• తాజా వార్తలు

కోట్ల పెట్టుబడితో హైదరాబాద్‌లో వన్‌ప్లస్ ఆర్‌అండ్‌ డి సెంటర్, దేశంలో మొదటిది

చైనాకు చెందిన ప్రముఖ మొబైల్స్ తయారీదారు వన్‌ప్లస్ దేశంలోనే తన తొలి రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ (ఆర్ అండ్ డీ) ఫెసిలిటీని ఏర్పాటు చేసింది. భారీ పెట్టుబడితో తన ఆర్‌అండ్‌ డి కేంద్రాన్ని తెలంగాణా రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఏర్పాటు చేసింది. రాష్ట్ర ఐటీ శాఖ మాజీ మంత్రి కేటీఆర్, ఐటీ, పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్‌లు నానక్‌రాంగూడలోని విప్రో సర్కిల్‌లో ఉన్న వంశీరామ్స్ ఐటీ పార్కులో వన్‌ప్లస్ ఆర్ అండ్ డీ సెంటర్‌ను ప్రారంభించారు. కాగా రానున్న 3 ఏళ్ల కాలంలో ఈ సెంటర్‌లో రూ.1వేయి కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు వన్‌ప్లస్ తెలిపింది. 

ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్  హైదరాబాద్‌లో వన్ ప్లస్ ఆర్ అండ్ డీ సెంటర్ కోసం వెయ్యి కోట్ల పెట్టుబడి పెట్టడం మంచి పరిణామమని కేటీర్‌ వ్యాఖ్యానించారు.  దీని ద్వారా రానున్న రెండేళ్లలో 1500 ఉద్యోగ అవకాశాలు రానున్నాయన్నారు.  సంస్థకు కావాల్సిన మద్దతును టీఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తుందని ఈ  సందర్భంగా  కేటీఆర్‌  హామీ ఇచ్చారు. అలాగే వన్ ప్లస్ మొబైల్స్ మనుఫ్యాక్చరింగ్ సెంటర్ కూడా హైదరాబాద్ లో ఏర్పాటు చేయాలని ఆయన అభిలషించారు. ప్రపంచంలోనే అతిపెద్ద కేంద్రంగా దీన్ని అభివృద్ది చేయాలని వన్‌ప్లస్‌ యోచిస్తోందని కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. 

వన్‌ప్లస్ హైదరాబాద్ ఆర్ అండ్ డీ సెంటర్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషిన్ లెర్నింగ్‌లపై పరిశోధనలు చేయనున్నారు. ఈ సెంటర్‌లో ప్రధానంగా 3 ల్యాబ్‌లు ఉంటాయి. ఒక దాంట్లో కెమెరాలు, మరొక దాంట్లో కమ్యూనికేషన్ అండ్ నెట్‌వర్కింగ్, ఇంకో దాంట్లో ఆటోమేషన్ రంగాలకు చెందిన నూతన ప్రొడక్ట్స్‌ను అభివృద్ధి చేస్తారు. ప్రధానంగా కెమెరా డెవలప్‌మెంట్, 5జీ టెస్టింగ్, సాఫ్ట్‌వేర్, ఏఐ ప్రొడక్ట్స్ టెస్టింగ్ పైనే ఎక్కువగా దృష్టి పెట్టనున్నారు. అలాగే నెట్‌వర్క్, ఆక్సిజన్ ఓఎస్ ఆధారిత యాప్స్ డెవలప్‌మెంట్‌పై కూడా దృష్టి సారించనున్నారు. కాగా ఈ సెంటర్‌ను భవిష్యత్తులో మరింత విస్తరిస్తామని వన్‌ప్లస్ వ్యవస్థాపక సీఈవో పీట్ లౌ తెలిపారు.
 

జన రంజకమైన వార్తలు