స్మార్టుఫోన్లను ఎంత ధర పెట్టి కొంటున్నా ఏదో ఒక ఇబ్బందులు ఉంటూనే ఉంటాయి. బ్యాటరీ ప్రాబ్లమో లేక కనెక్టివిటీ ప్రాబ్లమో మరేదైనా ఇబ్బందులు ఉంటాయి. అయితే ఇలాంటి కామన్ ప్రాబ్లమ్స్ను మనం ఎలాగైనా ఫేస్ చేయచ్చు. కంపెనీకి పంపి కొత్త పీస్ తీసుకోవడమో లేక కేర్ సెంటర్కు వెళ్లి బాగు చేయించడమో చేయచ్చు. అయితే ఇవన్నీ కాక ఫోన్ పేలిపోతే! ఈ ఊహా భయంగా ఉంది కదా! అయితే ఇప్పుడు కొన్ని పెద్ద కంపెనీ ఫోన్లు కూడా ఇలా పేలడమే ఇంకా ఆందోళన కలిగించే విషయం. మొన్నటికి మొన్న లెనొవో.. ఇప్పుడు ఆ జాబితాలో హెచ్టీసీ డిజైర్ చేరింది.
డిజైర్ 10 ప్రొతోనే ఇబ్బంది
హెచ్టీసీని చాలామంది వినియోగదారులు నమ్ముతారు. దీనికి కారణం హీట్ సమస్య లేకపోవడం, ఇబ్బందులు వచ్చినా వెంటనే పరిష్కారం కావడమే. అయితే తాజాగా విడుదల చేసిన డిజైర్ 10 ప్రొ మోడల్తో ఒక ఇబ్బంది వచ్చిపడింది. ఈ ఫోన్లు ఈ మధ్య పేలుతున్నాయట. తాజాగా దిల్లీలో ఒక ఆమెకు ఈ అనుభవం ఎదురైంది. అంతేకాక ఇంకా ఇలాంటి కంప్లయింట్లు వస్తున్నట్లు ఫోన్ అమ్మకం దారులు చెబుతున్నారు. ఇటీవల జరిగిన సంఘటనలో నిధి కపూర్ అనే అమ్మాయికి చేతులు కాలాయి. అంతేకాదు తీవ్రమైన కంటి ఇన్ఫెక్షన్ కూడా వచ్చినట్లు ఆమె తెలిపింది. ఈ మేరకు ఆమె తన ఫేస్బుక్లో ఆమె పోస్ట్ పెట్టింది. మిగిలిన వినియోగదారులు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
డిజైర్ మాత్రమే కాదు..
అయితే ఫోన్లు పేలడం అనేది ఇప్పుడు కొత్తకాదు. భారత మార్కెట్ను ఎప్పుడైతే చైనా కంపెనీలు కమ్మేశాయో అప్పటినుంచే ఇది మొదలైంది. అయితే ఈ మధ్య ఆ ప్రభావం తగ్గినా.. మళ్లీ ఇలాంటి కేసులు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. నాణ్యమైన, నమ్మకమైన బ్రాండ్గా పేరున్న శాంసంగ్ కూడా ఈ జాబితాలో ఉంది. శాంసంగ్ గెలాక్సీ నోట్ 7లో ఎప్పటినుంచో బ్యాటరీ ఇబ్బందులు ఉన్నాయి. విపరీతంగా వేడెక్కడం.. పేలడం లాంటి సంఘటనలు జరిగాయి. ఇక లెనొవొ కే3 నోట్ ఫోన్లు కూడా ఈ మధ్య పేలాయి. దీనికి చాలా రకాల కారణాలు ఉన్నాయి. ఈ కంపెనీలన్నీ పెద్ద బ్రాండ్లే అయినా.. వీటికి బ్యాటరీలు తయారు చేసే కంపెనీలన్నీ చైనావే కావడం దీనికి కారణం. అయితే ప్రమాణాలు పాటించినప్పుడు పర్వాలేదు కానీ ఏమైనా తప్పినప్పుడే ఇబ్బందులు ఎదురవుతున్నాయి.