స్మార్ట్ఫోన్ వాడేవారిలో నూటికి 90 శాతానికి పైగా ఆండ్రాయిడ్ యూజర్లే. ఆండ్రాయిడ్ ఫోన్లలో ప్రధానమైన సమస్య బ్యాటరీ బ్యాకప్. ఎంత పెద్ద కెపాసిటీ ఉన్న బ్యాటరీ మీ ఫోన్లో ఉన్నా కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే బ్యాటరీ కొన్ని గంటల్లోనే ఖాళీ అయిపోతుంది. ఆ జాగ్రత్తలేంటో, ఆండ్రాయిడ్ ఫోన్లో బ్యాటరీ ఎలా సేవ్ చేసుకోవాలో చూద్దాం.
1. జీపీఎస్ లోకేషన్ ఆఫ్ చేయండి
మీ ఫోన్లో జీపీఎస్ ఆన్లో ఉంటే బ్యాటరీ చాలా తొందరగా డ్రైయిన్ అయిపోతుంది. కాబట్టి అవసరం లేనప్పుడు మీ ఫోన్లో జిపిఎస్ ఆఫ్ చేయండి. ఫోన్ సెట్టింగ్స్లోకి వెళ్లి లొకేషన్ క్లిక్ చేయండి. అక్కడ జిపిఎస్ ఆఫ్ చేసేయండి.
2. డార్క్ మోడ్ ఆన్ చెయ్యండి
దాదాపు ఇప్పుడు అన్ని ఆండ్రాయిడ్ ఫోన్లు డార్క్ మోడ్ ఆప్షన్తో వస్తున్నాయి. దీనికి బ్యాటరీ తక్కువ ఖర్చవుతుంది. అలాగే ఇప్పుడు వాట్సప్, ఫేస్బుక్ లాంటి మనం నిత్యం వాడే యాప్స్ కూడా డార్క్ మోడ్తో వస్తున్నాయి. ఈ ఆప్షన్ ఉపయోగించుకుంటే బ్యాటరీ మరింత సేవ్ చేసుకోవచ్చు
3.బ్యాక్ గ్రౌండ్ యాప్ యూసేజ్ను ఆపేయండి
యాప్స్ వాడిన తర్వాత చాలామంది వాటిని బ్యాక్ గ్రౌండ్లో అలాగే వదిలేస్తారు. దీంతో డేటాతోపాటు బ్యాటరీ కూడా మనకు తెలియకుండానే ఖర్చయిపోతాయి. కాబట్టి బ్యాటరీ సేవ్ చేసుకోవాలంటే బ్యాక్ గ్రౌండ్లో యాప్స్ రన్నింగ్ కాకుండా కంట్రోల్ చేయండి. సెట్టింగ్స్లోకి వెళ్లి యాప్స్ను క్లిక్ చేయండి తర్వాత యాప్ సెలెక్ట్ చేసి పవర్ సేవర్ లేదా బ్యాటరీ యూసేజ్ను క్లిక్ చేయండి. తర్వాత డోంట్ రన్ ఆన్ బ్యాక్ గ్రౌండ్ ఆప్షన్ పెట్టుకోండి.
4. బ్యాటరీ కిల్లింగ్ యాప్స్ని గుర్తించండి
కొన్ని యాప్స్, వాటిలో ఉండే బగ్స్ మీ ఫోన్ బ్యాటరీని వేగంగా తినేస్తాయి. ఇలాంటి యాప్స్ను గుర్తించి వెంటనే డిలీట్ చెయ్యండి. సెట్టింగ్స్లోకి వెళ్లి బ్యాటరీ క్లిక్ చేయండి. దానిలో పవర్ యూసేజ్ ఆప్షన్ క్లిక్ చేస్తే యాప్ ఎంత పవర్ తీసుకుంటుందో తెలుస్తుంది. ఎక్కువ పవర్ వాడుకుంటున్న యాప్స్ను డిలీట్ చేయండి. అవి మీకు అవసరమైనవి అయితే డోంట్ రన్ ఆన్ బ్యాక్గ్రౌండ్ ఆప్షన్ వాడుకోండి.