స్మార్ట్ఫోన్ వాడే వాళ్లకు ఎప్పుడూ ఒక ప్రమాదం పొంచి ఉంటుంది. అదే ఫోన్ పోవడం! మనం మరిచిపోవడమే.. లేదా పొరపాటున ఎక్కడైనా పడిపోవడమో.. లేదా ఎవరైనా దొంగిలించడం ద్వారా ఫోన్ పోయే అవకాశాలు చాలా ఉన్నాయి. ఎన్నో వేలు పెట్టి కొనుక్కున్న ఫోన్ పోతే మన బాధ వర్ణనాతీతం. డబ్బుల సంగతి పక్కనపెడితే మనకు సంబంధించి విలువైన సమాచారం ఉండే ఈ ఫోన్లు పోతే మనకు చాలా ఇబ్బందే. మరి ఇలా పోయిన ఫోన్ల కోసం మనమేం చేస్తే.. మహా అయితే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాం.. కానీ ఇక అవసరం లేదంట.. ప్రభుత్వమే మన ఫోన్లను వెతికిపెడుతుందట.. మరి మనమేం చేయాలంటే..!
టెలికమ్యునికేషన్ ద్వారా..
ఫోన్ పోయినప్పుడు పోలీసుకు ఫిర్యాదు చేసి ఊరుకుంటాం.. కానీ ప్రభుత్వం దర్యాప్తు చేసి ఫోన్ను కనిపెట్టే వార్త ఎప్పుడైనా విన్నారా.. అయితే ఆ న్యూస్ ఇదే. మన పోయిన ఫోన్ను కనిపెట్టడానికి టెలి కమ్యునికేషన్ డిపార్ట్మెంట్ సాయం తీసుకుంటోంది ప్రభుత్వం. ఏ మొబైల్ నెట్వర్క్లో అయినా దొంగతనం చేసినా లేదా పోయిన ఫోన్లను వాడకుండా ఉండేందుకు టెలికాం చర్యలు చేపడుతోంది. దీనికి సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజస్టార్ అనే ప్రాజెక్ట్ స్టార్ చేసింది. దీని ప్రకారం మనం పోగొట్టుకున్న లేదా దొంగిలించిన ఫోన్లను ఎవరూ వాడకుండా.. ఏ నెట్వర్క్ పని చేయకుండా టెలికాం సంస్థ చూసుకుంటుంది. దీని వల్ల దొంగలు ఆ ఫోన్ను యూజ్ చేయలేక వదిలేస్తారు. దీని వల్ల దొంగతనాలు కూడా తగ్గిపోతాయని టెలికాం సంస్థ అంటోంది.
మనం ఏం చేయాలి?
1. మన ఫోన్ పోయిన తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసి ఎఫ్ ఐఆర్ తీసుకోవాలి. లేదా జరిగిన సంఘటను హెల్ప్లైన్ నంబర్ 14422కు ఫోన్ చేయాలి.
2. వెరిఫికేషన్ పూర్తయ్యాక టెలికాం కంపెనీ ఈ ఫోన్ను బ్లాక్ లిస్టులో పెడుతుంది. ఆ తర్వాత ఆ ఫోన్ ద్వారా ఏ నెట్వర్క్ సిమ్ని యూజ్ చేయడం కుదరదు
3. ఒకవేళ ఎవరైనా యూజ్ చేయడానికి ప్రయత్నిస్తే సర్వీస్ ప్రొవైడర్కి ఆ నంబర్ వెళుతుంది. పోలీసులకు సమాచారం అందుతుంది.
4. ఆ వెంటనే పోలీసులు నంబర్ను ట్రేస్ చేసి దర్యాప్తు చేస్తారు.