ట్రూకాలర్ యాప్ వెంటనే తీసివేయండి, లేకుంటే చిక్కుల్లో పడతారు

ట్రూకాలర్ యాప్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. అపరిచిత వ్యక్తులతో పాటు పలు కంపెనీల నుంచి వచ్చే కాల్స్, అడ్వర్టయిజింగ్ మెసేజ్‌ల బారి నుంచి తప్పించుకునేందుకు మనకు ఈ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుంది.  ట్రూకాలర్ యాప్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫాంలపై అందుబాటులో ఉన్న విషయం విదితమే. ఈ యాప్ వల్ల స్పాం కాల్స్, ఎస్‌ఎంఎస్‌లకు స్మార్ట్‌ఫోన్ యూజర్లు అడ్డుకట్ట వేయవచ్చు. యాప్ సహాయంతో సదరు కాల్స్ చేసే, ఎస్‌ఎంఎస్‌లను పంపే ఫోన్ నంబర్లను యూజర్లు బ్లాక్ చేయవచ్చు. దీంతో అవాంఛిత కాల్స్, మెసేజ్‌ల బాధ తప్పుతుంది. 

అయితే ఇప్పుడు ట్రూకాలర్ యూజర్లు అలర్ట్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ట్రూకాలర్ యాప్‌లో మీకు తెలియకుండా, అసలు మీ ప్రమేయం లేకుండా యూపీఐ అకౌంట్ క్రియేట్ అవుతోంది. ఈ మేరకు పెద్ద ఎత్తున ట్రూ కాలర్ యూజర్లు ఈ విష‌యంపై ఫిర్యాదు చేస్తున్నారు. దీన్ని 'యూపీఐ స్కామ్' అని పేరు కూడా పెట్టారు. తమ ప్రమేయం లేకుండా ఐసీఐసీఐ బ్యాంక్ యూపీఐ అకౌంట్లు ఆటోమెటిక్‌గా క్రియేట్ అయ్యాయని ఆండ్రాయిడ్ యూజర్లు కంప్లైంట్ చేస్తున్నారు. 

ఇటీవల ట్రూకాలర్ యాప్ 10.41.6 వర్షన్ అప్‌డేట్ చేసినవాళ్లకు ఇలా యూపీఐ అకౌంట్లు క్రియేట్ అయ్యాయని తెలుస్తోంది. ఆ యాప్‌లో వచ్చిన అప్‌డేట్‌తో మన బ్యాంక్ అకౌంట్‌లకు ముప్పు ఏర్పడిందని వారు చెబుతున్నారు. ఈ యాప్ కొత్త వెర్షన్‌కు అప్‌డేట్ అయిన యూజర్ల బ్యాంక్ యూపీఐ ఖాతాలు ట్రూ కాలర్ పే ఫీచర్‌లో ఆటోమేటిక్‌గా యాడ్ అవుతున్నాయి. 

ట్రూకాలర్‌లో యూజర్ల ప్రమేయం లేకుండా యూపీఐ అకౌంట్లు క్రియేట్ కాగానే ఐసీఐసీఐ నుంచి మెసేజ్ వచ్చింది. కొందరికి యూపీఐ అకౌంట్ డీయాక్టివేట్ అయినట్టు మెసేజ్ వచ్చింది. అసలు తమకు యూపీఐ అకౌంటే లేనప్పుడు డీయాక్టివేట్ ఎలా అవుతుందన్న అనుమానాలు యూజర్లలో మొదలయ్యాయి. ఫోన్‌లో ఇన్‌బాక్స్ చూస్తే ఎన్‌క్రిప్టెడ్ మెసేజెస్ కనిపించాయి. 

ఓ యూజర్ ట్రూకాలర్ 'యూపీఐ స్కామ్'పై నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు కంప్లైంట్ చేశాడు. దీంతో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-NPCI దర్యాప్తు మొదలుపెట్టింది. మరోవైపు ట్రూకాలర్ కూడా స్పందించింది. ఆటోమెటిక్‌గా యూపీఐ అకౌంట్లు క్రియేట్ కావడానికి కారణమైన 10.41.6 వర్షన్‌ను తొలగించింది. ఓ బగ్ కారణంగా ఈ సమస్య తలెత్తిందని క్షమించాలని యూజర్లను కోరింది. 

ప్రస్తుతం ప్లే స్టోర్‌లో పాత వర్షన్ 10.40.7 కనిపిస్తోంది. ఇప్పటికే యాప్ అప్‌డేట్ చేసిన వారికి కొత్త వర్షన్ రిలీజ్ చేయనుంది. ట్రూకాలర్‌కు ఇండియాలో 10 కోట్లకు పైగా యాక్టీవ్ యూజర్లు ఉన్నారు. కాగా ట్రూకాలర్ 2017లో ఐసీఐసీఐ బ్యాంకుతో కలిసి యూపీఐ బేస్డ్ మొబైల్ పేమెంట్ సర్వీస్ ప్రారంభించింది .

ట్రూకాలర్ యాప్ ఆండ్రాయిడ్ ఐఓఎస్ స్పాం కాల్స్ ఎస్‌ఎంఎస్‌ యూపీఐ ఖాతాలు ట్రూ కాలర్ పే ఫీచర్‌