ఆన్ లైన్ ద్వారా మనీ బదిలీ చేయడానికి నెట్ బ్యాకింగ్ ఆప్సన్ యూజ్ చేస్తున్నారా..అయితే ఇలా మనీ ట్రాన్స్ఫర్ చేసేవారికి శుభవార్త. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI లావాదేవీల సమయాల్లో మార్పులు చేసింది. రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్-RTGS వేళల్ని సాయంత్రం 4.30 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పొడిగించింది. మారిన వేళలు జూన్ 1 నుంచి అమలులోకి వస్తాయి. ఇంటర్నెట్ ద్వారా నెట్ ట్రాన్ఫర్ చేసే విధానంలో రెండు రకాలు ఉంటాయనే విషయం అందరికీ తెలిసిందే. ఒకటి NEFT కాగా రెండోది RTGS విధానం.
ప్రస్తుతం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు మాత్రమే ఈ విధానంలో అవకాశం ఉంది. ఇప్పుడు ఆ సమయాన్ని సాయంత్రం 6 గంటల వరకు, ఎమర్జెన్సీ కింద రాత్రి 7.45 గంటల వరకు అవకాశం కల్పిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త రూల్స్ తీసుకొచ్చింది. RTGS ద్వారా డబ్బు బదిలీ లిమిట్ రూ.2 లక్షలుగా ఉంది. ఈ విధానం ఎంత సక్సెస్ అయ్యిందంటే.. 2019 ఏప్రిల్ వరకు దేశవ్యాప్తంగా 112 లక్షల కోట్ల రూపాయల లావాదేవీలు జరిగాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని RBI సాయంత్రం 6 గంటల వరకు కస్టమర్లకు వెసలుబాటు కల్పించింది.
ఇప్పటి వరకు మధ్యాహ్నం 4.30 గంటల వరకు మాత్రమే టైం ఉండేది. ఇక నుంచి ఈ విధానంలో టైమింగ్స్, ఛార్జీలను కొత్తగా నిర్ణయించింది రిజర్వ్ బ్యాంక్. ఇక నుంచి ఛార్జీలు కూడా వసూలు చేయనున్నారు. ఇది కూడా టైమింగ్స్ ఆధారంగా ఛార్జీలు వసూలు చేస్తారు. ఉదయం 8 నుంచి 11 గంటల మధ్య ఎలాంటి ఛార్జీలు ఉండవు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట మధ్య ఒక్కో లావాదేవీపై 2 రూపాయలు వసూలు చేస్తారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఒక్కో లావాదేవీపై 5 రూపాయలు వసూలు చేస్తారు.
సాయత్రం 6 గంటల నుంచి 7.45 గంటల వరకు ఎవరైనా ఈ విధానం ద్వారా డబ్బులు పంపించాలి అంటే.. ఎమర్జన్సీ కింద గుర్తిస్తారు. ఈ టైంలో ఒక్కో లావాదేవీకి 10 రూపాయల ఛార్జ్ విధిస్తారు.
కొత్త టైమింగ్స్, ఛార్జీలు 2019, జూన్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి.ఆర్టీజీఎస్ ద్వారా మనీ ట్రాన్స్ఫర్ చేస్తే అవతలి వారి అకౌంట్లోకి వెంటనే డబ్బులు వెళ్తాయి. నెఫ్ట్ అయితే సెటిల్మెంట్ పద్ధతిలో మనీ ట్రాన్స్ఫర్ జరుగుతుంది. ఆర్టీజీఎస్లో కనీసం రూ.2 లక్షలు ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది. గరిష్టంగా రూ.10 లక్షలు ట్రాన్స్ఫర్ చేయొచ్చు. నెఫ్ట్లో కనీస లిమిట్ లేదు. గరిష్ట పరిమితి రూ.10 లక్షలు.