వేలాది రూపాయిలు పెట్టిపోసి కొన్న లాప్టాప్ను ఎవరైనా దొంగిలిస్తే చాలా బాధాకరం. మనం ఎంత వెతికినా.. ఎంతగా బాధపడినా.. ఎవరిని విచారించినా.. చివరికి పోలీసు కంప్లైట్ ఇచ్చినా లాప్టాప్ తిరిగొస్తుందన్న గ్యారెంటీ లేదు. అయితే పోయిన లాప్టాప్ను టెక్నాలజీ ద్వారా కనుక్కోగలిగితే! అంతకంటే ఆనందం ఏముంటుంది!! సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఇలాంటి టెక్నాలజీనే రూపొందించింది. దీనికి పేటెంట్ హక్కులు కూడా సంపాదించింది. మరి ఆ టెక్నాలజీ ఏంటో చూద్దామా..
పోయిన ఫోన్లను కనుక్కున్నట్లే..
సాధారణంగా ఫోన్ పోతే ఐఎంఈఐ నంబర్ ద్వారా ఏ సిమ్ ద్వారా ఆ ఫోన్ వాడుతున్నారో తెలుసుకునే అవకాశం ఉంటుంది. అయితే చాలామందికి తమ ఫోన్ల గురించే పూర్తిగా తెలియదు. ఇక ఈ నంబర్లు ఎక్కడ గుర్తు పెట్టుకుంటారు. అయిత ఐఎంఈఐ నంబర్ ఉంటే ట్రేస్ చేయడానికి చాలా సులభంగా ఉంటుంది. ఇదే సూత్రం లాప్టాప్కు కూడా వర్తిస్తుంది. పోగొట్టకున్న లేదా కొట్టేసిన లాప్టాప్ను కనుక్కోవాలంటే ఎల్టీఈ ఆప్షన్ ఉపయోగపడుంది. గతంలో మైక్రోసాఫ్ట్ పోయిన ల్యాప్టాప్లను కనిపెట్టడానికి ఫైండ్ మై డివైజ్.. అనే ఫీచర్ను అందుబాటులోకి తెచ్చింది. కానీ ఇదంత విజయవంతం కాకపోవడంతో లాప్టాప్కు యాక్టివ్ సెల్యూలర్ కనెక్షన్ను అనుసంధానం చేస్తూ ఎల్టీఈ ఆప్షన్ను ప్రవేశపెట్టింది.
వెంటనే పసిగడుతుంది
లాప్టాప్తో సెల్యులర్ సిగ్నల్స్ కనెక్ట్ అయి ఉండడం వల్ల ఆ సిగ్నల్స్ మనకు తెలియకుండా ఎప్పుడు కట్ అయినా వెంటనే మనం రియాక్ట్ కావచ్చు. అంతేకాదు సిగ్నల్ అలా ఉన్నట్టుండి డిస్కనెక్ట్ అయితే మనకు మన ఫోన్కు వెంటనే ఒక మెసేజ్ వస్తుంది. మళ్లీ డివైజ్న ఆన్ చేసిన వెంటనే అది ఏ లొకేషన్లో ఉందే కూడా మనకు సమాచారం అందుతుంది. దాన్ని బట్టి ట్రేస్ చేసే అవకాశం ఉంది. సిమ్ తీయాలని ప్రయత్నించినా.. సెల్యులర్ సర్వీస్ను డిస్కనెక్ట్ చేసినా వెంటనే మనకు తెలిసిపోతుంది. అయితే సెల్యులర్ కంపెనీలు ఇంకా ఈ కొత్త టెక్నాలజీ విషయంలో పూర్తిగా ఒక అవగాహనకు రాలేదు. ఏదేమైనా లాప్టాప్ను కనిపెట్టడంలో దీనికి మించిన టెక్నిక్ లేదని అనిపిస్తోంది. అందుకే మైక్రోసాఫ్ట్ వెంటనే ఈ టెక్నాలజీకి పేటెంట్ కూడా తీసేసుకుంది.