ట్రంప్ నేతృత్వం లోని యూఎస్ ప్రభుత్వం తన ఇమ్మిగ్రేషన్ పాలసీ ని సవరించనుంది. ఇకపై వివిధ దేశాలనుండి అమెరికా ఉద్యోగం నిమిత్తం వచ్చే వారికి సరికొత్త పద్దతిని ప్రవేశపెట్టనుంది. అదే మెరిట్ బేస్డ్ ఇమ్మిగ్రేషన్ సిస్టం. ఇకనుండి యూఎస్ లో ఉద్యోగం చేయాలనుకున్న ఎవరికైనా ఈ పద్దతిలోనే వీసా లు మంజూరు చేయనున్నారు. ప్రపంచం లోనే ఇది ఒక అద్భుతమైన విధానంగా వైట్ హౌస్ వర్గాలు చెబుతున్నాయి. ఈ విధానం గురించిన వివరాలు ఈ ఆర్టికల్ లో చూద్దాం.
మెరిట్ బేస్డ్ ఇమ్మిగ్రేషన్ అంటే ఏమిటి ?
ఇకపై అమెరికా లో ఉద్యోగానికి వచ్చే వారికి వారి ఉద్యోగానికి సంబందించిన అత్యద్భుతమైన నైపుణ్యాలు ఉండాలి.
ఎటువంటి పరిస్థితుల లోనైనా ఇమడగలిగే చొరవ, టాలెంట్ ఉండాలి.
ఇంగ్లీష్ ధారాళంగా మాట్లాడగలగాలి.
అంటే ఇకపై యూ ఎస్ కి వచ్చే వారి పట్ల ఎటువంటి పక్షపాత ధోరణి ని ప్రభుత్వం ప్రదర్శించదు. వాళ్ళు తెల్లవారైనా, నల్లవారైనా, ఏ దేశానికి చెందిన వారైనా, ఏ మతానికి చెందిన వారైనా సరే వారు అమెరికా సమాజానికి ఏ విధంగా ఉపయోగపడనున్నారు అనే విషయాన్ని ఈ మెరిట్ బేస్డ్ సిస్టం లో పరీక్షించిన తర్వాతనే వారికి వీసా మంజూరు చేస్తారు.
గత కొన్ని సంవత్సరాల క్రితం ఉన్న డెమోక్రాటిక్ ప్రభుత్వం కూడా దాదాపు ఇలాంటి వ్యవస్థ నే ప్రతిపాదించింది.
దీనికి కారణం ఏమిటి ?
ప్రస్తుతం ఉన్న ఇమ్మిగ్రేషన్ వ్యవస్థ పట్ల ట్రంప్ ప్రభుత్వానికి నమ్మకం లేదు. ఈ వ్యవస్థ యూ ఎస్ యొక్క భద్రతను, రక్షణ ను బలహీనపరుస్తుందని ట్రంప్ ప్రభుత్వం గట్టిగా నమ్ముతుంది. ప్రస్తుతం ఉన్న వ్యవస్థ ఉగ్రవాదులు దేశం లోనికి ప్రవేశించడానికి అనువుగా ఉంది. దేశం లోనికి ప్రవేశిస్తున్న ప్రతీ నలుగురు టెర్రరిస్ట్ లలో ముగ్గురు ప్రస్తుతం ఉన్న ఇమ్మిగ్రేషన్ వ్యవస్థ ద్వారానే దేశం లోనికి ప్రవేశిస్తున్నారు. కాబట్టి ఈ వ్యవస్థను ప్రక్షాళన చేసి పూర్తి రక్షణాత్మక మైన ఒక సరికొత్త ఇమ్మిగ్రేషన్ వ్యవస్థను ప్రవేశ పెట్టవలసిన అవసరం ఉంది. ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ఈ మెరిట్ బేస్డ్ ఇమ్మిగ్రేషన్ అనేది ఒక చక్కటి ప్రత్యామ్నాయం కాగలదు అని వైట్ హౌస్ వర్గాలు బలంగా విశ్వసిస్తున్నాయి.
దీని పరిణామాలు ఏమిటి ?
అధికారం లోనికి వచ్చిన దగ్గరనుండీ ట్రంప్ యొక్క విదేశీ పాలసీ అనేక విమర్శలు ఎదుర్కొంటున్న నేపథ్యం లో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అశావహులకు ఒక ఊరట కానుంది. ఆంగ్లభాషా నైపుణ్యాలు మరియు ఇతర సాంకేతిక నైపుణ్యాలను మెరుగు పరచుకునేందుకు అభ్యర్థులకు ఇది ఒక అవకాశంగా మారనుంది. ప్రత్యేకించి మన భారత దేశం నుండి అమెరికా వెళ్ళే ఉద్యోగార్థులకు ఇది సదవకాశం గా చెప్పవచ్చు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా అమెరికాకు వెళ్ళే వారిలో భారతీయుల సంఖ్యే ఎక్కువ. మిగతా దేశాల వారితో పోలిస్తే ఇండియన్స్ కు నైపుణ్యాలు కూడా ఎక్కువే అని అనేక సర్వే లు చెబుతున్నాయి. ఈ నేపథ్యం లో ఈ సరికొత్త మెరిట్ బేస్డ్ ఇమ్మిగ్రేషన్ సిస్టం వలన భారతీయ ఉద్యోగార్థులకు ఎలాంటి ఇబ్బంది ఉండబోదనీ ఒకవేళ ఎవరికైనా స్కిల్స్ తక్కువగా ఉంటే వాటిని మెరుగుపరచుకుంటే సులభంగా నే అమెరికా కు వెళ్ళవచ్చు అని విశ్లేషకులు భావిస్తున్నారు.