హైపర్లూప్..ఇప్పుడు ఈ పదమే ఓ వైబ్రేషన్..ప్రపంచాన్ని నివ్వెరపరుస్తోంది. దాని వేగం తలుచుకుంటనే వణుకు పుడుతోంది. మరి దానిలో ప్రయాణం గురించి తలుచుకుంటే ప్రాణాలు గాలిలోకే..అలాంటి టెక్నాలజీ కోసం ఇప్పుడు యావత్ ప్రపంచం ఇప్పుడు ఎదురుచూస్తోంది. అసలేంటి ఈ హైపర్లూప్ టెక్నాలజీ. దీనికి ఆధ్యులు ఎవరు..దీని వేగమెంత ఓ సారి చూద్దాం.
తొలుత గంటకు 1000 కిలోమీటర్ల వేగాన్ని అందుకుని ఆ తరువాత 4000 కిలోమీటర్ల వేగంతో దూసుకువెళ్లే రైలే హైపర్ లూప్. దీన్ని రైలు అనడం కన్నా నేలమీద నడిచే విమానం అంటే బాగుంటుందేమో. దీని వేగంపై ఎవరికీ క్లారిటీ లేదు.
ఈటెక్నాలజీకి ఆధ్యుడు ఇలాన్ మస్క్. ఇతను వాక్యూమ్ ట్యూబ్ల వంటి సాధనాల్లో భూమ్మీద అతి వేగంగా ప్రయాణించవచ్చనే కాన్సెప్ట్ను 2013లో మస్క్ బయటపెట్టి దానికి ‘హైపర్లూప్' అనే పేరు పెట్టాడు. అంతేకాక ఈ ఓపెన్ సోర్స్ టెక్నాలజీని ఎవరైనా అభివద్ధి చేయొచ్చునని ప్రకటించాడు.
అది జరిగిన ఏడాదికి ఈ టెక్నాలజీ కోసం తాము నిధులు సమీకరించామని ‘హైపర్లూప్ ట్రాన్స్పోర్ట్ టెక్నాలజీస్ (హెచ్టీటీ)' సంస్థ ప్రకటించింది. తరువాత... తామూ రేసులో ఉన్నట్లు ‘హైపర్లూప్ ఒన్' అనే మరో సంస్థ ప్రకటించింది. వీటిల్లో ప్రధానమైనది హెచ్టీటీ కంపెనీ. దీనిలో ఇప్పుడు 500 మంది ఇంజనీర్లు పనిచేస్తున్నారు. వీరికి జీతాలు లేవు. ప్రాజెక్టు వాటాలు మాత్రమే ఉన్నాయి. ప్రాజెక్ట్ సక్సెస్ అయితే కోట్లకు పడగలెత్తుతారు.ఈ ప్రాజెక్ట్ ఇప్పుడిప్పుడే పరుగులు పెడుతోంది. అనేక దేశాలు దీనివెంట పరుగులు పెడుతున్నాయి.
ఇందులో ఇండియా కూడా ఉంది. ఇక చైనా అయితే ఇప్పటికే దీని పోటీగా టీ-ప్లైట్ పేరుతో సరికొత్త టెక్నాలజీని తయారుచేస్తోంది.దీనిపై పరిశోధనలు ముమ్మరంగా సాగుతున్నాయి. దీనికి నిధులు కూడా భారీగానే వచ్చాయి. దాదాపు 9 కోట్ల డాలర్లకు పైగానే నిధులను సేకరించారు.ముందుగా 150 మిలియన్ డాలర్ల వ్యయంతో (రూ.1,000 కోట్లు) రెండున్నరేళ్లలో కాలిఫోర్నియాలో టెస్ట్ ట్రాక్ను నిర్మించే ప్రయోగం పూర్తి చేయాలనేది ఈ కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.ట్రాక్ నిర్మాణంలో సహకారానికి ఓర్లికాన్ లేబోల్డ్ వాక్యూమ్, ఏకామ్ సంస్థలతో ఒప్పందాలు కూడా చేసుకుంది.
అయితే ఇంకో కంపెనీ హైపర్లూప్ ఒన్ గతేడాది మే 11న తొలిసారిగా ఈ టెక్నాలజీని ప్రత్యక్షంగా పరీక్షించింది. జులైలో... హెల్సింకీ- స్టాక్హోమ్ మధ్య హైపర్లూప్కు అవకాశాలు బాగున్నాయంటూ తమ అధ్యయన నివేదికను బయటపెట్టింది.ఈ రెండింటి మధ్య ప్రయాణ సమయం అర్ధగంటకు పరిమితమవుతుందని, నిర్మాణ వ్యయం 19 బిలియన్ యూరోలుంటుందని అంచనా వేసింది. అంటే మన కరెన్సీలో రూ.1,430 కోట్ల పైమాటే.
అసలింతకీ ఇది ఎలా పనిచేస్తుందంటే గాలి లేని ట్యూబ్ లో ఈ వాక్ ట్రెయిన్ నడుస్తుంది. ఎంత వేగంగా వెళ్లినా గాలి నిరోధం అక్కడ ఉండదు. యంత్రపరికరాల మధ్య ఘర్షణ ఉండదు. అలాగే తక్కువ ఇంధనం తీసుకుంటుంది. కాబట్టి పైలాన్లపై గానీ, భూగర్భంలో గానీ ట్యూబ్ లాంటి నిర్మాణం చేసి... ఆ ట్యూబ్లో చిన్న చిన్న ‘పోడ్'లాంటి వాక్ ట్రయిన్లు నడుపుతారన్న మాట. తొలి డిజైన్ ప్రకారం... ఈ పోడ్ల ఎత్తు కేవలం 7.4 అడుగులే ఉంటుంది. గరిష్ఠ వేగం గంటకు 1,220.ఇది ఎప్పుడు పూర్తి స్థాయిలో బయటకొస్తుందనేది ఎవ్వరికీ అంతుపట్టని విషయం. స్పేస్ ఎక్స్ అధినేత మాత్రం ఇది 2021 నాటికి ప్రపంచానికి పరిచయం అవుతుందని చెబుతున్నారు.