హైదరాబాద్ను విశ్వనగరంగా తయారు చేయాలన్న సంకల్పంతో ఉన్న తెలంగాణ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది. భారత్లో ప్రధాన నగరాల్లో ప్రజలకు ఉచితంగా వైఫై సేవలు అందుబాటులోకి తెస్తున్నయి ప్రభుత్వాలు. తాజాగా తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్లో వైఫై హాట్స్పాట్లను పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది. ఇప్పటికే ట్యాంక్బండ్, అసెంబ్లీ లాంటి కొన్ని పరిమిత ప్రాంతాల్లో మాత్రమే పబ్లిక్ వైఫైలను ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రభుత్వం... తాజాగా 1000 వైఫై హాట్స్పాట్లను ఏర్పాటు చేయడానికి ఆమోదం తెలిపింది. అంటే ఇకపై హైదరాబాద్లో ఏ ప్రధాన ప్రాంతానికి వెళ్లిన ఉచితంగా ఇంటర్నెట్ ఉపయోగించకోవచ్చన్నమాట. ఈ వైఫై ప్రాజెక్టు రూ.300 కోట్ల వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉందని ప్రభుత్వం తెలిపింది.
శరవేగంగా హైఫై
హైదరాబాద్లో ఏర్పాటు చేయనున్న వైఫై హాట్స్పాట్లకు హైఫై అని సంక్షిప్తంగా నామకరణం చేశారు. ఆరంభంలోనే 1000 హాట్స్పాట్లను ఏర్పాటు చేస్తామని ఇది ఆరంభం మాత్రమేనని త్వరలోనే మొత్తం హైదరాబాద్ నగరం వైఫై నగరంగా మారడమే తమ లక్ష్యమని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. ఈ వైఫై ఏర్పాట్లను శరవేగంగా చేయడానికి అధికారులు రంగంలోకి దిగారు. వినాయకచవితి ఉత్సవాలు వచ్చేలోపు ఈ వైవై సేవలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని అధికారులు ఆలోచిస్తున్నారు. ఈ వైఫై హాట్స్పాట్లు ఏర్పాటు చేసిన తర్వాత వాటి పని తీరును బట్టి మరో 2000 హాట్స్పాట్లను ఏర్పాటు చేసే అవకాశాలున్నాయని వారు చెబుతున్నారు.
30 నిమిషాల ఉచిత వైఫై
హైదరాబాద్లో ఏర్పాటు చేస్తున్న వైఫైను ప్రజలు 30 నిమిషాలు ఉచితంగా వాడుకోవచ్చు. ఆ తర్వాత నామినల్ రుసుము చెల్లించి ఉపయోగించుకోవచ్చు. దానికి కొంత లిమిట్ ఉంటుంది. ట్యాంక్ బండ్, నెక్లస్రోడ్లలో గతంలో ప్రయోగాత్మకంగా వైఫై హాట్స్పాట్లు ఏర్పాటు చేసింది ప్రభుత్వం. కానీ ఆశించినంత ఫలితం దక్కలేదు. ఆరంభంలో స్పందన బాగానే ఉన్నా... ఆ తర్వాత ఎవరూ ఉపయోగించుకోవట్లేదు. దీనికి కారణం సిగ్నల్ సరిగా లేకపోవడం, లాగిన్ కావడంలో ఇబ్బందులు పడడం. ఇలాంటి ఆరంభ ఇబ్బందుల్ని తొలగించి, మంచి సిగ్నల్తో, మంచి వేగంతో వైఫై అందిస్తామని ప్రభుత్వం చెబుతోంది. గతంలో బీఎస్ఎన్ఎన్తో ఒప్పందం చేసుకున్న ప్రభుత్వం ఈసారి పెద్ద కంపెనీలతో పొత్తు పొట్టుకోవాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం.