తెలంగాణ పరిధిలో ఉన్న సదరన్ పవర్ డిస్ర్టిబ్యూషన్ సంస్థ ఆన్ లైన్ లో దూకుడు చూపిస్తోంది. బిల్లుల పేమెంట్లు వంటివే కాకుండా కొత్తగా కనెక్షన్ కావాలన్నా కూడా ఆన్ లైన్లోనే పని కానిచ్చేస్తోంది. దీంతో ఈ సంస్థ ఇప్పుడు మిగతా ప్రభుత్వ శాఖలకు ఆదర్శంగా మారుతోంది. ఎస్పీడీసీఎల్ పరిధిలో కొత్తగా విద్యుత్ కనెక్షన్ తీసుకునే వినియోగదారుల కోసం ఆన్లైన్ విధానాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నారు. వెబ్సైట్లో లాగిన్ అయి ఎడమవైపు ఉన్న న్యూసర్వీస్ రిజిస్ర్టేషన్ దరఖాస్తు పూర్తిచేసి సంబంధిత పత్రాలు సమర్పిస్తే కొత్త మీటర్ కనెక్షన్ ఇచ్చేస్తారు. కొత్త విద్యుత్ కనెక్షన తీసుకునే విధానాన్ని మరింత సులభతరం చేసేందుకు ఆన్లైన్ సేవలు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు విద్యుత్ అధికారులు చెబుతున్నారు. ఆన్లైన్లో విద్యుత్ బిల్లులు చెల్లించడంపై వినియోగదారుల్లో అవగాహన కల్పిస్తున్న అధికారులు ఇక ఆన్లైన్ ద్వారా కొత్త కనెక్షన్లు తీసుకునే అంశంపై ప్రచారం నిర్వహించే ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే పైలట్ ప్రాజెక్ట్గా ఆన్లైన్ దరఖాస్తుల పనితీరును పరిశీలించిన సదరన్ పవర్ డిస్ర్టిబ్యూషన్ అధికారులు మంచి ఫలితాలు సాధించండంతో మరికొన్ని రోజుల్లో ఈ ఆన్లైన్ విధానాన్ని గ్రేటర్ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు. విద్యుత్ పంపిణీ సంస్థ వెబ్సైట్లో ఆన్లైన్ దరఖాస్తుల విధానం అందుబాటులోకి వస్తే వినియోగ దారుల సేవలు మరింత సులభతరమవుతాయని ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు. గృహవినియోగ కనెక్షన్ కోసం రూ.25 అప్లికేషన్ ఫీజు, డెవలప్మెంట్ ఫీజు కింద రూ.1200 చెల్లించాల్సి ఉంటుంది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వినియోగదారుల సెల్ఫోన్కు మెసేజ్ రూపంలో సమాచారం వచ్చేలా ఏర్పాటు చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఏటా కొత్తగా దరఖాస్తు చేసుకునేవారికి సత్వరం కనెక్షన్లు ఇవ్వడానికి... ఆ డాటా ప్రాసెస్ చేయడానికి అధికారులకు కష్టమవుతోంది. దీంతో కొత్త విద్యుత్ కనెక్షన్లు తీసుకునే వినియోగదారులకు సమస్యలు పెరుగుతున్నాయి. విద్యుత సంస్థకు మీటర్ తీసుకునేందుకు చెల్లించే రూపాయల కంటే స్థానిక అధికారులు, సిబ్బందికి ఎక్కువ రూపాయలు చెల్లించాల్సిన పరిస్థితులు పలు సర్కిళ్లలో ఉన్నాయి. కొత్త విద్యుత మీటర్లు తీసుకునేందుకు అడిగినంత ఇవ్వకపోతే పలు కారణాలతో నెలల తరబడి కనెక్షన్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఆన్లైన్ విధానం వస్తే ఈ సమస్యలుండవని వినియోగదారులు అంటున్నారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే వినియోగదారులకు మీటర్ ప్రక్రియ ఏ స్థాయిలో ఉందో తెలుసుకునే అవకాశం కూడా కల్పిస్తున్నారు. |