టెక్నాలజీ ప్రపంచంలో అనునిత్యం చోటుచేసుకునే పరిణామాలను వారానికోసారి గుదిగుచ్చి అందిస్తుంది ఈ వారం టెక్ రౌండప్. ఫేస్బుక్ నుంచి ఆధార్ దాకా, భారతీయ భాషల్లో డొమైన్ నేమ్స్ నుంచి శ్రీ కృష్ణ కమిటీ డేటా ప్రొటెక్షన్ బిల్ వరకు టెక్నాలజీ సెక్టార్లో ఈ వారం జరిగిన విశేషాల సమాహారం మీకోసం..
తప్పుడు సమాచారం అరికట్టడానికి ఫేస్బుక్ ప్రయత్నాలు
ఫేస్బుక్ వేదికగా తప్పుడు సమాచారం ప్రజల్లోకి వెళుతుందన్న ఆరోపణలు వెల్లువలా వచ్చిపడుతుండడంతో ఫేస్బుక్ నష్టనివారణ చర్యలు ప్రారంభించింది. మెంటర్షిప్ ప్రోగ్రాం పేరుతో ఫేస్బుక్ గ్రూప్ వినియోగదారులకు ఓ ప్రత్యేక ఫీచర్ను తీసుకురాబోతోంది. మిస్ ఇన్ఫర్మేషన్ వెళ్లకుండా ఏం చేయాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని యూజర్లకు గైడ్లైన్స్ ఇవ్వడం ఈ ఫీచర్ ఉద్దేశం. మొదట కొన్ని గ్రూప్లకు ప్రారంభిస్తారు. తర్వాత అన్ని గ్రూప్లకు ఈ ఫీచర్ అందుబాటులోకి తెస్తారు.
డేటా ప్రొటెక్షన్ బిల్పై ప్రజాభిప్రాయ సేకరణ
సోషల్ మీడియా, పేమెంట్ యాప్స్, బ్యాంకింగ్ కూడా ఆన్లైన్ అయిపోయిన పరిస్థితుల్లో ప్రజల డేటా సెక్యూరిటీ చాలా పెద్ద సమస్యగా మారింది. ఈ పరిస్థితుల్లో ఐటీ మినిస్ట్రీ డేటా ప్రొటెక్షన్కు బిల్ తయారు చేయడానికి శ్రీకృష్ణ కమిటీని నియమించింది. ఈ కమిటీ వివిధ అంశాలను పరిశీలించి ఒక డ్రాఫ్ట్ బిల్ తయారుచేసింది. ఈ బిల్పై ప్రజలు అభిప్రాయాలు చెప్పాలని కేంద్ర ఐటీ శాఖ కోరుతోంది. సెప్టెటంబర్ 5వ తేదీ వరకు ప్రజలు ఈ బిల్లులో మార్పుచేర్పులు సూచించవచ్చు.
లీ లిగా సాకర్ టోర్నమెంట్ ప్రసార హక్కులు కొన్న ఫేస్బుక్
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ స్పానిష్ లీగ్ సాకర్ టోర్నమెంట్ లీ లిగా ప్రసార హక్కలు సొంతం చేసుకుంది. వరుసగా 3 సీజన్ల పాటు భారత ఉపఖండం(ఇండియా, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్గనిస్తాన్, భూటాన్, నేపాన్, మాల్దీవులు)లో ఈ టోర్నమెంట్ను ఫేస్బుక్ ప్రసారం చేయబోతోంది. ఈ శుక్రవారం నుంచి మొలయ్యే టోర్నమెంట్లో 386 మ్యాచ్లను లైవ్ టెలికాస్ట్ చేయబోతోంది.
9 భారతీయ భాషల్లో డొమైన్ పేర్లు
బంగ్లాదేశ్, దేవనాగరి, గుజరాతి, గురుముఖి, కన్నడ, మలయాళం, ఒరియా, తమిళ్ మరియు తెలుగు భాషల్లో వెబ్ డొమైన్ పేర్లు పెట్టడానికి ఏర్పాట్లు చేయాలని ఇండియన్ కార్పోరేషన్ ఫర్ అసైన్డ్ నేమ్స్ అండ్ నంబర్స్ (ICANN) కోరింది. అంటే ఈ తొమ్మిది భారతీయ భాషల్లో డొమైన్ పేర్లను ఇంటర్నెట్లో చేర్చడానికి మార్గం సుగమమయింది. అయితే .కామ్ అని ఉంటే వీటిలో చాలా భాషల్లో డొమైన్ పేర్లు టైప్ చేసి వాటిని యూనికోడ్లోకి మార్చినప్పుడు తప్పు అర్ధం వచ్చి ఆ సైట్ ఓపెన్ కాదు.
భవిష్యత్తుపై ఎయిర్టెల్ కోటి ఆశలు
ఇండియన్ టెలికాం ఇండస్ట్రీలో గుత్తాధిపత్యం చలాయించి జియో దెబ్బకు వెనుకబడ్డ ఎయిర్టెల్ ఈ ఆర్థిక సంవత్సరం తొలి మూడు నెలల్లో నష్టాల అంచుల దాకా వెళ్లి రెప్పపాటులో బయటపడింది. తొలి త్రైమాసికంలో 97 కోట్ల లాభాన్ని ఎయిర్టెల్ సంపాదించింది. ఇందులో నైజీరియా నుంచి దాదాపు 515 కోట్ల రూపాయల బాకీ వసూలైంది. లేకపోతే 420 కోట్ల నికర నష్టం ఎయిర్టెల్ నెత్తిన పడేది. అయినా ఇంత పెద్ద దేశంలో ఫాస్ట్ గోయింగ్ ఇండస్ట్ర్రీలో ఉన్నాం కాబట్టి త్వరలోనే పుంజుకుని, నష్టాల్లోంచి బయటపడతామని ఎయిర్టెల్ నమ్మకం పెట్టుకుంది.
1,662 పోస్ట్లు బ్లాక్ చేసిన ఆన్లైన్ ఫ్లాట్ఫామ్స్
ట్విట్టర్, ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లతోపాటు ఇతర ఆన్లైన్ వేదికల్లో 2016 నుండి ప్రభుత్వ డిమాండ్ మేరకు 1,662 పోస్ట్లను ఆయా ఫ్లాట్ఫామ్స్ తొలగించాయని పార్లమెంట్లో ప్రభుత్వం ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పింది. ఐటి చట్టం సెక్షన్ 69A ప్రకారం ఈ ఇల్లీగల్ కంటెంట్ను ఉపసంహరించారు. వీటిలో ఫేస్బుక్లో ఉన్న యూఆర్ఎల్సే ఎక్కువ. ఫేస్బుక్ ఫ్లాట్ఫాం మీద 2017లో 457, ఈ సంవత్సరం జూన్ వరకు 499 యూఆర్ ఎల్స్ను బ్లాక్ చేశారు. లాస్ట్ ఇయర్ ట్విట్టర్లో 321 యూఆర్ఎల్స్ను బ్లాక్ చేస్తే ఈ సంవత్సరం 88 బ్లాక్ అయ్యాయి.
40 లక్షల మంది అస్సామీలకు బయోమెట్రిక్ వివరాల్లేవు
నేషనల్ రిజిస్టరీ ఆఫ్ సిటిజన్స్ (ఎన్ఆర్సీ)లో 40 లక్షల మంది అస్సామ్ ప్రజలు బయోమెట్రిక్ వివరాలు నమోదవలేదని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు చెప్పింది. ఎన్ఆర్సీ ఫైనల్ లిస్ట్ ప్రకటించిన తర్వాత ఈ జాబితాలో పేరు లేని వారికి ప్రత్యేకంగా ఆధార్ నెంబర్లు ఇస్తారు. ఈ 40 లక్షల మంది వివరాలు, బయోమెట్రిక్స్ తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం, ఉడాయ్ (UIDAI) కలిసి పని చేస్తున్నాయని ప్రభుత్వం కోర్టుకు వివరించింది.
పేమెంట్స్ డేటా స్టోరేజ్ ఆంక్షలపై విదేశీ కంపెనీల ఆందోళన
ఇండియాలో పని చేసే పేమెంట్స్ కంపెనీలు ఈ పేమెంట్స్ డేటాను ఇండియాలోనే స్టోర్ చేయాలని, దేశం బయట స్టోర్ చేయకూడదని ఆర్బీఐ ఇచ్చిన ఆదేశాలు విదేశీ కంపెనీలకు సంకటంగా మారాయి.దీనికి గడువు కూడా రెండు నెలల్లోపే ఉంది. ఆలోగానే తాము డేటా స్టోరేజ్ సెటప్ ఇక్కడే పెట్టుకున్నామని, దేశం దాటి ఈ డేటా బయటికి వెళ్లడం లేదని కంపెనీలు చెప్పాలి. అయితే విదేశీ కంపెనీలు దీనిపై ఆర్బీఐ మళ్లీ ఆలోచించాలని కోరుతున్నాయి. యూపీఐ బేస్డ్ పేమెంట్స్ ఫీచర్ను ప్రవేశపెట్టాలని రెడీ అయిన అమెజాన్ కూడా ఇప్పుడు దీంతో వెనకడుగు వేసింది.
లొకేషన్ హిస్టరీ ఆఫ్ చేసినా మీ డేటాను సేవ్ చేసేస్తున్న గూగుల్
గూగుల్ మన ప్రతి యాక్షన్ను, మనం ఎక్కడికి వెళుతున్నామో సేవ్ చేసేస్తుంది. దాన్ని అడ్డుకోవాలంటే లొకేషన్ హిస్టరీ ఆఫ్ చేస్తేచాలు.. మీకు ఎక్కడికి వెళుతున్నారనేది గూగుల్ స్టోర్ చేయలేదు.. అని గూగులే గతంలో చెప్పింది. అయితే దీన్ని ఆఫ్ చేసినంత మాత్రాన మీరు ఎక్కడికి వెళుతున్నారనే సమాచారందాగదని, గూగుల్ ఇతర యాప్ల ద్వారా ఈ సమాచారం వచ్చిగూగుల్ సర్వర్లో సేవ్ అయిపోతుంది. ఈ విషయాన్న గూగులే చెప్పడం అందరికీ ఆందోళన కలిగిస్తోంది.