వొడాఫోన్ ఐడియా కలిసిపోయి వీఐగా కొత్త పేరుతో మార్కెట్లో నిలబడ్డాయి. అయితే కంపెనీ పేరు మారినా ఈ టెలికం కంపెనీని యూజర్లు పెద్దగా నమ్మట్లేదు. ఒక్క సెప్టెంబర్లోనే వీఐ ఏకంగా 46 లక్షల మంది కస్టమర్లను కోల్పోయింది. ఇలా బయటకు వెళ్లిన కస్టమర్లు జియో లేదా ఎయిర్టెల్ కనెక్షన్లు తీసుకుంటున్నారు. వీఐ కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఎయిర్టెల్, రిలయన్స్ జియో మధ్య ఇప్పుడు బీభత్సమైన పోటీ నడుస్తోంది.
6 నెలలు జియో టాప్ గేర్
ఈ ఏడాది మార్చి క్వార్టర్లో జియో నెట్వర్క్కు 1.75 కోట్ల మంది కొత్త యూజర్లు యాడ్ అయ్యారు. అదే 3 నెలల్లో ఎయిర్టెల్కు వచ్చిన కొత్త కస్టమర్లు 6 లక్షల 30 వేల మంది మాత్రమే. తర్వాత 3నెలల్లో ఎయిర్టెల్ నుంచి 38 లక్షల మంది కస్టమర్లు బయటకు వెళ్లిపోతే జియో ఏకంగా కోటిమందికి పైగా కస్టమర్లను చేర్చుకగలిగింది.
ఇప్పుడు ఎయిర్టెల్ హవా
అయితే మొదటి ఆరు నెలలు జియో ముందకెళితే జులై నుంచి సెప్టెంబర్ వరకు 3 నెలల్లో మాత్రం ఎయిర్టెల్ ముందడుగు వేసింది. ఈ 3 నెలల్లో జియోకు కొత్తగా 73 లక్షల కనెక్షన్లు వస్తే ఎయిర్టెల్కి ఏకంగా కోటీ 39 లక్షల మంది యాడ్ అయ్యారు. ఇందులో ఎక్కువ మంది 4జీ, పోస్ట్పెయిడ్ కస్టమర్లు యాడ్ అవుతున్నారు. తాజాగా 3 నెలల ఫలితాలను బట్టి చూస్తే ఎయిర్టెల్, జియో మధ్య కస్టమర్ల సంఖ్యలో తేడా బాగా తగ్గుతోంది. మొత్తంగా ఇండియన్ టెలికం రంగంలో జియో, ఎయిర్టెల్ మధ్యే పోటీ ఉంది.