కంపెనీ.. ఇది స్థాపించాలంటే ఎంతో శ్రమ. ఎందరో కలిస్తే నెరవేరని కల... కానీ ఒక్కరోజులోనే కంపెనీ పెట్టేయచ్చంటే మీరు నమ్మగలరా? కంపెనీ పెట్టాలంటే సాధారణంగా పెట్టుబడితో పాటు భాగస్వాముల మధ్య ఒప్పందాలు స్పష్టంగా ఉండాలి. కంపెనీ లక్ష్యాలపై మంచి అవగాహన ఉండాలి. అంతేకాదు అధికారుల నుంచి అనుమతులు కావాలి. ఇవన్నీ జరగడానికి వారాలు పట్టొచ్చు, నెలలు పట్టొచ్చు... సంవత్సరాలు కూడా పట్టొచ్చు. కానీ ఇవన్నీ పక్కనపెడితే కేవలం ఒకే ఒక్క రోజులో కంపెనీ పెట్టే అవకాశం ఉంటే అది నిజంగా వండరే. కానీ భారత ప్రభుత్వం కేవలం ఒక్క రోజులోనే కంపెనీ పెట్టే అవకాశాన్ని కల్పిస్తోంది అదెలాగో చూద్దాం.
ఒక రోజు.. ఒక అడుగు
నరేంద్ర మోడీ ప్రభుత్వం మేకిన్ ఇండియా నినాదం ప్రకారం భారత్లో కంపెనీల స్థాపనకు పెద్ద పీట వేస్తోంది. దీనిలో భాగంగానే ఒక రోజు.. ఒక అడుగు పేరిట ప్రభుత్వం ఒక కార్యక్రమాన్ని చేపట్టింది. దీని ప్రకారం ఎవరైనా కంపెనీ పెట్టాలనుకుంటే వారికి అనుమతులు వెంటనే దొరుకుతయి. కంపెనీ పేరు ఆమోదం, డైరెక్టర్ గుర్తింపు సంఖ్య, కంపెనీ స్థానపనకు సంబంధించిన సర్టిఫికెట్, కంపెనీ పాన్, టాన్ నంబర్లు కేవలం ఒకే రోజులో వచ్చేస్తాయి. ఈ పథకం ద్వారా స్పెసిఫైడ్ ఫ్రొఫార్మా ఫర్ ఇన్కార్పొరేటింగ్ కంపెనీ ఎలక్ర్టానికల్లీ ఫామ్తో కంపెనీని స్థాపించొచ్చు. అంతేకాదు ప్రైవేటు లిమిటెడ్ కంపెనీని కూడా ఒకే రోజులో నెలకొల్పొచ్చు. కంపెనీ స్థాపన అప్లికేషన్ ప్రాసెస్ ఫీజును రూ.2000 నుంచి రూ.500 కు తగ్గించారు. గతంలో పాన్, టాన్ నంబర్లు 15 రోజులకు కానీ వచ్చేవి కావు కానీ ఇప్పుడు కేవలం ఒక్క రోజులనే వచ్చే వీలుంది.
భారత్లో కంపెనీ పెట్టాలంటే...
1. కంపెనీ డైరెక్టర్ బాధ్యతలు చేపట్టేందుకు ఇద్దరికి అవకాశం ఉంటుంది
2. మీరు ఏ స్థలంలో వ్యాపారం చేస్తున్నారో తెలపాలి
3. మీరు స్థాపించబోయే కంపెనీ ఫామ్స్పై క్వాలిఫైడ్ చార్టెడ్ అకౌంటెంట్ సంతకం కావాలి
4. అందరి డైరెక్టర్ల డిజిటల్ సంతకం తప్పనిసరి
5. అందరు డైరెక్టర్ల పాన్ కార్డు, ఐడీ ఫ్రూఫ్ కూడా తప్పనిసరి. అంతేకాదు కంపెనీ పేరిట ఒక బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేయాలి
6. కంపెనీకి ఒక ఆడిటర్ను తక్షణం నియమించుకోవాలి