ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో నుంచి మొదలుకుని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సైట్స్ వరకు టెక్నాలజీ రంగంలో ఈ వారం జరిగిన సంఘటనల సమాహారం ఈ టెక్ రౌండప్. ఓ రౌండేసి వద్దాం రండి..
నివాసితుల అనుమతి లేకుండా సీసీకెమెరా పెట్టడం చట్టవిరుద్ధం
నివాసితుల అనుమతి లేకుండా సీసీ కెమెరా పెట్టి పర్యవేక్షించడం చట్ట విరుద్ధమని బాంబే హైకోర్టు తీర్పు చెప్పింది. తమ అపార్ట్మెంట్ ఫ్లోర్లో ఉన్న 2 నుంచి 5 ఇళ్ల మీద సీసీ కెమెరా పెట్టారని, దీనికి తమ పర్మిషన్ తీసుకోలేదని నివాసితులు వేసిన పిటిషన్ మీద జస్టిస్ ఎస్జే కథవల్లా ఈ తీర్పు చెప్పారు. ఇది వ్యక్తుల స్వేచ్ఛకు భంగం కలిగించడమేనని న్యాయమూర్తి అన్నారు.
ఆంధ్రప్రదేశ్లో మెడిసిన్స్ కొన్నప్రజల వివరాలన్నీ లీక్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జనరిక్ ఔషధాలు విక్రయించడానికి ఏర్పాటు చేసిన అన్న సంజీవని దుకాణాల్లో మందులు కొన్నవారి వివరాలన్నీ లీకయ్యాయి. ఏ మందు ఎవరు కొన్నారు, వారి పేరు, వయసు, ఫోన్ నెంబర్తో సహా రిజిస్టర్ చేసుకున్నాకే అన్న సంజీవనిలో మందులు అమ్ముతారు. అయితే ఈ వివరాలు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వెబ్సైట్లో ప్రత్యక్షమవడం కలకలం సృష్టించింది. ఎందుకంటే వయాగ్రాను పోలిన సుహాగ్రా 50 లాంటి మందులు కొనుక్కున్నవాళ్లు ఎవరు వంటి సున్నిత సమాచారం కూడా ఇలా బహిర్గతమవడం విమర్శల పాలవడంతో గవర్నమెంట్ వెంటనే స్పందించింది. ఇప్పుడు ఆ వివరాలేమీ లేకుండా తొలగించింది.
సోషల్ మీడియా స్నూపింగ్ ప్రాజెక్టుపై అత్యవసర విచారణ చేపట్టలేం
సోషల్ మీడియా కంటెంట్ను మానిటర్ చేసి విశ్లేషించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న సోషల్ మీడియా కమ్యూనికేషన్ హబ్ ప్రాజెక్టుపై అత్యవసర విచారణ అవసరం లేదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. వ్యక్తుల స్వేచ్ఛకు భంగం కలిగించే ఈ ప్రాజెక్టును ఆపేయాలని, దీనిపై అత్యవసరంగా విచారణ చేపట్టాలని పశ్చిమబెంగాల్ ఎమ్మెల్యే మహువా మోయిత్రా సుప్రీంలో పిటిషన్ వేశారు. దీనికి కెఓర్టు ఈ రకంగా సమాధానమిచ్చింది.
మొబైల్ నెంబర్ పోర్టబులిటీలో బ్యాలన్స్ అమౌంట్ను బదిలీ చేయలేమన్న టెల్కోలు
మొబైల్ నెంబర్ పోర్టబులిటీతో ఒక నెట్వర్క్ నుంచి మరో నెట్వర్క్కి యూజర్లు మారినప్పుడు వారి పాత నెట్వర్క్లో ఉన్న రీఛార్జి బ్యాలన్స్ను కొత్త నెట్వర్క్కి ట్రాన్స్ఫర్ చేయాలన్న ప్రతిపాదను టెల్కోలు తిరస్కరించాయి. ట్రాయ్ ఏర్పాటు చేసిన సదస్సులో జియో, వొడాఫోన్, ఎయిర్టెల్ ఈ ప్రతిపాదనకు నో చెప్పాయి. యావరేజ్ ప్రీ పెయిడ్ నెంబర్లో ఉండే బ్యాలన్స్ చాలా తక్కువని, ఆ బ్యాలన్స్ ఖరీదు కంటే దాన్ని కొత్త నెట్వర్క్కు ట్రాన్స్ఫర్ చేయడానికి ఎక్కువ ఖర్చవుతుందని వొడాఫోన్ చెప్పింది. మిగతా కంపెనీలు దీన్ని సమర్థించాయి.
నకిలీ వార్తల్ని అడ్డుకోవడానికి ఇండియన్ జర్నలిస్ట్లకు గూగుల్ ట్రైనింగ్
సోషల్ మీడియా వచ్చాక మెయిన్ స్ట్రీమ్ మీడియా అయిన టీవీ, న్యూస్పేపర్ల మీద కూడా ప్రభావం పడింది. సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న న్యూస్ను అది నిజమో కాదో తేల్చుకోకుండానే పేపర్లు, టీవీల్లో వేసేస్తున్న సందర్భాలున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఫేక్ న్యూస్ను గుర్తించం, నిజాలను నిర్ధారించుకోవడంపై ఇండియాలో జర్నలిస్ట్లకు గూగుల్ శిక్షణ ఇవ్వబోతోంది. ఫ్యాక్ట్ చెకింగ్ సైట్లు బూమ్ లైవ్, ఇంటర్న్యూస్, న్యూస్ అనలిటిక్స్ కంపెనీ డేటాలీడ్స్తో కలిపి గూగుల్ ఈ శిక్షణ ఇవ్వనుంది.
ఏపీలోని 4.5 కోట్ల మంది డేటా అందరికీ అందుబాటులో..
ఆంధ్రప్రదేశ్లోని 4.5 కోట్ల మంది ప్రజల ఇంపార్టెంట్ డేటా ప్రమాదంలో పడినట్లయింది. స్మార్ట్ పల్స్ పేరిట గవర్నమెంట్ చేపట్టిన సర్వేలో సేకరించిన వివరాలను గవర్నమెంట్ సైట్లో పెడుతున్నారు. అయితే అందరూ యాక్సెస్ చేసుకోగలగడం విమర్శల పాలైంది. ఇందులో పేరు, మొబైల్ నెంబర్, అడ్రస్, ఇన్స్యూరెన్స్ చేశారా వంటి వివరాలన్నీ ఉంటాయి. కేవలం ఆధార్ నెంబర్ కొడితే చాలు ఆ వివరాలన్నీ ఈ సైట్లో వచ్చేస్తుండడంతో కలకలం రేగింది. ఈ విషయం తెలియగానే గవర్నమెంట్ వెంటనే వాటిని కంట్రోల్ చేస్తూ చర్యలు తీసుకుంది.
ఇంటర్నెట్తో కాల్స్ చేసుకోవడానికి టెల్కోలకు పర్మిషన్
ఇంటర్నెట్ ఆధారిత కాల్స్కు టెలికం కంపెనీలకు ట్రాయ్ పర్మిషన్ ఇచ్చింది. ఇండియాలో ఉన్న ఇతర నెంబర్లకు ఇంటర్నెట్ కనెక్షన్ ద్వారా ఫోన్ కాల్స్ చేసుకోవడానికి అవసరమైన యాప్స్ను టెల్కోలు వినియోగించుకోవచ్చని మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది.
డేటా లీకేజీలపై ఆడిట్కు ఏపీ సీఎం ఆదేశం
వరుసగా డేటా లీకవుతున్న వార్తలు వస్తుండడంతో ఏపీ గవర్నమెంట్ సైట్స్కు సంబంధించిన సెక్యూరిటీ వ్యవహారంపై ఆడిట్ నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. డేటా లీకేజీలు, ఇతర సాంకేతిక సమస్యలు డేటా బయటికి పొక్కడం వంటివి ఎక్కడ జరుగుతున్నాయో, కారణాలేమిటో గమనించి చర్యలు తీసుకోవాలని ఆర్డర్స్ ఇచ్చారు.
యూట్యూబ్ వీడియో క్రియేటర్లకు కొత్త మానిటైజేషన్ స్కీమ్
యూట్యూబ్ వీడియోల్లో మిడ్ లెవెల్ కంటెంట్ క్రియేటర్లకు వాటిని సొమ్ము చేసుకునే కొత్త మానిటైజేషన్ పథకాన్ని యూట్యూబ్ ప్రవేశపెట్టింది. పెయిడ్ సబ్స్క్రిప్షన్ ఫీచర్తో కంటెంట్ క్రియేటర్లు పేవాల్కు నెలకు 5 డాలర్లు (దాదాపు 325 రూపాయలు) వరకు అందుకోవచ్చు.
చెన్నై, కోల్కతా, అహ్మదాబాద్, చండీఘడ్లోనూ జొమాటో గోల్డ్
ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో తన పెయిడ్ సబ్స్క్రిప్షన్ ప్రొడక్ట్ జొమాటో గోల్డ్ను చెన్నై, అహ్మదాబాద్, చండీఘడ్లోనూ, కోల్కతాల్లోనూ అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటికే ఎన్సీఆర్/ ఢిల్లీ, ముంబయి, హైదరాబాద్, బెంగళూరు, పుణె, జైపూర్లలో ఈ సర్వీస్ ఉంది. దీంతో మొత్తంగా 10 నగరాల్లో జొమాటో గోల్డ్ అందుబాటులోకి వచ్చింది.