క్వికర్, ఓఎల్‌ఎక్స్ ద్వారా జరుగుతున్నా మోసాల్లో ఇవి కొన్ని మాత్రమే

ప్రస్తుతం ఆన్‌లైన్‌లో సెకండ్ హ్యాండ్ వస్తువులకు ఎంతటి గిరాకీ ఉందో అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ వేదికలను ఆసరాగా చేసుకుని కొందరు దుండగులు మోసాలకు పాల్పడుతున్నారు. వీరి భారీన బాగా చదువుకున్న వాళ్లు కూడా పడుతున్నారు. భారీగా నష్టపోతున్నారు. ఇంతకీ అసలీ మోసాలు ఎలా జరుగుతున్నాయో ఓ సారి చూద్దాం.

క్వికర్ లేదా ఓఎల్‌ఎక్స్ సైట్‌లో మనం ఏదైనా వస్తువును అమ్ముతామంటూ యాడ్ పోస్ట్ చేయగానే మనకు కాల్స్ స్టార్ట్ అవుతాయి.కొన్ని నంబర్ల నుంచి కాల్స్ చేస్తూ మనం చెబుతున్న ధరకు ఇంకా ఎక్కువగానే ఇచ్చి ఆ వస్తువును కొంటామంటారు. వారు వెంటనే వస్తువును ఈ అడ్రసుకు పంపించండి. మేము జీపే, ఫోన్‌పే, ఇతర యాప్‌ల ద్వారా యూపీఐ పద్ధతిలో డబ్బు పంపుతున్నామని చెబుతారు.

అయితే ఇక్కడే వారు అసలు కిటుకు ప్రదర్శిస్తారు. ఎలా అంటే.. సాధారణంగా మనం వాడే యూపీఐ యాప్‌లలో రెండు ఆప్షన్లు ఉంటాయి. ఒకటి సెండ్ మనీ. రెండు రిక్వెస్ట్ మనీ. సెండ్ మనీ అంటే.. మనం అవతలి వారికి డబ్బు పంపుకోవచ్చు. అదే రిక్వెస్ట్ మనీ కొడితే అవతలి వారిని డబ్బు అడుగుతూ మన రిక్వెస్ట్ వారికి చేరుతుంది. ఇదే వారికి ఆసరాగా మారింది. వారు మనకు యూపీఐ ద్వారా డబ్బులు పంపకుండా రిక్వెస్ట్ మనీ ఆప్షన్‌తో మనల్ని డబ్బులు రిక్వెస్ట్ చేస్తూ మెసేజ్ పెడతారు. అయితే అది చూసుకోకుండానే రిప్లయి ఇస్తే.. వెంటనే మన అకౌంట్‌లోంచి డబ్బులు వారి అకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫర్ అవుతాయి. ప్రస్తుతం క్వికర్, ఓఎల్‌ఎక్స్‌లో ఇవే తరహా మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. కనుక యూపీఐ యాప్‌లను వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అవతలి వారు మనకు డబ్బు పంపారా, మనల్ని డబ్బు రిక్వెస్ట్ చేశారా..? అన్నది వెరిఫై చేసుకుని మరీ ఆ మెసేజ్‌లకు స్పందించాలి. లేదంటే అనవసరంగా డబ్బు నష్టపోవాల్సి వస్తుందని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు..! 

ఈ జాగ్రత్తలు పాటించండి.
యూపీఐ విధానంలో డబ్బు పంపుతున్నారా.. డబ్బు కోసం రిక్వెస్ట్ పెడుతున్నారా.. అన్న విషయంలో స్పష్టత ఉండాలి.  డబ్బు పంపేట్లయితే మీకు వచ్చే ఓటీపీలను ఎవరికీ చెప్పకూడదు. మీ యూపీఐ పిన్ నంబర్‌ను గోప్యంగా ఉంచుకోవాలి. దాన్నీ ఎవరికీ చెప్పకూడదు. దాన్ని అడుగుత్నునారంటే.. మిమ్మల్ని చీటింగ్ చేసేందుకేనన్న విషయం తెలుసుకోవాలి. ఫోన్‌లో ఉన్న యూపీఐ యాప్స్‌కు లాక్ పెట్టుకోవాలి.

క్వికర్ ఓఎల్‌ఎక్స్ యూపీఐ యాప్స్ యూపీఐ పిన్ నంబర్‌