తెలంగాణలో రూలింగ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ఈ రోజు వరంగల్లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. లక్షల మంది పార్టీ క్యాడర్ హాజరయ్యే ఈ సభ కోసం విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా ఈసారి టెక్నాలజీని బాగా వాడుతున్నారు. ముఖ్యమంత్రి తనయుడు, మంత్రి కేటీఆర్ డైరెక్షన్ లో ఈ మీటింగ్కు సాంకేతికంగా చాలా వసతులు కల్పించారు. సోషల్ మీడియాలో పబ్లిసిటీ, యాప్ల వినియోగం, సభ లొకేషన్ను తెలుసుకోవడానికి గూగుల్ మ్యాప్ లింక్లు, నాయకులు, కార్యకర్తల మధ్య వాట్సాప్ గ్రూప్లు.. ఇలా అన్నింట్లోనూ టెక్నాలజీ ఎఫెక్ట్స్ కనిపిస్తున్నాయి.
ఫేస్బుక్ పేజీ, యాప్
టీఆర్ఎస్ బహిరంగ సభ గురించి సోషల మీడియాలో పబ్లిసిటీ చేయడానికి 10 మంది లీడర్లతో ఒక టీంను ఏర్పాటు చేశారు. Trs party 16th anniversary media cell పేరుతో ఒక ఫేస్బుక్ పేజీని కూడా క్రియేట్ చేశారు. సభకు సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు దీనిలో పెడుతుండడంతో క్యాడర్కు మంచి జోష్ వచ్చిందని టీఆర్ఎస్ లీడర్లు చెబుతున్నారు. 22 లక్షల మంది ఈ పేజ్ను ఫాలో అవుతుండడం సోషల్ మీడియాలో విశేషమే. ఈ పేజ్ ద్వారా సభను లైవ్స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు టీఆర్ఎస్ సోషల్ మీడియా టీమ్ చెబుతోంది. ప్రత్యేకంగా ఒక యాప్ను కూడా క్రియేట్ చేశారు. దీంతో ఎప్పటికప్పుడు సమాచారం షేర్ చేసుకునే వీలుంది. పార్కింగ్ ఎక్కడుంది? సభకు ఎలా వెళ్లాలి వంటి వివరాలు యాప్తో కూడా తెలుసుకోవచ్చు.
డ్రోన్ కెమెరాలు, గూగుల్ మ్యాప్లు
మీటింగ్కు వచ్చే లక్షల మంది క్యాడర్ కోసం వరంగల్ సిటీలో 9 పార్కింగ్ జోన్లు ఏర్పాటు చేశారు. ఒక్కో జిల్లా నుంచి వచ్చే వాహనాలకు ఒక్కోచోట పార్కింగ్ ఇచ్చారు. క్యాడర్ వాహనాలు ఆ పార్కింగ్ ప్లేస్లకు నేరుగా చేరుకునేందుకు గూగుల్ మ్యాప్ లింక్ను ఏర్పాటు చేశారు. ఈ లింక్ను ఆర్గనైజర్స్ టీఆర్ఎస్ జిల్లాల లీడర్లకు పంపించారు. వారు కింది స్థాయి క్యాడర్కు వాట్సాప్ గ్రూప్ల ద్వారా దీన్ని సర్క్యులేట్ చేశారు. సభను అన్ని యాంగిల్స్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా కవర్ చేసేందుకు 9 భారీ డ్రోన్ కెమెరాలను ఏర్పాటు చేశారు. దాదాపు 2వేల ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఉన్న ప్రకాష్రెడ్డి పేట గ్రౌండ్స్లో జరిగే ఈ సభను వచ్చేవారు క్లియర్గా చూడడానికి 60 భారీ ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. స్టేజ్ దగ్గర ఉచిత వైఫై ఉంటుంది. దీనికోసం టెంపరరీరగా రెండు వైఫై టవర్లను ఏర్పాటు చేశారు.