ఇష్టారాజ్యంగా ధరలతో వినియోగదారుణ్ని మొబైల్ ఆపరేటర్లు బెంబేలెత్తిస్తున్న వేళ జియో పేరుతో దూసుకొచ్చి ఇండియన్ టెలికం ఇండస్ట్రీని మొత్తం తన గుప్పిట్లోకి తెచ్చుకున్న ముకేశ్ అంబానీ.. దానిలో వాటాలను ఏకంగా లక్షన్నర కోట్ల రూపాయలకు వాటాలు అమ్మి కార్పొరేట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. ఆ ఊపులో ప్రపంచంలో టాప్ 5 కంపెనీల్లో రిలయన్సును నిలబెట్టేశారు. ఇప్పుడు తాజాగా జియో ఫైబర్ నెట్ వాటాల అమ్మకానికి ప్రయత్నాలు షురూ అయిపోయాయి.
11,200 కోట్లతో వాటా కొనడానికి ఖతార్ సిద్ధం
జియో బ్రాడ్బ్యాండ్.. జియో ఫైబర్నెట్ ఇంకా ఇండియా మొత్తం కనెక్షన్లు ఇవ్వలేదు. మెట్రో సిటీస్లోనూ అక్కడక్కడా మాత్రమే సర్వీసులు మొదలయ్యాయి. కానీ దానిలో వాటా కొనడానికి కంపెనీలు క్యూ కట్టేస్తున్నాయంటే ఆ ఘనత ముకేశ్ అంబానీదే. జియో డిజిటల్ ఫైబర్ ప్రైవేట్ లిమిటెడ్లో ఖతార్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ (క్యూఐఏ) ఏకంగా 150 కోట్ల డాలర్లు (సుమారు రూ.11,200 కోట్లు) పెట్టుబడిగా పెట్టనున్నట్లు సమాచారం. దీనిపై రెండు కంపెనీల మధ్య చర్చలు జరుగుతున్నాయి.
5జీ సర్వీస్ కోసం ఫండ్ రైజింగ్
జియో 5జీ సేవలకు సిద్ధమవుతున్న పరిస్థితుల్లో |ఖర్చులను తగ్గించుకుని, ఆదాయాలు పెంచుకోవడంలో భాగంగా జియోను అసెట్ లైట్ డిజిటల్ కంపెనీగా మార్చాలని రిలయన్స్ భావిస్తోంది. అలాగే ఫైబర్ ఆస్తుల్లో వాటాలు విక్రయిస్తోంది.