపూర్ల్లోని ఐటీ కంపెనీల్లో పని చేస్తున్న లక్షల మంది ఐటీ ఉద్యోగులను కంగారుపెడుతోంది.
బెంగళూరులో 5 అనుమానిత కేసులు
మరోవైపు దేశంలో ఐటీకి చిరునామా అయిన బెంగళూరులోనూ కరోనా అనుమానిత కేసులు 5 నమోదయ్యాయి. దీంతో అక్కడ ఐటీ కంపెనీలు వెంటనే నివారణ చర్యలు ప్రారంభించాయి.
బెంగళూరులో కరోనా వైరస్ నివారణ చర్యలిలా..
బెంగళూరులోని బిజినెస్ పార్క్లు కామన్ ఏరియాలైన కారిడర్లు, వాష్రూమ్లు, ఫుడ్ కోర్టులను ఎప్పటికప్పుడు శానిటైఝ్ చేస్తున్నాయి.
* చైనా,జపాన్ కొరియా, సింగపూర్లతో సహా విదేశీ పర్యటనలకు ఉద్యోగులను పంపడం లేదు.
* జ్వరం, జలులు లక్షణాలున్న ఉద్యోగులను ఇంట్లో నుంచి పనిచేయమని ఐటీ కంపెనీలు చెబుతున్నాయి.
* అమెజాన్, ఏబీబీలకు సేవలందించే డెవలపర్ బ్రిగేడ్ లాంటి కంపెనీలు కరోనా వైరస్ వ్యాప్తిని ఎలా అరికట్టాలో పెద్ద పెద్ద స్క్రీన్లు పెట్టి ఎంప్లాయిస్కు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాయి. వాష్రూమ్లను రెండు గంటలకోసారి, కారిడార్లను, కామన్ ఏరియాలను నాలుగు గంటలకోసారి శుభ్రం చేస్తున్నాయి.
* విప్రో తన ఉద్యోగులను చైనా, హాంకాంగ్, మకావు తదితర దేశాలకు పంపడం ఆపేసింది. సింగపూర్, జపాన్, కొరియాలకు పంపడం లేదు.
* కాగ్నిజంట్ కూడా తమ కంపెనీ ఎంప్లాయిస్ను విదేశాలకు వెళ్లకుండా నిషేధం విధించింది. వర్క్ ఫ్రం హోం చేసుకోమని చెప్పేసింది.
* యాక్సెంచర్ కూడా వర్క్ ప్రం హోమ్కే ప్రాధాన్యం ఇస్తోంది.
* ఎప్పటికప్పుడు వైద్య నిపుణులను సంప్రదిస్తూ కరోనా వ్యాపించకుండా చర్యలు తీసుకుంటున్నామని టీసీఎస్ అధికారి ఒకరు చెప్పారు.
మరి హైదరాబాద్లో..
కరోనా సోకిన డీబీఎస్ కంపెనీ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ ఆప్షన్ ఇచ్చేసింది. కాగ్నిజెంట్, యాక్సంచర్ కూడా ఈ ప్రయత్నాలు ప్రారంభించాయి. తెలంగాణ ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ సాఫ్ట్వేర్ కంపెనీలతో ఎప్పటికప్పుడు టచ్లో ఉంటూ పరిస్థితిని మానిటర్ చేస్తున్నారు. జ్వరం, జలుబు లక్షణాలుంటే ఉద్యోగులు ఆఫీసుకు రావద్దని చాలా కంపెనీలు తేల్చిచెప్పాయి. ఇతర దేశాలకు ప్రయాణాలను కూడా కంపెనీలు తాత్కాలికంగా వాయిదా వేశాయి.