రైలు ఎక్కాలంటే ప్రతి ఒక్కరూ ఎదుర్కొనే బాధ ఒకటి ఉంది. అదే వెయిటింగ్ లిస్ట్! పండగలప్పుడైతే ఈ లిస్టు చాంతాడంత ఉంటుంది. మన సీటు కన్ఫామ్ అవుతుందన్న భరోసా ఉండదు. ముందుగా బుక్ చేసుకున్నవాళ్లకే సీటు దొరుకుతుంది. అయితే 2020 కొత్త ఏడాదిలో ఇలాంటి ఇబ్బందులు లేకుండా చేయాలనుకుంటోంది భారత రైల్వే సంస్థ. ప్రతి ఒక్కరికి టిక్కెట్ కన్ఫామ్ అయ్యేలా ప్రయత్నాలు చేస్తోంది. మరి రైల్వే వారి ప్లాన్ ఏమిటో చూద్దామా...!
వెయిటింగ్ లిస్ట్ లేకుండా..
ఇక రైలులో మనం టిక్కెట్ బుక్ చేసుకున్న తర్వాత వెయిటింగ్ లిస్టు ఉండకుండా చూడాలనుకుంటోంది భారత రైల్వే సంస్థ. ఇందుకోసం బృహత్తర ప్రణాళికలను సిద్ధం చేసింది. దిల్లీ నుంచి ముంబయి, దిల్లీ నుంచి కోల్కతాకు వెళ్లే రైళ్లో ఈ ప్లాన్ను ముందుగా అమలు చేస్తోంది. వచ్చే ఐదేళ్లలో ఈ రూట్స్లో వెయిటింగ్ లిస్టు లేకుండా చేయాలన్నదే సంకల్పంగా పెట్టుకుంది రైల్వే సంస్థ. ఇటీవలే రైల్వే బోర్డు ఛైర్మన్ వినోద్కుమార్ యాదవ్ ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు. ఆ ప్లాన్లో భాగంగా రాబోయే 10 ఏళ్లలో రూ.2.6 లక్షల కోట్ల వ్యయంతో కొత్తగా రైల్వే కారిడార్లు నిర్మించబోతున్నారు. ప్రస్తుతం ఉన్న ట్రాక్లతో పాటు అదనంగా ట్రాక్లు కలవడం వల్ల రైళ్ల సంఖ్య పెరుగుతుంది. దీని వల్ల ఎంతమంది టిక్కెట్ బుక్ చేసుకున్నా కూడా వెయిటింగ్ లిస్టు సమస్య ఎదురు కాదు. ఇది ప్లాన్ 2021 నాటి కల్లా పూర్తి కానుంది.
ఎలా ఉపయోగపడుతుంది!
రైల్వే బోర్డు కొత్త ప్లాన్ వ్లల కొత్త కారిడార్లు ఓపెన్ అవుతాయి. ముంబయి నుంచి దిల్లీ, దిల్లీ నుంచి హౌరా లాంటి బిజీ స్టేషన్లలో ఎవరైనా ఎలాంటి ఇబ్బంది, వెయిటింగ్ లిస్టు సమస్య లేకుండా టిక్కెట్లు కొనుగోలు చేసుకోవచ్చు. అదీ కాకుండా ట్రైన్ స్పీడ్ పెంచాలని కూడా బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ బిజీ రూట్లలో ట్రైన్ స్సీడ్ను గంటకు 160 కి.మీ వేగంతో నడపాలని బోర్డు భావిస్తోంది. దీని వల్ల సమయం కలిస్తుంది. రైళ్లు ఖాళీ అవుతాయి. టిక్కెట్లు దొరక్కపోవడం అనే సమస్య ఉండదు. ఇప్పటికే 194 కి.మీ దూరం కొత్త కారిడార్లు విస్తరించాయని.. ఈ కొత్త ఏడాదిలో మరింత దూరం విస్తరించనున్నాయని సమాచారం . ఇవన్నీకార్యరూపం దాల్చితే వెయిటింగ్ లిస్టు సమస్యలకు చెల్లుచీటీ అవుతుంది.