భారత్లో ఇప్పుడు నడుస్తోంది డిజిటల్ హవా. నరేంద్ర మోదీ ప్రభుత్వం పిలుపు మేరకు ప్రజలంతా డిజిటల్ చెల్లింపులకే మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో వచ్చిందే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) విధానం. దీన్ని ఏ ముహూర్తాన ప్రారంభించారో కానీ వినియోగదారులు కూడా బాగా అలవాటుపడ్డారు. ఎక్కువ లావాదేవీలు యూపీఐ ద్వారానే నిర్వహిస్తున్నారు. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ ట్రాన్సాక్షన్లు కోటి దాటినట్లు అధికారులు చెప్పారు. దీంతో త్వరలో కార్డు పేమెంట్లను యూపీఐ దాటి వేసే అవకాశాలున్నాయని చెబుతున్నారు.
వేగం.. శరవేగం
గతేడాది ఏప్రిల్లో కేంద్రప్రభుత్వం లాంఛనంగా ప్రారంభించిన యూపీఐ విధానం ఆరంభం నుంచే దూసుకుపోయింది. 2016 ఆగస్టు ఒక్క నెలలోనే ఏకంగా 10 లక్షల ట్రాన్సాక్షన్లను నమోదు చేసింది. 11 నెలల వ్యవధిలోనే ట్రాన్సాక్షన్ల సంఖ్య 10 లక్షల నుంచి కోటికి చేరుకుంది. భవిష్యత్లో యూపీఐ ట్రాన్సాక్షన్లు కార్డు బేస్డ్ ట్రాన్సాక్షన్లను దాటేసే అవకాశాలున్నాయి. అయితే యూపీఐ ఇంత వేగంగా వ్యాప్తి చెందడానికి చాలా కారణాలున్నాయి. మిగిలిన పేమెంట్ ఆప్షన్లతో పోలిస్తే యూపీఐ సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో బాగా ప్రాచుర్యం పొందింది. ఇటీవల కాలంలో ఎక్కువసార్లు షేర్ చేసిన పోస్ట్లలోఇదొకటి.
50 బ్యాంకులు ఆఫర్ చేస్తున్నాయ్
యూపీఐ సేవలను 50 బ్యాంకులు ఆఫర్ చేస్తున్నాయి. ఏం బ్యాంకుకు ఆ బ్యాంకు ఆఫీషియల్ యాప్లలో యూపీఐని భాగం చేశాయి. దీంతో ఆయా బ్యాంకులకు సంబంధించిన కస్టమర్లు కచ్చితంగా ఈ సేవల్ని వాడుకుంటున్నారు. బ్యాంకులు మాత్రమే కాదు ఉబర్, వాట్సప్, హైక్, ఇండియన్ రైల్వేస్, మేక్ మై ట్రిప్, ఐసీఐసీఐ బ్యాంకు, ఓలా యూపీఐ సేవలను వినియోగిస్తున్నాయి. గత మూడు నెలల నుంచి యూపీఐ ట్రాన్సాక్షన్లు పెరుగుతూ వస్తున్నాయి. ఏప్రిల్ 2017లో 72 లక్షలుగా ఉన్న ట్రాన్సాక్షన్లు, మేలో 93 లక్షలు, జూన్లో 1.3 కోట్ల ట్రాన్సాక్షన్లు నమోదయ్యాయి.
అందుకే ఆదరణ
యూపీఐలో 22 శాతం ట్రాన్సాక్షన్లు మార్చెంట్ బేస్డ్గా ఉన్నాయి. దీన్ని వల్ల వ్యాపారులకు లావాదేవీలు చాలా సులభం. అంతేకాదు యూపీఐని ఉపయోగించడం చాలా సులభం. మొబైల్ నంబర్, బ్యాంక్ అకౌంట్ ఉంటే చాలు డబ్బులు ట్రాన్సఫర్ చేయడం, రిసీవ్ చేసుకోవడం తేలిక. భవిష్యత్లో రాబోతున్న భీమ్ యాప్ ద్వారా యూపీఐ ట్రాన్సాక్షన్లు మరింత సులభంగా ఉండనున్నాయి. ఇప్పటికే భారత్లో ఉనన ఈ వాలెట్లను అన్నిటిని యూపీఐ దాటేసింది. సగటున రూ.4 వేలు చొప్పున ట్రాన్సాక్షన్లు జరుగుతున్నాయట.