హైదరాబాద్ సిటీని బీఎస్ఎన్ఎల్ వైఫై సిటీగా మార్చేస్తోంది. భాగ్యనగరంలోని 43 ప్రాంతాల్లో 113 వై–ఫై హాట్స్పాట్ పరికరాలను ఏర్పాటు చేసింది. ఈ 43 చోట్ల హైదరాబాదీలు ఇప్పుడు ఉచితంగా వై–ఫై సేవలను పొందుతున్నారు. తొలి 15 నిమిషాల పాటు ఈ వై–ఫై సేవలు ఉచితంగా అందుతాయి. ఆ తర్వాత వై–ఫై సేవలను వినియోగించేందుకు ప్రతి అరగంటకు రూ.30 చార్జి పడుతుంది.
ప్రయోజనాలకు, పనికిమాలిన పనులకు...
ప్రస్తుతం అందుబాటులో ఉన్న 43 ఫ్రీ వై–ఫై హాట్స్పాట్స్ వద్ద ఎక్కవ మంది సినిమాలు, పాటలు వంటి వినోదాన్ని పంచే కార్యక్రమాలను వీక్షించేందుకు యూట్యూబ్ లాంటి సైట్లను ఆశ్రయిస్తున్నారట. ఇక కొంతమంది కుర్రకారు ఉచిత వై–ఫై లభిస్తున్న తొలి 15 నిమిషాల్లో అశ్లీల, పోర్న్సైట్లను వీక్షించేందుకు, క్లిప్ లను డౌన్లోడ్ చేసుకుకునేందుకు వస్తున్నట్లుగా తెలుస్తోంది. మరికొందరు బస్సు, రైళ్ల వేళలు, రిజర్వేషన్ల వివరాలను ఆన్లైన్లో తెలుసుకుంటున్నారట.
అత్యధికంగా వాడుతున్నది ఇక్కడే..
ఇక ఉచిత డేటా వినియోగంలో గ్రేటర్లో ప్రముఖ పర్యాటక ప్రాంతాలు, బస్స్టేషన్లు అగ్రభాగాన నిలిచాయి. డేటా వినియోగంలో ట్యాంక్బండ్, నక్లెస్రోడ్, మహాత్మాగాంధీ బస్స్టేషన్, లుంబినీపార్క్, జూబ్లీ బస్స్టేషన్ ప్రాంతాలు తొలి ఐదు స్థానాల్లో నిలిచాయి. గోల్కొండ కోట, చార్మినార్, సాలార్జంగ్ మ్యూజియం, జూపార్క్ వంటి పర్యాటక స్థలాల్లో ఉచిత వై–ఫై హాట్స్పాట్స్కు మాంచి డిమాండ్ ఉంది. ఆయా ప్రాంతాల్లో ఒక్కోక్కరు సగటున నిత్యం సుమారు 300 ఎంబీ డేటాను వినియోగించుకుంటున్నట్టు బీఎస్ఎన్ఎల్ వర్గాలు తెలిపాయి. వచ్చే మూడు నెలల్లో మరో 240 ప్రాంతాల్లో హాట్స్పాట్లను ఏర్పాటు చేయాలని బీఎస్ఎన్ఎల్ సంస్థ నిర్ణయించింది.