2020 తర్వాత అడోబ్ ఫ్లాష్ ప్లేయర్ కనిపించదు..
ఆన్లైన్లో మీడియా కంటెంట్ చూడాలంటే ఒకప్పుడు ఉన్న ఒకే ఒక ఆప్షన్.. అడోబ్ ఫ్లాష్ ప్లేయర్. 20 ఏళ్ల క్రితం ప్రారంభమైన అడోబ్ ఫ్లాష్ ప్లేయర్ జర్నీ మరో మూడేళ్లలో ముగిసిపోతుంది. యాపిల్, మైక్రోసాఫ్ట్, గూగుల్, ఫేస్బుక్, మొజిల్లా వంటి టెక్నాలజీ దిగ్గజాలన్నింటికీ మీడియా ప్లేయర్గా ఎంతో పేరు సంపాదించుకున్నఅడోబ్ 2020 తర్వాత అప్డేట్స్ ఇవ్వడం ఆపేస్తుందని కంపెనీ ప్రకటించింది. యూజర్లు దీని నుంచి కొత్త ప్రోగ్రామ్లకు మైగ్రేట్ కావాలని సజెస్ట్ చేస్తుంది.
20 ఏళ్ల క్రితం జర్నీ మొదలు
20 ఏళ్ల క్రితం ఫ్లాష్ ప్లేయర్ తన ప్రయాణాన్ని ప్రారంభించింది. గేమ్స్ క్రియేషన్, వీడియో ప్లేయర్లు, మల్టిపుల్ వెబ్బ్రౌజర్లలో రన్నింగ్ అయ్యే అప్లికేషన్లకు ఫ్లాష్ ప్లేయర్ తప్పనిసరి అయ్యేది. అడోబ్ 2005లో ఫ్లాష్ ప్లేయర్ను ఎక్వైర్ చేసేనాటికి వెబ్, మాక్రోమీడియాలతో కనెక్టయి ఉన్న పీసీల్లో 98% వరకు ఫ్లాష్ ప్లేయర్ ఉండేది. అయితే యాపిల్ తన ఐఫోన్కు ఫ్లాష్ ప్లేయర్ సపోర్ట్ తీసుకోకూడదని నిర్ణయించినప్పటి నుంచి ఫ్లాష్ ప్లేయర్ పతనం మొదలైంది. HTML5 లాంటి టెక్నాలజీలు రావడంతో దీని ప్రాధాన్యం తగ్గిపోయింది. 2014లో గూగుల్ క్రోమ్ బ్రౌజర్వాడుతున్న పీసీ యూజర్లలో 80% మంది ఫ్లాష్ ప్లేయర్ ను వాడేవారు. ఇప్పుడు అది 17%కు పడిపోయింది. ఈ డిక్లెయిన్ ఇలా కంటిన్యూ అవుతూనే ఉంది. ఓపెన్ వెబ్ టెక్నాలజీలు, ఫ్లాష్ కంటే పవర్పుల్, ఎఫీషియంట్ ప్లేయర్ల వైపు సైట్లు మొగ్గు చూపుతున్నాయని దీన్ని బట్టి అర్ధమవుతోంది.
ఈ పరిస్థితుల్లో మార్కెట్ నుంచి వైదొలగడమే మంచిదని ఫ్లాష్ యాజమాన్యం నిర్ణయించింది. అయితే ఫేస్బుక్, యూనిటీ టెక్నాలజీస్, ఎపిక్ గేమ్స్కు మాత్రం తర్వాత కొన్నాళ్లపాటు అందుబాటులో ఉంటుంది.