నగరవాసులు ఇంట్లో నుంచే అన్ని రకాల సేవలు పొందే వీలు ప్రపంచమంతా టెక్నాలజీ వెంట పరుగులు తీస్తోంది. దేశాలు, రాష్ట్రాలే కాదు... వివిధ శాఖలూ ఎవరికి వారు సాంకేతికతతో పనులు సులభం చేసుకుంటున్నారు. ఇప్పుడు హైదరాబాద్ నగరం కూడా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుంటూ నగరవాసులు ఇంట్లో నుంచే అన్ని రకాల సేవలు పొందే వీలు కల్పిస్తోంది. ప్రస్తుతం నగరంలోని పలు అభివృద్ధి పనులకు సంబంధించి పలు అంశాలు ఇతర శాఖలతో ముడిపడి ఉన్నందున, సంబంధిత శాఖల అధికారులతో సంప్రదింపులు జరపటం, వారితో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించటం వంటి వాటితో ఎక్కువ సమయం వృధా అవుతుండటంతో జిహెచ్ఎంసి అధికారులు అన్ని ప్రభుత్వ శాఖలను కలుపుతూ ఓ పోర్టల్ను తయారు చేసేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం అన్ని ప్రభుత్వ శాఖల సేవలను జిహెచ్ఎంసి ద్వారా ఓ పోర్టల్ పరిధిలోకి తీసుకువచ్చి, ఆయా శాఖల మధ్య సమాచారం షేర్ చేసుకోవటం, ఫైళ్ల నిర్వహణ వంటి అంశాలు మెరుగుగా కొంతకాలం నిర్వహించిన తర్వాత అవసరమైతే మరికొంత కాలం జిహెచ్ఎంసి ద్వారా అడ్మినిస్ట్రేటర్ను మెయింటైన్ చేస్తూ సామాన్య ప్రజలకు అందుబాటులోకి తేవాలని అధికారులు యోచిస్తున్నారు. ప్రజలు ఇంట్లో కూర్చొని ఈ పోర్టల్లోకి లాగిన్ అయి తమకు కావల్సిన సేవలను ఎంచుకుని, ఇవ్వాల్సిన ఫిర్యాదులను సమర్పిస్తే, అవి సంబంధిత విభాగాధిపతికి చేరేలా ఈ పోర్టల్ను డిజైన్ చేస్తున్నారు. ఆయన ఆ పని ఏ స్థాయి అధికారుల పరిధిలో ఉందో గుర్తించి, అక్కడకు పంపి, అందుకు నిర్ణీత గడువును కూడా నిర్ణయిస్తారు. ఆ తర్వాత తానిచ్చిన ఫిర్యాదు గానీ, అభ్యర్థించిన సేవల కోసం సమర్పించిన ఆర్జీ ఏ స్థాయిలో ఉందో సామాన్య ప్రజలు కూడా తెల్సుకునే విధంగా దీన్ని రూపకల్పన చేస్తున్నారు. తొలి దశగా ఆయా ప్రభుత్వ శాఖల మధ్య ప్రారంభమయ్యే ఈ పోర్టల్ ఆ తర్వాత ఆయా శాఖల మధ్య జరుగుతున్న ఫైళ్ల నిర్వహణతో పాటు ప్రజల ఆర్జీలు, ఫిర్యాదులు ఏ స్థాయిలో ఉన్నాయో కూడా వీక్షించేందుకు వీలుగా ఈ పోర్టల్ రూపొందిస్తున్నారు. ఇది పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే నిత్యం బిజీగా ఉండే నగరవాసులకు ఎంతో సమయం ఆదాఅవడం గ్యారంటీ. |