ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో రెండేళ్ల కిందటే మొదలైన ఆండ్రాయిడ్ పే చెల్లింపుల ప్లాట్ ఫాం సేవలు ఇండియాలో మాత్రం ఇంకా మొదలవలేదు. గూగుల్ సంస్థకు చెందిన ఈ పేమెంట్ ప్లాట్ ఫాం ద్వారా నగదు చెల్లింపులు, బదిలీ సాధ్యమవుతాయి. అయితే... ఇండియాలో దీనికి ఇంకా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అనుమతి రాకపోవడంతో సేవలు ప్రారంభం కాలేదు. త్వరలో ఆర్బీఐ నుంచి గూగుల్ కు అనుమతి రానున్నట్లు తెలుస్తోంది.
ఆర్బీఐ నుంచి అనుమతి వస్తే థర్డ్ క్వార్టర్ నుంచి భారత్ లో గూగుల్ ఆండ్రాయిడ్ పే సర్వీసెస్ ప్రారంభం కావొచ్చని అంచనా వేస్తున్నారు.
కాగా ఈ యాప్ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) విధానం ద్వారా పనిచేయనుంది. దీంతో ఆన్లైన్లో నగదును ట్రాన్స్ఫర్ చేసుకోవడమే కాదు, బిల్లు చెల్లింపులు కూడా జరపవచ్చు. ఇప్పటికే పలు దేశాల్లో ఆండ్రాయిడ్ పే వినియోగంలో ఉంది.
మరోవైపు గూగుల్ తరహాలోనే అమెజాన్, ఫేస్బుక్, వాట్సాప్, ఊబర్ తదితర సంస్థలు సొంతంగా తమ యాప్లు, వెబ్సైట్లలో యూపీఐ పేమెంట్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. అయితే ఈ సంస్థలు ఇంకా దీనిపై చర్చలు జరిపే దశలోనే ఉన్నాయని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ వర్గాలు చెప్తున్నాయి.