కరోనాపై ఫైట్లో డాక్టర్లు, పోలీసులు, శానిటేషన్ సిబ్బంది ముందుండి పోరాడుతున్నారు. అందుకే వాళ్లను ఫ్రంట్లైన్ వారియర్స్గా ప్రజలందరూ గుర్తిస్తున్నారు. వారి త్యాగాలను మనసున్న ప్రతి ఒక్కరూ కొనియాడుతున్నారు. మరోవైపు కరోనాపై ప్రపంచం చేస్తున్న యుద్ధంలో టెక్నాలజీ కూడా ఎంతో సహాయపడుతోంది. ముఖ్యంగా రోగుల వార్డుల్లోకి వైద్యసిబ్బంది పదే పదే వెళ్లి వాళ్లకు సేవలు చేయాల్సి వస్తోంది. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది వైద్యసిబ్బంది తమ ప్రాణాలను కూడా త్యాగం చేయాల్సి వస్తోంది. వారికి రిస్క్ను కొంతవరకు తగ్గించేందుకు టెక్నాలజీ సాయంతో రోబోలను తయారుచేస్తున్నారు. రోగులున్న వార్డుల్లోకి పదేపదే వెళ్లేపని లేకుండా ఈ రోబోల ద్వారా ఫుడ్, మెడిసిన్స్ పంపిస్తున్నారు. కర్నాటక, కేరళ ఇలాంటి రోబోలను ఇప్పటికే ఉపయోగిస్తున్నాయి. లేటెస్ట్గా ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరులో కూడా ఇలా ఉపయోగపడే రోబోను తయారుచేశారు.
నెల్లూరు పేరు కలిసివచ్చేలా నెల్బోట్
కరోనా రోగులకు చికిత్స చేయడంలో వైద్య సిబ్బందికి ఉపయోగపడేలా నెల్లూరులోని ఆదాల ప్రభాకరరెడ్డి ఛారిటబుల్ ట్రస్ట్ ఒక ప్రత్యేక రోబోను రూపొందించింది. నెల్లూరు పేరు కూడా కలిసి వచ్చేలా దీనికి ‘నెల్బోట్’ అని పేరుపెట్టారు. ఆదాల ప్రభాకరరెడ్డి ఛారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకుడు నిజాముద్దీన్ మంగళవారం ఈ రోబోను నెల్లూరులోని జడ్పీ కార్యాలయానికి తీసుకువచ్చి దాని పనితీరును అధికారులకు చూపించారు. నెల్లూరు జాయింట్ కలెక్టర్ వినోద్కుమార్ దీన్ని ఆవిష్కరించారు. నెల్లూరు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి దీన్ని అందచేస్తామని ఆయన చెప్పారు.
ఎలా పనిచేస్తుందంటే..
నెల్బోట్.. ఐసోలేషన్లో ఉన్న రోగులకు మందులు, ఆహారం, కేస్షీట్లను అందిస్తుంది.
వారికి కాలక్షేపం కోసం దినపత్రికలు కూడా తీసుకెళ్లి ఇస్తుంది.
నెల్బోట్కు ఒక ఐపాడ్ను అమర్చారు. దీని ద్వారా రోగులు వైద్యసిబ్బందితో వీడియా కాల్స్ చేసుకుని తమకు కావాల్సిన సాయం పొందవచ్చు. అధికారులు అంగీకరిస్తే దీని ద్వారా కుటుంబసభ్యులకు కూడా కాల్స్ చేసుకుని ఒంటరితనాన్నిపోగొట్టుకోవచ్చు.