టెక్నాలజీ ప్రపంచంలో వారం వారం జరిగే విశేషాల సమాహారంగా ప్రతి వారం టెక్ రౌండప్ ఇస్తున్నాం. ఈ వారంలో టెక్నాలజీ సెక్టార్లో జరిగిన కీలక ఘటనలపై టెక్ రౌండప్ మీ కోసం..
1) పెయిడ్ న్యూస్ సబ్స్క్రిప్షన్ తీసుకురాబోతున్న హెచ్టీ మీడియా
ఇండియాలో పెద్ద వార్తా సంస్థల్లో ఒకటైన హిందుస్థాన్ టైమ్స్ మీడియా గ్రూప్ తమ డిజిటల్ న్యూస్ వింగ్కు సబ్స్క్రిప్షన్ పద్ధతిని ప్రవేశపెట్టనుంది. అంటే యూజర్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటేనే ఆ న్యూస్ చూడగలుగుతారు. ఈ ఏడాదే మింట్తో సహా కొన్ని బ్రాండ్స్ను ఈ సబ్స్క్రిప్షన్ మోడ్లోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నట్లు హెచ్టీ మీడియా డిజిటల్ సీఈవో చెప్పారు.
2)గూగుల్, ఫేస్బుక్, ట్విట్టర్లకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు
జమ్మూ కాశ్మీర్లోని కథువాలో సామూహిక అత్యాచారానికి గురై చంపబడిన చిన్నారి ఫోటోను వేసి, ఆమె ఎవరనేది తెలియజేసేలా ప్రవర్తించినందుకు గూగుల్, ఫేస్బుక్, ట్విట్టర్లకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు పంపింది. టెక్నాలజీ దిగ్గజాలు దేశానికి చేసిన గొప్ప అపచారం ఇది అని ఘాటుగా వ్యాఖ్యానించింది.దీనిమీద సంజాయిషీ చెప్పాలని నోటీసుల్లో ఆదేశించింది.
3) జస్ట్ డయల్ లాభంలో 53 శాతం వృద్ధి
ఆన్లైన్ క్లాసిఫైడ్స్, ఈకామర్స్ బిజినెస్ సంస్థ జస్ట్ డయల్ లాభాలో బాటలో వెళుతుంది. 2018 జనవరి నుంచి మార్చి 31 వరకు 39 కోట్ల రూపాయల లాభం సంపాదించింది.ఇది అంతకుముందు త్రైమాసికంతో పోల్చితే 53.6% ఎక్కువ.
4) తమిళనాడులో 3 జిల్లాల్లో ఇంటర్నెట్ బంద్
ఓ ఫ్యాక్టరీకి సంబంధించి జరిగిన ఆందోళనలో హింస చెలరేగి తమిళనాడులో తూత్తుకుడి రణరంగంగా మారింది. పోలీసు కాల్పుల్లో చాలామంది చనిపోయారు. ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల్లో ఆందోళనలు మరింత చెలరేగకుండా ఉండడం కోసం తూత్తుకుడి, కన్యాకుమారి, తిరునల్వేలి జిల్లాల్లో మొబైల్ ఇంటర్నెట్, బ్రాడ్బ్యాండ్ సర్వీసులను ఐదురోజులపాటు నిలిపివేశారు. ఆఖరికి ఫైబర్ బ్రాండ్ కూడా పనిచేయలేదని బీఎస్ఎన్ఎల్ అధికారి ఒకరు చెప్పారు.
5) జుకెర్బర్గ్ను ప్రశ్నించిన యూరోపియన్ పార్లమెంట్ ప్రతినిధులు
ఫేస్బుక్ అనలిటికా వివాదం నేపథ్యంలో ఫేస్బుక్ యూజర్ల డేటా లీకేజి, దాన్ని రాజకీయ పార్టీలకు వేరే థర్డ్ పార్టీలు అమ్ముకోవడం వంటి వాటితో ఫేస్బుక్ ప్రతిష్ఠ దెబ్బతింది. ఈ పరిస్థితుల్లో ఫేస్బుక్ సీఈవో జుకెర్బర్గ్ యూరోపియన్ పార్లమెంట్లో ప్రజాప్రతినిధులతో గంటన్ర సేపు మాట్లాడారు. ఇంతకుముందు యూఎస్ కాంగ్రెస్ ప్రతినిధులు కూడా జుకెర్ను ప్రశ్నించినా అది సాఫ్ట్గానే సాగిందని, యూరోపియన్ పార్లమెంట్లో మాత్రం ఫేస్బుక్ సీఈవోను ప్రశ్నలతో గట్టిగానే నిలదీసినట్లు సమాచారం.
6) 100 నుంచి 200 రూపాయలకే సింగిల్ లంచ్ ప్రవేశపెట్టిన స్విగ్గీ
ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ స్విగ్గీ పాప్ పేరుతో కొత్త సర్వీస్ను లాంచ్ చేసింది. యువ ప్రొఫెషనల్స్ కోసం సింగిల్ మీల్స్ను 99 నుంచి 200 రూపాయల్లోపు దగ్గరలో ఉన్న రెస్టారెంట్ల నుంచి తెచ్చి అందించడం దీని టార్గెట్. హైదరాబాద్, చైన్నైతోపాటు ఏడు నగరాల్లో ఈ సర్వీస్ను లాంచ్ చేసింది.
7) యూపీఐ పేమెంట్స్ తెచ్చిన మొబీక్విక్
పేమెంట్స్ యాప్ మొబీక్విక్ కూడా యూపీఐ బాట పట్టింది. మొబీక్విక్ యూజర్లు @ikwik అనే వర్చువల్ పేమెంట్స్ అడ్రస్ (వీపీఏ)ల ద్వారా ఎవరికైనా యూపీఐమోడ్లో డబ్బు పంపవచ్చు రిసీవ్చేసుకోవచ్చు కూడా.
8) రాజకీయ ప్రచారానికి రూల్స్ టైట్ చేసిన ట్విట్టర్
ఫేస్బుక్ బాటలోనే ట్విట్టర్ కూడా తన వేదిక మీద జరుగుతన్న రాజకీయ ప్రచారాన్నికంట్రోల్ చేయాలని భావిస్తోంది. 2016లో అమెరికా ఎన్నికలను రష్యా ప్రభావితం చేయడానికి ప్రధాన కారణం సోషల్ మీడియానే. ఈ పరిస్థితుల్లో ఇండియాలో రానున్న ఎన్నికల టైమ్ను దృష్టిలో పెట్టుకుని రూల్స్ టైట్ చేసింది. ట్విట్టర్లో ప్రకటనలిచ్చేవారు కొన్ని గైడ్లైన్స్ పాటించాలని సూచించింది.