దేశంలో టెలికం కంపెనీలన్నీ కేంద్ర టెలికం శాఖకు యాన్యువల్ గ్రాస్ రెవెన్యూ (ఏజీఆర్) చెల్లించాలి. బకాయి లక్షన్నర కోట్ల రూపాయలకు చేరడంతో వాటిని వెంటనే కట్టాలని సుప్రీంకోర్టు ఆర్డర్స్ వేసింది. దీంతో నష్టాలు తట్టుకోలేమంటూ కంపెనీలు వెంటనే టారిఫ్ పెంచేశాయి. ప్రీపెయిడ్, పోస్ట్పెయిడ్ ఛార్జీలను 30 శాతం వరకు పెంచాయి. కానీ దీంతో ఏజీఆర్ బకాయిలే కట్టలేం, ఇక నిర్వహణ నష్టాలు దాటి లాభాల్లోకి ఎప్పుడు వెళ్లగలమని రిలయన్స్ జియో ఆలోచించింది.
అప్పుల నుంచి ఆదాయం వైపుగా
మరో ముకేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్కు ఈ మార్చి నాటికి లక్షా 61వేల కోట్ల రూపాయల అప్పులున్నాయి. వచ్చే ఏడాది కల్లా అప్పుల్లేకుండా నిలబడాలన్నది అంబానీ టార్గెట్. అందుకే తన కంపెనీల్లో బాగా పాపులరయిన జియోలో వాటాలు కొనుక్కోండని విదేశీ కంపెనీలకు డోర్లు తెరిచింది. తాజాగా అమెరికాకు చెందిన విస్టా ఈక్విటీ పార్టనర్స్ కంపెనీతో మరో మెగా ఒప్పందం చేసుకోవడానికి రెడీ అయింది. ఈ ఒప్పందం ద్వారా ఆర్ఐఎల్కు రూ.11,367 కోట్లు సమకూరనున్నాయి.
ఇది మూడోది
* ఏప్రిల్ 22 న జియోలో 9.99 శాతం వాటా కోసం రిలయన్స్ ఇండస్ట్రీస్ ఫేస్బుక్తో 43,574 కోట్ల రూపాయల ఒప్పందాన్ని కుదుర్చకుంది.
* తర్వాత ప్రైవేటు ఈక్విటీ సంస్థ సిల్వర్ లేక్ నుంచి రూ .5,656 కోట్ల పెట్టుబడి తీసుకుంది.
* ఇప్పుడు అమెరికాకు చెందిన విస్టా ఈక్విటీతో మరో 11, 637 కోట్లు వస్తున్నాయి.
* మూడు వారాల్లో ఈ పెట్టుబడులతో ప్రముఖ టెక్నాలజీ ఇన్వెస్టర్ల నుంచి రూ .60,596.37 కోట్లు పెట్టుబడులను సాధించగలిగామని రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రకటించింది. చూస్తుంటే జియో ముకేశ్ అంబానీకి బంగారు గుడ్లు పెట్టే బాతులా మారిందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి.